త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bandaravirala Dumping Yard | ఒకవైపు లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన.. మరోవైపు క్యాచ్‌మెంట్ ఏరియాలోనే డంపింగ్ యార్డా? రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఫైర్!

మూసీ ప్రక్షాళన పేరుతో వేల కోట్లు ఖర్చు పెడుతున్న కాంగ్రెస్ సర్కార్, అదే మూసీ క్యాచ్‌మెంట్ ఏరియాలో డంపింగ్ యార్డ్ ఎలా పెడుతుందంటూ ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు నిలదీశారు.

J

Hyderabad | Published On Jun 29, 2026, 9.05 pm IST

Bandaravirala Dumping Yard | ఒకవైపు లక్షల కోట్లతో మూసీ ప్రక్షాళన.. మరోవైపు క్యాచ్‌మెంట్ ఏరియాలోనే డంపింగ్ యార్డా? రేవంత్ సర్కార్‌పై ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ఫైర్!
Advertisement
  • రంగారెడ్డి జిల్లా బండరావిరాలలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును వ్యతిరేకిస్తూ కలెక్టరేట్ ముట్టడి
  • సీఎం రేవంత్ రెడ్డి తుగ్లక్ నిర్ణయాలతో 16 గ్రామాల ప్రజల ప్రాణాలను బలితీసుకుంటున్నారని బీఆర్ఎస్ నేత, ఎమ్మెల్సీ శ్రవణ్ దాసోజు ధ్వజం
  • గ్రామసభల అనుమతి, పర్యావరణ అధ్యయనం (EIA) లేకుండా దొంగ జీవోలతో ప్రాజెక్టును తీసుకురావడంపై తీవ్ర అభ్యంతరం
  • బాధితులకు అండగా బీఆర్ఎస్ మహా ఉద్యమం చేపడుతుందని, బండరావిరాలను మరో జవహర్‌నగర్‌లా మారనివ్వబోమని హెచ్చరిక

Bandaravirala Dumping Yard | త్రినేత్ర.న్యూస్ : అంతర్జాతీయ స్థాయి పరిశ్రమలు, ఐటీ కంపెనీలు, కార్పొరేట్ ఆసుపత్రులు రావాల్సిన అద్భుతమైన ప్రభుత్వ భూమిని డంపింగ్ యార్డ్‌గా (Dumping Yard) మార్చాలని చూడటం అత్యంత దుర్మార్గమని బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్సీ డా. శ్రవణ్ దాసోజు రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రంగారెడ్డి జిల్లా బండరావిరాలలోని సర్వే నంబర్ 268లో ఉన్న 494 ఎకరాల భూమిలో డంపింగ్ యార్డ్ ఏర్పాటును నిరసిస్తూ.. ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో 16 గ్రామాల సర్పంచులు, ప్రజలతో కలిసి రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడి చేపట్టారు. ఈ భారీ ధర్నాలో ముఖ్య అతిథిగా పాల్గొన్న డా. శ్రవణ్ దాసోజు కాంగ్రెస్ సర్కార్ తీరుపై నిప్పులు చెరిగారు.

మూసీ ప్రక్షాళన అట.. ఇక్కడేమో కలుషితం చేస్తారట

బండరావిరాలలోని 494 ఎకరాల భూమి మూసీ నది పరివాహక ప్రాంతంలో (Catchment Area) ఉందని శ్రవణ్ గుర్తుచేశారు. "ఇక్కడ కురిసే ప్రతి వాన చుక్కా చివరికి మూసీ నదిలోనే కలుస్తుంది. ఒకవైపు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మూసీ ప్రక్షాళన చేస్తానని సీఎం రేవంత్ రెడ్డి లెక్చర్లు ఇస్తారు. మరోవైపు అదే మూసీ పరివాహక ప్రాంతంలో కొండలంత చెత్త పోసి నదిని శాశ్వతంగా కలుషితం చేయాలని చూస్తున్నారు. ఒకవైపు మూసీని బాగు చేస్తానంటూనే, దాన్ని మురికికూపంగా మార్చేందుకు జీవోలు (GOs) ఎలా ఇస్తారు? ఇంతకంటే మూర్ఖత్వం, అజ్ఞానం ఎక్కడైనా ఉంటుందా?" అని ఆయన ప్రశ్నించారు.

Image

మరో జవహర్‌నగర్‌లా మారుస్తారా?

జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రజల జీవితాలు ఎంత నరకప్రాయంగా మారాయో అందరూ చూస్తున్నారని శ్రవణ్ ఆవేదన వ్యక్తం చేశారు. కాలుష్యం దెబ్బకు అక్కడి ప్రజలకు ముక్కుల్లోంచి రక్తం కారే దుస్థితి ఉందన్నారు. ఎన్నికల ముందు జవహర్‌నగర్ డంపింగ్ యార్డ్‌ను అక్కడి నుండి షిఫ్ట్ (Shift) చేస్తానని ప్రగల్భాలు పలికిన రేవంత్ రెడ్డి.. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్డు (ORR)కు కేవలం 3 కిలోమీటర్ల లోపు ఉన్న 16 పచ్చని గ్రామాలను మరో జవహర్‌నగర్‌లా మార్చాలని చూడటం ఆయన తుగ్లక్ నిర్ణయాలకు నిదర్శనమన్నారు.

హిట్లర్ పాలన.. దొంగ జీవోలు

ప్రజాస్వామ్య పాలన అందిస్తామని చెప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం, నేడు నిరంకుశ నిజాం రాజులా వ్యవహరిస్తోందని శ్రవణ్ దుయ్యబట్టారు. చట్టం ప్రకారం స్థానిక గ్రామసభల అనుమతి లేకుండా, ఎలాంటి పర్యావరణ ప్రభావ అధ్యయనం (Environmental Impact Assessment - EIA) చేయకుండా చీకటి జీవోలను దొంగచాటుగా ఎలా తెస్తారని నిలదీశారు. అమాయక పిల్లల భవిష్యత్తును పణంగా పెట్టడం రాక్షసత్వమే అవుతుందన్నారు.

రియల్ ఎస్టేట్ కోసం సీఎంకు బానిసలైన నేతలు

ప్రజల పక్షాన నిలబడాల్సిన స్థానిక ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, కుంభం అనిల్ కుమార్ రెడ్డి, స్థానిక ఎంపీ.. రియల్ ఎస్టేట్ (Real Estate) దందాల కోసం ముఖ్యమంత్రికి బానిసలుగా మారారని శ్రవణ్ ఆరోపించారు. "మేమంతా పేదోళ్లం, అట్టడుగు వర్గాలం కాబట్టే మా ఊర్ల పక్కన చెత్త పోస్తారా? దమ్ముంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు వచ్చి ఆ డంపింగ్ యార్డ్ పక్కనే ఇళ్లు కట్టుకుని ఉండాలి, అప్పుడు మేము కూడా ఇక్కడే ఉంటాం" అని సవాల్ విసిరారు.

Image

వెనక్కి తగ్గేదే లేదు.. మహా ఉద్యమం తప్పదు

కలెక్టరేట్‌లోకి దూసుకొచ్చిన మహిళలు, వృద్ధుల పోరాట స్ఫూర్తి రాణి రుద్రమదేవి, భగత్ సింగ్‌లను తలపించిందని శ్రవణ్ దాసోజు కొనియాడారు. కేవలం భూముల కోసమే కాకుండా, భవిష్యత్ తరాల ప్రాణాల రక్షణ కోసం సాగుతున్న ఈ పోరాటంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ ఆదేశాల మేరకు బాధితులకు పూర్తి అండగా ఉంటామన్నారు. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే తెలంగాణ వ్యాప్తంగా మహా ఉద్యమం, రాస్తారోకోలు తప్పవని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యులు

ఇబ్రహీంపట్నం మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, భువనగిరి బీఆర్ఎస్ నేత క్యామ మల్లేష్, పార్టీ ముఖ్య నాయకులు విజయ్, జంగయ్య, ధనలక్ష్మి, దానయ్య, కిషన్ తదితరులతో పాటు 16 గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు మెంబర్లు, వేలాదిగా తరలివచ్చిన మహిళలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Advertisement
Advertisement