త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ భార‌త్‌-పాక్ మ్యాచ్‌.. పీసీబీతో ఐసీసీ తెర వెనుక చ‌ర్చ‌లు..?

T20 World Cup 2026 | ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన అత్యంత ప్రతిష్టాత్మక గ్రూప్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరవెనుక చర్చలు కొనసాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య బ్యాక్-చానల్ చర్చలు జరుగుతున్నాయ‌ని ESPNcricinfo వెల్లడించింది.

S

Cricket | Published On Feb 6, 2026, 12.31 pm IST

T20 World Cup 2026 | టీ20 వ‌రల్డ్ క‌ప్ భార‌త్‌-పాక్ మ్యాచ్‌.. పీసీబీతో ఐసీసీ తెర వెనుక చ‌ర్చ‌లు..?
Advertisement

T20 World Cup 2026 | ఐసీసీ టీ20 వరల్డ్‌కప్ 2026లో భాగంగా భారత్-పాకిస్థాన్ మధ్య జరగాల్సిన అత్యంత ప్రతిష్టాత్మక గ్రూప్ మ్యాచ్‌పై నెలకొన్న అనిశ్చితికి తెరవెనుక చర్చలు కొనసాగుతున్న‌ట్లు తెలుస్తోంది. ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ICC), పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) మధ్య బ్యాక్-చానల్ చర్చలు జరుగుతున్నాయ‌ని ESPNcricinfo వెల్లడించింది. పాకిస్థాన్ ప్రభుత్వ ఆదేశాల మేరకు ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్‌తో జరగాల్సిన మ్యాచ్‌కు పాకిస్థాన్ జట్టు హాజరుకాదని, అయితే మిగతా షెడ్యూల్ చేసిన మ్యాచ్‌ల్లో మాత్రం పాల్గొంటుందని ఇప్ప‌టికే స్ప‌ష్ట‌త ఇచ్చారు. కాగా ఈ నిర్ణయం వెనుక రాజకీయ కారణాలే ప్రధానమని తెలుస్తోంది. పాకిస్థాన్ ప్రధాని ష‌హ‌బాజ్ ష‌రీఫ్ తాజాగా మాట్లాడుతూ భారత్‌లో ఆడేందుకు నిరాకరించిన కారణంగా టోర్నీ నుంచి తప్పించబడిన బంగ్లాదేశ్ కు సంఘీభావంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్పష్టం చేశారు. భారత్‌తో పాటు శ్రీలంక సహ-ఆతిథ్య దేశంగా ఉన్న ఈ టోర్నీలో బంగ్లాదేశ్‌ను తప్పించడం అన్యాయమని పాకిస్థాన్ భావిస్తోంది.

బ‌హిష్క‌ర‌ణ ప్ర‌క‌టించ‌క ముందే..

బహిష్కరణపై పీసీబీ అధికారికంగా ఎలాంటి ప్రకటన చేయకపోయినా, ఐసీసీ మాత్రం తన అధికారిక వేదికల ద్వారా స్పందించింది. అన్ని వర్గాల ప్రయోజనాలను కాపాడేలా పరస్పర అంగీకార పరిష్కారాన్ని అన్వేషించాలని పీసీబీని ఐసీసీ కోరింది. ఈ వివాద పరిష్కారానికి ఐసీసీ డిప్యూటీ చైర్మన్ ఇమ్రాన్ ఖ్వాజా, ఎమిరేట్స్ క్రికెట్ బోర్డు ప్రతినిధి ముబాషిర్ ఉస్మానీ కీలక పాత్ర పోషిస్తున్నారు. వారు పీసీబీ చైర్మన్ మొహ్సిన్ నక్వీతో పాటు పాకిస్థాన్ సూపర్ లీగ్ అధిపతి, నక్వీకి సీనియర్ సలహాదారుడైన సల్మాన్ నసీర్‌తో చర్చలు జరిపారు. బహిష్కరణ అధికారికంగా ప్రకటించకముందే ఈ చర్చలు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కానీ అంత‌లోపే పాక్ ప్ర‌భుత్వం త‌మ నిర్ణ‌యాన్ని ప్ర‌క‌టించింది.

పీసీబీ అభ్యంత‌రాల‌పై దృష్టి..?

యూఏఈ పర్యటన సందర్భంగా నక్వీ అక్కడి అధికారులతో సంప్రదింపులు జరిపి ఖ్వాజాతో సమావేశమయ్యారు. ఆ తర్వాత సింగపూర్ నుంచి ఖ్వాజా, పాకిస్థాన్ నుంచి నక్వీ ఈ చర్చలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా మ్యాచ్ నుంచి తప్పుకుంటే పాకిస్తాన్‌పై ఆంక్షలు విధించే అంశం కూడా చర్చకు వచ్చినప్పటికీ, తమ నిర్ణయం ఆర్థిక అంశాలపై కాకుండా సూత్రాల ఆధారంగా తీసుకున్నదని పీసీబీ స్పష్టం చేసింది. బంగ్లాదేశ్‌ను తప్పించడంపై ఐసీసీ ద్వంద్వ ప్రమాణాలు పాటించిందని, ఇది ఘోర అన్యాయమని నక్వీ గతంలో విమర్శించారు. బహిష్కరణ ప్రకటన తర్వాత భారత్-పాకిస్థాన్ మ్యాచ్ యథావిధిగా జరిగేలా పీసీబీ అభ్యంతరాలను పరిష్కరించడంపైనే ఐసీసీ ప్రధానంగా దృష్టి సారించిన‌ట్లు తెలుస్తోంది. గతంలోనూ పీసీబీ, బీసీసీఐ, ఐసీసీ మధ్య వివాదాల్లో ఖ్వాజా మధ్యవర్తిగా వ్యవహరించిన అనుభవం ఉంది.

ఇక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ గ్రూప్-ఎ లో పాకిస్థాన్, డిఫెండింగ్ చాంపియన్ భారత్‌తో పాటు నెదర్లాండ్స్, నమీబియా, యూఎస్ఏ జట్లు ఉన్నాయి. ఐసీసీ మెన్స్ టీ20 వరల్డ్‌కప్ 2026 ఫిబ్రవరి 7 నుంచి మార్చి 8 వరకు జరగనుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement