త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

MPox Strain | భార‌త్‌, యూకేల‌లో ఎంపాక్స్ కొత్త స్ట్రెయిన్ కేసులు.. WHO హెచ్చ‌రిక‌లు..

MPox Strain | ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుద‌ల చేసిన‌ నివేదికతో అంతర్జాతీయ ఆరోగ్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఎంపాక్స్ (Mpox) వైరస్‌కు చెందిన పూర్తిగా కొత్త స్ట్రెయిన్‌ ఒకటి వెలుగులోకి వచ్చినట్లు WHO ధ్రువీకరించింది. ఇది సాధారణ వేరియంట్‌ కాదు.

S

Health | Published On Feb 18, 2026, 9.36 am IST

MPox Strain | భార‌త్‌, యూకేల‌లో ఎంపాక్స్ కొత్త స్ట్రెయిన్ కేసులు.. WHO హెచ్చ‌రిక‌లు..
Advertisement

MPox Strain | ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజాగా విడుద‌ల చేసిన‌ నివేదికతో అంతర్జాతీయ ఆరోగ్య వర్గాలు అప్రమత్తమయ్యాయి. ఎంపాక్స్ (Mpox) వైరస్‌కు చెందిన పూర్తిగా కొత్త స్ట్రెయిన్‌ ఒకటి వెలుగులోకి వచ్చినట్లు WHO ధ్రువీకరించింది. ఇది సాధారణ వేరియంట్‌ కాదు. గతంలో ఉన్న రెండు వేర్వేరు ఎంపాక్స్ స్ట్రెయిన్‌ల జన్యు లక్షణాలు కలిసిపోయి ఏర్పడిన రికాంబినెంట్ వైరస్ అని తెలిపింది. ఈ కొత్త స్ట్రెయిన్ కేసులు భారత్‌, యూకేల్లో గుర్తించడంతో ప్రపంచవ్యాప్తంగా కఠిన నిఘా అవసరమని WHO సూచించింది. ఆ సంస్థ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ కొత్త ఎంపాక్స్ స్ట్రెయిన్‌కు సంబంధించి 2 కేసులు ఇప్పటివరకు నమోదయ్యాయి. యూకేలో డిసెంబర్‌ 2025లో తొలి కేసు వెలుగులోకి వచ్చింది. ఆ వ్యక్తి ఇటీవల దక్షిణాసియా దేశాల‌కు ప్రయాణించినట్లు అధికారులు గుర్తించారు. ఇక మరో కేసు భారత్‌లో నమోదైంది. ఆ రోగి అరేబియా ద్వీపకల్పంలోని ఓ దేశానికి వెళ్లి వచ్చిన తర్వాత సెప్టెంబర్‌ 2025లో లక్షణాలు కనిపించాయి. స‌మ‌యం, ప్రాంతం వేర్వేరుగా ఉన్నప్పటికీ, ఇద్దరికీ సోకింది ఒకే కొత్త రికాంబినెంట్ వైరస్ అని WHO తెలిపింది.

రెండు దేశాల్లోనూ ఒకే స్ట్రెయిన్‌..

ఈ కొత్త స్ట్రెయిన్ ఎంత ప్రమాదకరమన్న అంశంపై WHO ప్ర‌స్తుతం ప‌రిస్థితిని స‌మీక్షిస్తోంది. అయితే రెండు కేసుల్లోనూ వ్యాధి తీవ్రంగా మారలేదని స్పష్టం చేసింది. సంబంధిత దేశాల్లో కాంటాక్ట్ ట్రేసింగ్ పూర్తి చేయగా, అదనపు వ్యాప్తి ఆనవాళ్లు కనిపించలేదని తెలిపింది. అయితే రెండు వేర్వేరు దేశాల్లో ఒకే స్ట్రెయిన్ బయటపడడం వ‌ల్ల ఇంకా గుర్తించని కేసులు ఉండే అవకాశం ఉందని హెచ్చరించింది.

కాగా వైరస్‌ను గుర్తించే ప్రక్రియలో ఆసక్తికరమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి. యూకే కేసును మొదట క్లేడ్ ఐబీగా భావించినా, లోతైన జన్యు పరీక్షల్లో అది క్లేడ్ ఐబీతో పాటు క్లేడ్ ఐఐబీ లక్షణాలు కలిగి ఉన్న హైబ్రిడ్ స్ట్రెయిన్‌గా తేలింది. భారత్‌లో నమోదైన కేసును మొదట క్లేడ్ ఐఐగా వర్గీకరించినప్పటికీ, డేటాబేస్ నవీకరణ తర్వాత అదే యూకేలో కనిపించిన కొత్త రికాంబినెంట్ వైరస్‌గా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో భారత్‌లోని కేసే ఈ కొత్త స్ట్రెయిన్‌కు ప్రపంచంలో తొలి గుర్తింపుగా ఇప్పుడు పరిగణిస్తున్నారు.

ల‌క్ష‌ణాలు ఇవే..

ఇక ఎంపాక్స్ (మునుపటి పేరు మంకీపాక్స్) అనేది వైరల్ వ్యాధి. స్మాల్‌పాక్స్‌ను పోలిన దద్దుర్లు, జ్వరం, శరీర నొప్పులు వంటి లక్షణాలు దీని ప్రధాన లక్షణాలు. సాధారణంగా వ్యక్తి నుంచి వ్యక్తికి దగ్గరి సంపర్కం ద్వారా, కొన్నిసార్లు కలుషిత వస్తువుల ద్వారా ఈ వైరస్ వ్యాప్తి చెందుతుంది. ఎంపాక్స్‌కు ప్రధానంగా రెండు రకాల క్లేడ్‌లు ఉన్నాయి. క్లేడ్-I మధ్య ఆఫ్రికాలో ఎక్కువగా కనిపిస్తుంది, ఇది తీవ్రమైన వ్యాధికి కారణమవుతుంది. క్లేడ్-II పశ్చిమ ఆఫ్రికాలో సాధారణం కాగా, 2022 నుంచి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించిన కేసులు ఈ వర్గానికే చెందుతున్నాయి. లక్షణాల విషయానికి వస్తే చర్మంపై దద్దుర్లు, బొబ్బలు లేదా పుండ్లు, జ్వరం, వణుకు, తలనొప్పి, కండరాల నొప్పులు, లింఫ్ నోడ్స్ వాపు, తీవ్రమైన అలసట వంటి సమస్యలు కనిపించవచ్చు. కొందరిలో కేవలం దద్దుర్లే కనిపించవచ్చు. మరికొందరిలో దద్దుర్లకు ముందే ఫ్లూ తరహా లక్షణాలు వస్తాయి. కొన్ని అరుదైన సందర్భాల్లో దద్దుర్లు లేకుండానే వ్యాధి ఉండే అవకాశమూ ఉందని వైద్యులు చెబుతున్నారు.

కాగా ప్రమాద స్థాయిపై WHO స్పష్టతనిచ్చింది. కొత్త స్ట్రెయిన్ వెలుగులోకి వచ్చినప్పటికీ, ప్రపంచవ్యాప్త ప్రమాద స్థాయి ప్రస్తుతం మారలేదని పేర్కొంది. సాధారణ ప్రజలకు మాత్రం ప్రస్తుతం తక్కువ ప్రమాదమే ఉందని అంచనా వేస్తోంది. అయితే కొత్త కేసులు తక్కువగా ఉండడంతో తుది నిర్ణయాలకు రావడం తొందరపాటేనని, అప్రమత్తత తప్పనిసరని నిపుణులు సూచిస్తున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement