త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Maharashtra FDA | పేపర్‌లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..

Maharashtra FDA | మహారాష్ట్ర ప్రభుత్వం సేఫ్ ఫుడ్, హెల్తీ మహారాష్ట్ర ప్రచారంలో భాగంగా ఆహార భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్లు, క్యాటరింగ్ సంస్థలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు వర్తించేలా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సమగ్ర ఆహార భద్రతా నిబంధనల‌ను జారీ చేసింది.

S

Health | Published On Jun 25, 2026, 12.59 pm IST

Maharashtra FDA | పేపర్‌లో ఆహారం ఇస్తే కఠిన చర్యలు.. మహారాష్ట్రలో కొత్త ఫుడ్ సేఫ్టీ నిబంధనలు..
Advertisement

Maharashtra FDA | మహారాష్ట్ర ప్రభుత్వం సేఫ్ ఫుడ్, హెల్తీ మహారాష్ట్ర ప్రచారంలో భాగంగా ఆహార భద్రతపై కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని హోటళ్లు, రెస్టారెంట్లు, ధాబాలు, క్లౌడ్ కిచెన్లు, క్యాటరింగ్ సంస్థలు, ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌లకు వర్తించేలా మహారాష్ట్ర ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్‌డీఏ) సమగ్ర ఆహార భద్రతా నిబంధనల‌ను జారీ చేసింది. ఇందులో వార్తాపత్రికలు లేదా ముద్రిత కాగితాల్లో ఆహారం వడ్డించడాన్ని లేదా ప్యాక్ చేసి అందించ‌డాన్ని పూర్తిగా నిషేధించింది. మహారాష్ట్ర ఎఫ్‌డీఏ కమిషనర్ తుకారాం ముండే మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టే విధంగా అసురక్షితమైన లేదా అపరిశుభ్రమైన ఆహారం అందించే వ్యాపారాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నిబంధనలు ఉల్లంఘించిన సంస్థలకు జైలు శిక్ష, భారీ జరిమానాలు, లైసెన్స్ రద్దు, సంస్థలను మూసేయడం వంటి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ త‌ప్ప‌నిస‌రి..

ఇటీవల నిర్వహించిన తనిఖీల్లో అనేక తీవ్రమైన ఉల్లంఘనలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్రమైన వాతావరణంలో ఆహారం తయారు చేయడం, వంట నూనెను పదేపదే తిరిగి ఉపయోగించడం, నిర్దేశిత ఉష్ణోగ్రతల్లో ఆహారాన్ని నిల్వ చేయకపోవడం, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికెట్ లేని సిబ్బందితో ఆహార తయారీ చేపట్టడం వంటి లోపాల‌ను గుర్తించారు. దీంతో ఈ కఠిన నిబంధనల‌ను అమల్లోకి తీసుకొచ్చారు. కొత్త ఆదేశాల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి ఆహార వ్యాపార సంస్థ తప్పనిసరిగా చెల్లుబాటు అయ్యే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ లైసెన్స్ ను కలిగి ఉండాలి. దాన్ని వినియోగదారులకు స్పష్టంగా కనిపించే ప్రదేశంలో ప్రదర్శించాలి. అలాగే ఎఫ్‌ఎస్‌ఎస్‌ఏఐ అమలు చేస్తున్న ఆర్‌యూసీఓ (Repurpose Used Cooking Oil) కార్యక్రమాన్ని తప్పనిసరిగా పాటించాలి. ఆహార తయారీలో పనిచేసే సిబ్బంది క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడంతోపాటు ఫుడ్ సేఫ్టీ ట్రైనింగ్ అండ్ సర్టిఫికేషన్ (FoSTaC) శిక్షణ పొందాలి. ఫుడ్ స్టాక్ నిర్వహణలో ఫస్ట్ ఇన్-ఫస్ట్ అవుట్ (FIFO) విధానాన్ని అనుసరించాలి. వేర్వేరు ఆహార పదార్థాల కోసం రంగుల ఆధారిత కటింగ్ బోర్డులను ఉపయోగించడం కూడా తప్పనిసరి చేశారు.

భారీగా జ‌రిమానా, జైలు శిక్ష‌..

రెస్టారెంట్లు వినియోగదారులకు ఉచితంగా సురక్షితమైన తాగునీటిని అందించాలి. మెనూలో ప్రతి ఆహార పదార్థానికి సంబంధించిన క్యాలరీలు, పోషక విలువలు, అలర్జీకి కారణమయ్యే పదార్థాల వివరాలను తప్పనిసరిగా ప్రదర్శించాల్సి ఉంటుంది. వార్షిక టర్నోవర్ రూ.50 కోట్లకు మించిన ఆహార వ్యాపార సంస్థలు ప్రతి సంవత్సరం ఫుడ్ సేఫ్టీ మేనేజ్‌మెంట్ సిస్టమ్ (FSMS) ఆడిట్ నిర్వహించాలని ఆదేశాల్లో పేర్కొన్నారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ చట్టం - 2006 ప్రకారం, అసురక్షిత ఆహారం వల్ల వ్యక్తి మరణిస్తే కనీసం 7 సంవత్సరాల జైలు శిక్ష నుంచి జీవిత ఖైదు వరకు విధించే అవకాశం ఉంటుంది. అలాగే కనీసం రూ.10 లక్షల జరిమానా కూడా విధిస్తారు. అదే అసురక్షిత ఆహారం కారణంగా తీవ్రమైన గాయాలు లేదా ఆరోగ్య నష్టం కలిగితే గరిష్ఠంగా 6 సంవత్సరాల జైలు శిక్షతోపాటు రూ.5 లక్షల వరకు జరిమానా విధిస్తారు. సేఫ్ ఫుడ్, హెల్తీ మహారాష్ట్ర కార్యక్రమంలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.5 లక్షల ఆహార వ్యాపార సంస్థలను తనిఖీ చేయనున్నట్లు సమాచారం. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై జరిమానాలు, న్యాయపరమైన చర్యలు, లైసెన్స్ సస్పెన్షన్ వంటి కఠిన చర్యలు తీసుకోనున్నారు.

Advertisement
Advertisement