త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

IND Vs NZ | 5వ టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం.. 4-1 తేడాతో సిరీస్ కైవ‌సం..

IND Vs NZ | కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన 5వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తోపాటు బౌలింగ్‌లో అర్ష‌దీప్ సింగ్ స‌త్తా చాటడంతో టీమిండియా మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది.

S

Cricket | Published On Jan 31, 2026, 10.58 pm IST

IND Vs NZ | 5వ టీ20లో టీమిండియా ఘ‌న విజ‌యం.. 4-1 తేడాతో సిరీస్ కైవ‌సం..
Advertisement

IND Vs NZ | కేర‌ళ‌లోని తిరువ‌నంత‌పురం వేదిక‌గా జ‌రిగిన 5వ టీ20 మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై భార‌త్ ఘ‌న విజ‌యం సాధించింది. ఇషాన్ కిష‌న్‌, సూర్య‌కుమార్ యాద‌వ్‌, హార్దిక్ పాండ్యా మెరుపు ఇన్నింగ్స్‌తోపాటు బౌలింగ్‌లో అర్ష‌దీప్ సింగ్ స‌త్తా చాటడంతో టీమిండియా మ‌రో విజ‌యాన్ని త‌న ఖాతాలో వేసుకుంది. టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ ముందు టైటిల్‌ ఫేవ‌రెట్ గా బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌పంచ జ‌ట్ల‌కు హెచ్చ‌రిక పంపింది. టీ20 మ్యాచ్ ల‌లో భార‌త్‌ను ఎదుర్కొన‌డం ఎంతో క‌ష్ట‌మో మ‌రోసారి చాటి చెప్పింది. భారీ స్కోరును నిర్దేశించ‌డ‌మే కాదు, ప్ర‌త్య‌ర్థి జ‌ట్టుకు చెందిన వికెట్ల‌ను తీయ‌డంలోనూ నైపుణ్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. స‌మిష్టి కృషితో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో టీ20 వ‌ర‌ల్డ్ కప్ కోసం తాము ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నామ‌నే సంకేతాన్ని పంపింది.

సంజు మ‌ళ్లీ ఫెయిల్‌..

మ్యాచ్‌లో టాస్ గెలిచిన భార‌త్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకోగా నిర్ణీత 20 ఓవ‌ర్ల‌లో టీమిండియా 5 వికెట్ల న‌ష్టానికి ఏకంగా 271 ప‌రుగుల భారీ స్కోరు చేసింది. ఓపెన‌ర్లుగా బ‌రిలోకి దిగిన అభిషేక్ శ‌ర్మ‌, సంజు శాంస‌న్ ఇన్నింగ్స్‌ను నిర్మించే ప్ర‌య‌త్నం చేశారు. కానీ అభిషేక్ కు సంజు స‌హకారం అందించ‌లేక‌పోయాడు. ఎప్ప‌టిలాగే త‌న చెత్త ఫామ్‌ను కొన‌సాగించాడు. 6 బంతుల్లో 1 ఫోర్‌తో కేవ‌లం 6 ప‌రుగులు మాత్ర‌మే చేసిన సంజు ఫెర్గుస‌న్ బౌలింగ్‌లో జేకబ్స్‌కు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అయితే అభిషేక్ మాత్రం 16 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్స‌ర్ల‌తో 30 ప‌రుగులు చేసి కాసేపు మెరుపులు మెరిపించాడు. అనంత‌రం అతను ఔట్ అవ్వ‌గానే ఇషాన్ కిష‌న్‌, కెప్టెన్ సూర్య కుమార్ యాద‌వ్ నిర్ణ‌యాత్మ‌క‌ ఇన్నింగ్స్ ఆడి చక్క‌ని భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు.

ఇషాన్ కిష‌న్ వీరోచిత ఇన్నింగ్స్‌..

43 బంతుల్లోనే ఇషాన్ కిష‌న్ 6 ఫోర్లు, 10 సిక్స‌ర్ల‌తో ఏకంగా 103 ప‌రుగులు చేయ‌గా, సూర్య కుమార్ యాద‌వ్ 30 బంతుల్లో 4 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 63 ప‌రుగులు చేసి జ‌ట్టు ఇన్నింగ్స్ కు ఊపు తెచ్చాడు. దీంతో ఈ ఇద్ద‌రూ క‌లిసి 3వ వికెట్‌కు ఏకంగా 137 ప‌రుగుల భాగ‌స్వామ్యం నెల‌కొల్పారు. ఆ త‌రువాత క్రీజులోకి వ‌చ్చిన హార్దిక్ పాండ్యా కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. మొత్త 17 బంతులు ఆడిన పాండ్యా 1 ఫోర్‌, 4 సిక్స‌ర్ల‌తో 42 ప‌రుగులు చేసి జ‌ట్టు భారీ స్కోరు సాధించేందుకు స‌హాయ ప‌డ్డాడు. ఇక చివ‌ర్లో రింకు సింగ్‌, శివం దూబె సైతం బంతుల‌ను బౌండ‌రీల‌కు త‌ర‌లించ‌డంతో భార‌త్ 20 ఓవ‌ర్ల‌లో 5 వికెట్ల‌కు 271 ప‌రుగుల స్కోరు సాధించింది. కివీస్ బౌల‌ర్ల‌లో లాకీ ఫెర్గుస‌న్ 2 వికెట్లు తీయ‌గా, జేక‌బ్ డ‌ఫ్ఫీ, కైలీ జేమీస‌న్‌, మిచెల్ శాంట‌న‌ర్ త‌లా 1 వికెట్ తీశారు.

కాసేపు భ‌య‌పెట్టిన ఫిన్ ఆలెన్‌..

అనంత‌రం ఇన్నింగ్స్ ప్రారంభించిన కివీస్ ఆరంభం నుంచి కాస్త దూకుడుగానే ఆడింది. ఓపెన‌ర్ ఫిన్ ఆలెన్ 38 బంతుల్లో 8 ఫోర్లు, 6 సిక్స‌ర్ల‌తో 80 ప‌రుగులు చేసి భార‌త బౌల‌ర్ల‌పై విరుచుకు ప‌డ్డాడు. ఓపెన‌ర్ టిమ్ సీఫెర్ట్ (3 బంతుల్లో ప‌రుగులు) త‌క్కువ స్కోరుకే వెను దిరిగినా, ఆలెన్ మాత్రం నిరంత‌రం బౌండ‌రీల‌ను బాదుతూ భార‌త బౌలర్ల‌పై ఒత్తిడిని పెంచాడు. అత‌నికి మ‌రో వైపు నుంచి ర‌చిన్ ర‌వీంద్ర (17 బంతుల్లో 30 ప‌రుగులు, 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) సైతం చ‌క్క‌ని స‌హ‌కారం అందించాడు. దీంతో 2వ వికెట్‌కు న్యూజిలాండ్ 100 ప‌రుగుల భాగ‌స్వామ్యాన్ని నెల‌కొల్పింది. ఈ క్ర‌మంలో కివీస్ ధాటికి ఆ జ‌ట్టు గెలుస్తుందేమోన‌ని భార‌త అభిమానులు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. కానీ అక్ష‌ర్ ప‌టేల్ త‌న‌దైన బౌలింగ్‌తో ఆలెన్‌ను పెవిలియ‌న్‌కు పంపించాడు. దీంతో కివీస్ వికెట్ల ప‌త‌నం మొద‌లైంది. ఆ త‌రువాత 6 ప‌రుగుల వ్య‌వ‌ధిలోనే వెంట వెంట‌నే 3 వికెట్ల‌ను కోల్పోయింది. దీంతో కివీస్ జట్టు క‌ష్టాల్లో ప‌డింది.

అర్ష‌దీప్ సింగ్‌కు 5 వికెట్లు..

అయితే ఆ త‌రువాత బ్యాటింగ్ కు వ‌చ్చిన డారిల్ మిచెల్ (12 బంతుల్లో 26 ప‌రుగులు, 2 ఫోర్లు, 2 సిక్స‌ర్లు) ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దే ప్ర‌య‌త్నం చేశాడు. కానీ కివీస్ వ‌రుస ఓవ‌ర్ల‌లో వికెట్ల‌ను కోల్పోయింది. చివ‌ర్లో బౌల‌ర్ ఇష్ సోధి (15 బంతుల్లో 33 ప‌రుగులు, 1 ఫోర్‌, 3 సిక్స‌ర్లు) సైతం త‌న వంతు ప్ర‌య‌త్నం చేశాడు. కానీ అప్ప‌టికే కివీస్ ఓట‌మి దాదాపుగా ఖాయ‌మైంది. వెంట వెంట‌నే వికెట్ల‌ను కోల్పోవ‌డంతో కివీస్ 20 ఓవ‌ర్ల‌లో 225 ప‌రుగుల‌కు ఆలౌట్ అయింది. దీంతో కివీస్‌పై భార‌త్ 46 ప‌రుగుల తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది. ఇక భార‌త బౌల‌ర్ల‌లో అర్ష‌దీప్ సింగ్ 5 వికెట్లను ప‌డ‌గొట్ట‌గా, అక్ష‌ర్ ప‌టేల్‌కు 3 వికెట్లు ద‌క్కాయి. వ‌రుణ్ చక్ర‌వ‌ర్తి, రింకు సింగ్ చెరో వికెట్ తీశారు. ఈ క్ర‌మంలో ఈ మ్యాచ్‌లో విజ‌యం సాధించ‌డంతో భార‌త్ ఈ సిరీస్‌ను 4-1 తేడాతో కైవ‌సం చేసుకుని ప్రపంచ జ‌ట్ల‌కు గ‌ట్టి సందేశాన్ని పంపింది. ఇక టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌లో భారత్ త‌న త‌దుప‌రి మ్యాచ్‌ను ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 7వ తేదీన యూఎస్ఏతో భార‌త్ ముంబైలోని వాంఖెడె స్టేడియంలో త‌న తొలి మ్యాచ్‌ను ఆ టోర్నీలో ఆడ‌నుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement