త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Police Insurance | విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. బాధిత కుటుంబానికి కోటి బీమా చెక్ అందజేసిన డీజీపీ

రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఏఆర్ కానిస్టేబుల్ చరణ్ కుమార్ కుటుంబానికి పోలీస్ శాఖ అండగా నిలిచింది. డీజీపీ సీవీ ఆనంద్ రూ.1 కోటి బీమా చెక్కును అందజేశారు.

J

Hyderabad | Published On Aug 3, 2026, 10.00 pm IST

Telangana Police Insurance | విధి నిర్వహణలో కానిస్టేబుల్ మృతి.. బాధిత కుటుంబానికి కోటి బీమా చెక్ అందజేసిన డీజీపీ
Advertisement
  • విధి నిర్వహణలో ఉండగా రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఏఆర్ కానిస్టేబుల్ చరణ్‌కుమార్ (పీసీ-8968)
  • బాధిత కుటుంబ సభ్యులకు భరోసాగా రూ.1 కోటి ఇన్సూరెన్స్ చెక్కును అందజేసిన డీజీపీ సీవీ ఆనంద్
  • మహారాష్ట్రలో జరిగిన యాక్సిడెంట్‌లో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతూ మృతిచెందిన మల్కాజిగిరి కానిస్టేబుల్
  • ఎస్‌బీఐ (SBI) అధికారులతో సమన్వయం చేసి బీమా క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేసిన ఈగల్ ఫోర్స్ ఉన్నతాధికారులు

Telangana Police Insurance | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ (Telangana) పోలీస్ శాఖ తమ సిబ్బంది సంక్షేమానికి ఎల్లప్పుడూ పెద్దపీట వేస్తుందని మరోసారి నిరూపితమైంది. విధి నిర్వహణలో ఉంటూ రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మల్కాజిగిరి (Malkajgiri) ఏఆర్ కానిస్టేబుల్ వి. చరణ్‌కుమార్ కుటుంబానికి అండగా నిలిచింది. మృతుని కుటుంబ సభ్యులకు రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) సోమవారం రూ. 1 కోటి ఇన్సూరెన్స్ (Insurance) చెక్కును అందజేశారు.

అసలేం జరిగిందంటే?

మల్కాజిగిరి కమిషనరేట్‌ పరిధిలో 2018 బ్యాచ్‌కు చెందిన చరణ్‌కుమార్.. ఈగల్ ఫోర్స్‌లో (Eagle Force) డిప్యూటేషన్‌పై విధులు నిర్వర్తించేవారు. 2025 సెప్టెంబర్ 22-23 తేదీల మధ్య అర్ధరాత్రి డ్యూటీ ముగించుకుని వస్తుండగా మహారాష్ట్రలోని దేవార్కర్ గ్రామం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ యాక్సిడెంట్‌లో ఆయన తలకు, కుడి కాలికి తీవ్ర గాయాలయ్యాయి.

ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే విషాదం

ప్రమాదం జరిగిన వెంటనే స్థానికంగా ఫస్ట్ ఎయిడ్ (First aid) చేయించి, మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని యశోద హాస్పిటల్‌కు (Yashoda Hospital) తరలించారు. డాక్టర్ల సూచన మేరకు ఆయనకు ప్లాస్టిక్ సర్జరీ (Plastic surgery) కూడా చేశారు. చికిత్స అనంతరం కోలుకున్నాడని భావించి అక్టోబర్ 28న ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేశారు. కానీ, ఇంటికి వెళ్లిన కొద్దిసేపటికే చరణ్‌కుమార్ సృహతప్పి పడిపోయారు. వెంటనే కుటుంబ సభ్యులు మళ్లీ యశోద ఆస్పత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే ఆయన మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు.

అండగా నిలిచిన పోలీస్ శాఖ

కానిస్టేబుల్ అకాల మరణంతో పెద్ద దిక్కును కోల్పోయిన ఆ కుటుంబానికి ఆర్థిక భరోసా కల్పించేందుకు ఉన్నతాధికారులు వేగంగా స్పందించారు. ఈగల్ ఫోర్స్ డైరెక్టర్ సందీప్ శాండిల్య, ఎస్పీ రఘువీర్, అడిషనల్ ఎస్పీ కృష్ణమూర్తి తదితరులు ఎస్‌బీఐ (SBI) బ్యాంక్ అధికారులతో కోఆర్డినేట్ చేసుకుని బీమా క్లెయిమ్ ప్రక్రియను పూర్తి చేశారు. ఈ మేరకు కోటి రూపాయల చెక్కును బాధితులకు అందజేసిన డీజీపీ ఆనంద్.. చరణ్ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement