త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్‌

సెక్షన్ 22A కింద వందలాది కాలనీలను నిషేధిత జాబితాలో పెట్టి పేదల ఉసురు పోసుకుంటున్నారని సీఎం రేవంత్‌పై ఎంపీ ఈటల ఫైర్. 5న ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష!

J

Hyderabad | Published On Sep 3, 2026, 3.54 pm IST

Eatala Rajendar | పేదల ఉసురు పోసుకుంటున్నావ్ రేవంత్‌
Advertisement
  • శామీర్‌పేటలో ప్రెస్ మీట్ నిర్వహించి సీఎం రేవంత్ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసిన బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్
  • కాంగ్రెస్ పాలనను ప్రపంచ చరిత్రలోని హిట్లర్, తుగ్లక్‌ల పాలనతో పోల్చిన వైనం
  • వందలాది కాలనీలను 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్‌లో పెట్టి ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆరోపణ
  • బాధితులకు అండగా ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ నేతల భారీ దీక్ష

Eatala Rajendar | త్రినేత్ర.న్యూస్ : ధరణి పోర్టల్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుపై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శామీర్‌పేటలో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ధరణి పేరు మార్చినా వారి ధోరణి మాత్రం మారలేదన్నారు. 'భూభారతి' పేరుతో కొత్త స్కీమ్ తెచ్చి ప్రజల ఆస్తులకు 'భూహారతి' ఇస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు.

22A లిస్ట్‌తో రియల్ ఎస్టేట్‌కు, పేదలకు ఉరి

మల్కాజిగిరి ఒక మినీ ఇండియా లాంటిదని, అక్కడ అన్ని రాష్ట్రాలు, ప్రాంతాల వారు నివసిస్తుంటారని ఈటల గుర్తుచేశారు. కానీ సీఎం రేవంత్ రెడ్డి పుణ్యమా అని వందలాది కాలనీలు ఇప్పుడు సెక్షన్ 22A కింద ప్రొహిబిటెడ్ లిస్ట్ (Prohibited List) లోకి వెళ్లాయన్నారు. కనీసం పి అండ్ టి (P&T) కాలనీ, మహేంద్రహిల్స్ లాంటి ప్రాంతాలను కూడా ఈ జాబితాలో చేర్చడంతో.. ప్రజలు తమ ఇళ్లను అమ్ముకోలేక, కనీసం బ్యాంక్ లోన్స్ (Bank Loans) కూడా తీసుకోలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Eatala Rajendar Slams CM Revanth Over 22A Land Issues

హిట్లర్ లాగా మిగిలిపోతారు

ఈ చర్యలను చూస్తుంటే ఇది పూర్తిగా "తుగ్లక్ పాలన" లాగా ఉందని ప్రజలు విసిగిపోతున్నారని ఈటల పేర్కొన్నారు. ప్రపంచ చరిత్రలో హిట్లర్‌ను ఎలాగైతే ఒక దుర్మార్గుడిగా గుర్తుపెట్టుకుంటారో, తెలంగాణ చరిత్రలో సీఎం రేవంత్ రెడ్డిని కూడా అలాగే గుర్తుపెట్టుకుంటారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

"మేము 22A చట్టాన్ని పూర్తిగా రద్దు చేయమని డిమాండ్ చేయడం లేదు. కానీ ఆ జాబితా నుంచి పేదల భూములు, ఇళ్లను వెంటనే తొలగించండి" అని ఆయన స్పష్టం చేశారు. ఈ తప్పు అధికారులది అయితే వారిని వెంటనే సర్వీస్ నుంచి సస్పెండ్ చేయాలని, స్వయంగా ప్రభుత్వానిదే అయితే సీఎం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

Eatala Rajendar Slams CM Revanth Over 22A Land Issues

ఇందిరా పార్క్ వద్ద బీజేపీ దీక్ష

రాష్ట్రవ్యాప్తంగా సుమారు 90 లక్షల మంది భూబాధితులు ఉన్నారని, ప్రభుత్వం వెంటనే నంగనాచి మాటలు కట్టిపెట్టి నిషేధాన్ని ఎత్తివేయాలని ఈటల హెచ్చరించారు. ఈ భూబాధితులకు అండగా నిలిచేందుకు ఈ నెల 5, 6 తేదీల్లో ఇందిరా పార్క్ వద్ద బీజేపీ ఎంపీలు, నేతల ఆధ్వర్యంలో భారీ దీక్ష చేపట్టనున్నట్లు ప్రకటించారు. 5వ తేదీ ఉదయం 10 గంటలకల్లా బాధితులు, ప్రజలు వేలాదిగా తరలివచ్చి ప్రభుత్వానికి బుద్ధి వచ్చేలా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

Advertisement
Advertisement