త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Centering Workers Strike | సెంట్రింగ్ కార్మికుల‌ సమ్మె.. హైద‌రాబాద్‌లో నిలిచిన భవన నిర్మాణాలు

Centering Workers Strike | హైద‌రాబాద్‌లో (Hyderabad) భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న త‌మ‌ సమస్యలను పరిష్కరించాలంటూ న‌గ‌ర వ్యాప్తంగా ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు సమ్మె బాట (Centering Workers Strike) పట్టారు.

G

Hyderabad | Published On May 18, 2026, 11.03 am IST

Centering Workers Strike | సెంట్రింగ్ కార్మికుల‌ సమ్మె.. హైద‌రాబాద్‌లో నిలిచిన భవన నిర్మాణాలు
Advertisement

Centering Workers Strike | త్రినేత్ర‌.న్యూస్‌: హైద‌రాబాద్‌లో (Hyderabad) భవన నిర్మాణ రంగం ఒక్కసారిగా స్తంభించిపోయింది. సుదీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న త‌మ‌ సమస్యలను పరిష్కరించాలంటూ న‌గ‌ర వ్యాప్తంగా ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికులు సమ్మె బాట (Centering Workers Strike) పట్టారు. ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఈ సంద‌ర్భంగా గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు సామ పరశురాం రెడ్డి మాట్లాడుతూ.. కార్మికులు, కాంట్రాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతిపత్రాలు సమర్పించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయిందన్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్లే తాము నేడు రోడ్డు ఎక్కాల్సి వచ్చిందని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాల నుంచి ఇక్క‌డికి వచ్చిన కార్మికులు కనీస వసతులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మిక శాఖ సైతం తమకు వ్యతిరేకంగా వ్యవహరిస్తున్న‌ద‌ని ఆరోపించారు.

సెంట్రింగ్ కాంట్రాక్టర్లు, కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాల‌ని, తమ డిమాండ్లను ప‌రిష్క‌రించాల‌న్నారు. ఇందులో భాగంగా లేబర్ కార్డు కలిగిన ప్రతి సెంట్రింగ్ కార్మికుడికి ప్రమాదవశాత్తూ ఏదైనా జరిగితే రూ.20 లక్షల ప్రమాద బీమా అందించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా క్షేత్రస్థాయిలో పనిచేసే ప్రతి కార్మికుడికి పూర్తి స్థాయి రక్షణ కల్పిస్తూ ఈఎస్ఐ (ESI) కార్డులను జారీ చేయాలన్నారు. సొంత ఇల్లు లేని పేద కార్మికులందరికీ ప్రభుత్వం తరఫున గృహ వసతి కల్పించాలని, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్లను ఆదుకునేందుకు వారికి వడ్డీ లేని రుణాలు ఇవ్వాల‌ని డిమాండ్ చేశారు. ఇటీవ‌లి కాలంలో నిర్మాణ ప్రాంతాల్లో సెంట్రింగ్ మెటీరియల్ విపరీతంగా దొంగతనాలకు గురవుతున్నాయ‌ని, దీంతో కాంట్రాక్టర్లకు నష్టాలే మిగులుతున్నాయ‌ని చెప్పారు. ఈ నేప‌థ్యంలో పోలీస్ శాఖ వీటిపై ప్రత్యేక నిఘా పెట్టాలని కోరారు.

ప్ర‌భుత్వం ఇప్ప‌టికైనా స్పందించాల‌ని, ఒకవేళ కాలయాపన చేస్తే రాబోయే రోజుల్లో ఈ ఆందోళనలను మరింత ఉధృతం చేస్తామ‌న్నారు. ఆందోళ‌న‌ల‌ను రాష్ట్రవ్యాప్త ఉద్యమంగా మారుస్తామని హెచ్చరించారు. దిల్‌సుఖ్‌న‌గ‌ర్ వేదికగా జరిగిన ఈ భారీ నిరసన సమ్మె కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ దిల్‌సుఖ్‌న‌గ‌ర్ జోన్ చైర్మన్ చనిగల అర్జున్ గౌడ్, అసోసియేషన్ అధ్యక్షులు సామ పరశురాం రెడ్డి, ప్రధాన కార్యదర్శి గణేశ్‌ ముదిరాజ్, ప్రముఖ నాయకులు దడిగ బాబురావు, వందలాది మంది కార్మికులు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.

Advertisement
Advertisement