త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

kerala story 2 | కేర‌ళ స్టోరీ 2 రిలీజ్‌పై స్టే విధించిన కోర్టు – సీబీఎఫ్‌సీకి షాక్‌

రిలీజ్‌కు ముంగిట కేర‌ళ స్టోరీ 2 మూవీకి హైకోర్టు షాకిచ్చింది. ఫిబ్ర‌వ‌రి 27న రిలీజ్ కావాల్సిన ఈ మూవీపై స్టేను విధించింది. ఈ సినిమాకు స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డంలో సీబీఎఫ్‌సీ నిబంధ‌న‌ల‌ను పాటించ‌లేదంటూ హైకోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది.

N

Entertainment | Published On Feb 26, 2026, 4.08 pm IST

kerala story 2 |  కేర‌ళ స్టోరీ 2 రిలీజ్‌పై స్టే విధించిన కోర్టు – సీబీఎఫ్‌సీకి షాక్‌
Advertisement

kerala story 2 |  కేర‌ళ స్టోరీ 2 మూవీకి హైకోర్టు పెద్ద షాకిచ్చింది. రిలీజ్‌కు మ‌రో రోజు ఉండ‌గా...ఈ సినిమా విడుద‌ల‌పై స్టేను విధించింది. హైకోర్టు తీర్పుతో ఈ సినిమా వాయిదా ప‌డింది. ఫిబ్ర‌వ‌రి 27న రిలీజ్ కావాల్సిన కేర‌ళ స్టోరీ 2ను బ్యాన్ చేయాలంటూ గ‌త కొద్ది రోజులుగా సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. సాక్షాత్తూ కేర‌ళ ముఖ్య‌మంత్రి పిన‌ర‌యి విజ‌య‌న్ సైతం ఈ సినిమాను విడుద‌ల చేయ‌ద్దంటూ ట్వీట్, కామెంట్లు చేశారు. అభివృద్ధి, అక్ష‌రాస‌త్య‌తో ముందున్న కేర‌ళ‌ను ఉగ్ర‌వాదుల‌కు నిల‌యంగా ఈ సినిమాలో చూపిస్తున్నారంటూ ఆరోపించారు. జ‌న‌నాయ‌గ‌న్‌తో పాటు ప‌లు సినిమాల‌కు సెన్సార్ విష‌యంలో అభ్యంత‌రాలు పెట్టిన సీబీఎఫ్‌సీ కేర‌ళ స్టోరీకి యూఏ స‌ర్టిఫికెట్ ఇవ్వ‌డంపై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. సెన్సార్ తీరును ప‌లువురు ఫైర్ అయ్యారు.

పిటిష‌న్‌...

మ‌త‌విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టేలా ఈ సినిమా ఉందంటూ శ్రీదేవ్ నంబూద్రి అనే బ‌యాల‌జిస్ట్ కోర్టును ఆశ్ర‌యించాడు. ఈ సినిమాలో కేర‌ళ‌ను చాలా నెగెటివ్‌గా చూపించారంటూ త‌న పిటిష‌న్‌లో పేర్కొన్నారు. ఈ సినిమాకు సెన్సార్ స‌ర్టిఫికెట్ ఎలా ఇచ్చారో చెప్పాలంటూ త‌న పిటిష‌న్‌లో డిమాండ్ చేశారు నంబూద్రి. అత‌డి పిటిష‌న్‌పై విచార‌ణ‌ను జ‌రిపిన కోర్టు సినిమా రిలీజ్‌పై స్టేను విధించింది. పిటిష‌న‌ర్ వాద‌న‌ను స‌మ‌ర్థించింది. ఈ సినిమాకు స‌ర్టిఫికెట్ జారీ చేయ‌డంలో సీబీఎఫ్‌సీ నిబంధ‌న‌లు పాటించ‌లేద‌ని కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సెన్సార్ బోర్డు ప‌నితీరును త‌ప్పుప‌ట్టింది. సినిమాపై వ‌చ్చిన వాద‌న‌ల‌ను దృష్టిలో పెట్టుకొని సెన్సార్ స‌ర్టిఫికెట్ విష‌యంలో మ‌రోసారి పునః ప‌రిశీలించాల‌ని అన్న‌ది. ప‌దిహేను రోజుల గ‌డువు ఇచ్చింది. అప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా రిలీజ్‌పై స్టే విధిస్తున్న‌ట్లు హైకోర్టు చెప్పింది. సెన్సార్ బోర్డుతో పాటు నిర్మాత‌ల‌కు నోటీసులు జారీ చేసింది.

కేర‌ళ స్టోరీకి సీక్వెల్‌...

రిలీజ్‌కు ఒక రోజు ముందు హైకోర్టు స్టే విధించ‌డంతో మేక‌ర్స్ డివిజ‌న్ బెంచ్‌ను ఆశ్ర‌యించ‌బోతున్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. కామాఖ్య నారాయ‌ణ్ సింగ్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ మూవీకి విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించారు. ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వ‌ర్య ఓజా ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఫిబ్ర‌వ‌రి 27న ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. ప్రేమ‌, పెళ్లి పేరుతో హిందూ మ‌హిళ‌ల‌ను మోసం చేస్తూ బలవంతంగా ఇస్లాంలోకి మ‌త‌మార్పిడిల‌కు  ఎలా పాల్ప‌డుతున్నార‌నే క‌థాంశంతో ఈ మూవీ రూపొందింది. ల‌వ్ జిహాద్ అనే కాన్సెప్ట్‌ను డైరెక్ట‌ర్ ఇందులో చ‌ర్చించారు. 2023లో వ‌చ్చిన కేర‌ళ స్టోరీ మూవీకి సీక్వెల్‌గా ఈ సినిమా తెర‌కెక్కింది.

Advertisement
Advertisement