త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Fake Tea Powder Racket Busted in Hyderabad | కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు.. కొబ్బరి పీచు, రసాయనాలతో డేంజర్ టీ!

హైదరాబాద్‌ సనత్‌నగర్‌ పరిధిలో టీ పొడిని కల్తీ చేస్తున్న ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. కొబ్బరి పీచు, ప్రమాదకరమైన సింథటిక్ రంగులు వాడి స్థానిక టీ స్టాళ్లకు సరఫరా చేస్తున్న ప్రధాన నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

J

Hyderabad | Published On Feb 24, 2026, 5.06 pm IST

Fake Tea Powder Racket Busted in Hyderabad | కల్తీ టీ పొడి ముఠా గుట్టురట్టు.. కొబ్బరి పీచు, రసాయనాలతో డేంజర్ టీ!
Advertisement
  • ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారి అరెస్ట్

Fake Tea Powder Racket Busted in Hyderabad | త్రినేత్ర.న్యూస్ : ఉదయం లేవగానే ఒక కప్పు వేడి వేడి టీ పడితే కానీ చాలామందికి రోజు మొదలవ్వదు. కానీ, మనం రోజూ ఎంతో ఇష్టంగా తాగే ఆ టీలో ప్రాణాలు తీసే విషం దాగి ఉంటే? అవును, కాసుల కక్కుర్తి కోసం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ఒక కల్తీ టీ పొడి ముఠా హైదరాబాద్‌లో పోలీసులకి చిక్కింది. పక్కా సమాచారంతో వెస్ట్ జోన్ కమిషనర్ టాస్క్ ఫోర్స్ బృందం, సనత్ నగర్ పోలీసులతో కలిసి సనత్ నగర్ పరిధిలోని ఒక గోదాముపై మెరుపు దాడి చేసి భారీ కల్తీ వ్యవహారాన్ని రట్టు చేసింది.

కల్తీ ఎలా చేస్తున్నారంటే.. పోలీసులకే మైండ్ బ్లాక్!

నిందితుడు జగన్నాథ్ బిష్ణోయ్ అక్రమ లాభాల కోసం ఎంచుకున్న మార్గం చూసి పోలీసులే విస్తుపోయారు. అసలు టీ ఆకులకు బదులుగా, నర్సరీలలో వాడే కోకోపీట్ (కొబ్బరి పీచు పొడి) ను అతను ప్రధాన ముడిసరుకుగా వాడుతున్నాడు. ముందుగా కోకోపీట్‌లోని వ్యర్థాలను తొలగించి, దానిని వేడి బెల్లం నీటిలో కలుపుతాడు. ఆ మిశ్రమాన్ని రెండు మూడు రోజుల పాటు ఆరబెట్టి, దానికి 'సన్‌సెట్ ఎల్లో', 'టార్ట్రాజైన్ ఆరెంజ్' వంటి ప్రమాదకరమైన సింథటిక్ ఫుడ్ కలర్స్‌ను దట్టంగా పట్టిస్తాడు. రంగును పీల్చుకున్న ఈ మిశ్రమాన్ని మళ్లీ ఎండబెట్టి కల్తీకి సిద్ధం చేస్తాడు.

ఒక కిలో కల్తీ టీ పొడిని తయారు చేయడానికి.. 450 గ్రాముల నాసిరకం టీ డస్ట్, 500 గ్రాముల నాసిరకం టీ గ్రాన్యూల్స్, 50 గ్రాముల రంగు కలిపిన కోకోపీట్ కలిపి ప్యాక్ చేస్తాడు. ఇలా తయారైన కల్తీ టీ పొడిని అసలైన బ్రాండెడ్ టీ పొడిగా నమ్మించి, స్థానిక టీ స్టాళ్లకు, ఇతర డీలర్లకు అధిక ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు.

నిందితుడి పేరు జగన్నాథ్ బిష్ణోయ్ (33), తండ్రి పేరు గాంధీ బిష్ణోయ్, ఫతేనగర్, హైదరాబాద్‌లో నివాసం ఉంటూ టీ వ్యాపారం చేస్తుంటాడని పోలీసులు తెలిపారు. దాడి సమయంలో పోలీసులు భారీ ఎత్తున కల్తీ సరుకును సీజ్ చేశారు. వాటిలో.. రంగు కలిపిన కల్తీ టీ పొడి 120 కిలోలు, కోకోపీట్ మిశ్రమం 138 కిలోలు, సహజమైన టీ పొడి 30 కిలోలు, సింథటిక్ రంగులు సన్‌సెట్ ఎల్లో (800 గ్రాములు), టార్ట్రాజైన్ (700 గ్రాములు) స్వాధీనం చేసుకున్నారు. అలాగే తయారీ సామగ్రి డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్, 12 బెల్లం బాక్సులు (ఒక్కోటి 500 గ్రాములు), వెయింగ్ మెషిన్, బీకర్, క్యారీ బ్యాగ్ బండిల్స్ (10 కిలోలు) సీజ్ చేశారు.

ప్రజలకు పోలీసుల హెచ్చరిక

టాస్క్ ఫోర్స్ కమిషనర్ , డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (DCP) శ్రీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ మాట్లాడుతూ.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. టీ పొడిని కేవలం గుర్తింపు పొందిన, నమ్మకమైన విక్రేతల వద్దే కొనుగోలు చేయాలని కోరారు. ఆహార కల్తీపై అనుమానం వస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని, కల్తీకి పాల్పడే వారిపై పీడీ యాక్ట్ వంటి కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

ఈ సక్సెస్‌ఫుల్ ఆపరేషన్‌ను వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ ఇన్‌స్పెక్టర్ సిహెచ్.యదేందర్, ఎస్.ఐడి. రవిరాజ్, బంజారాహిల్స్ పోలీసులు, వారి బృందం సంయుక్తంగా నిర్వహించారు.

 

Advertisement
Advertisement