త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CJI | బ్యాట్ ప‌ట్టుకోవ‌డం తెలియ‌ని వారు క్రికెట్‌ సంస్థ‌ల‌ను నిర్వ‌హించ‌కూడ‌దు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు

CJI | క్రీడా పరిజ్ఞానం లేని, క‌నీసం బ్యాట్ కూడా ప‌ట్టుకోలేని వ్యక్తులు క్రికెట్ సంస్థలను నిర్వహించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రికెట్ సంఘాల నాయకత్వం మాజీ క్రికెటర్ల చేతుల్లో ఉండాలని, బ్యాట్‌ను ఎలా పట్టాలో కూడా తెలియనివారు ఈ సంస్థలను నడపడం సరికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది.

S

Cricket | Published On Feb 4, 2026, 11.04 am IST

CJI | బ్యాట్ ప‌ట్టుకోవ‌డం తెలియ‌ని వారు క్రికెట్‌ సంస్థ‌ల‌ను నిర్వ‌హించ‌కూడ‌దు: సుప్రీంకోర్టు ఘాటు వ్యాఖ్యలు
Advertisement

CJI | క్రీడా పరిజ్ఞానం లేని, క‌నీసం బ్యాట్ కూడా ప‌ట్టుకోలేని వ్యక్తులు క్రికెట్ సంస్థలను నిర్వహించడంపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. క్రికెట్ సంఘాల నాయకత్వం మాజీ క్రికెటర్ల చేతుల్లో ఉండాలని, బ్యాట్‌ను ఎలా పట్టాలో కూడా తెలియనివారు ఈ సంస్థలను నడపడం సరికాదని ఘాటుగా వ్యాఖ్యానించింది. మ‌హారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ ఎన్నికలను నిలిపివేస్తూ ఇచ్చిన బాంబే హైకోర్టు ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్య కాంత్ నేతృత్వంలోని న్యాయమూర్తులు జోయ్‌మాల్య బాగ్చీ, విపుల్ ఎం పాంచోలి ధ‌ర్మాస‌నం నిరాకరించింది. జనవరి 6న జరగాల్సిన ఈ ఎన్నికలను బంధుప్రీతి, ప్రీతిపాత్రత ఆరోపణల నేపథ్యంలో హైకోర్టు నిలిపివేసింది.

భారీ సంఖ్య‌లో స‌భ్యులను ఎలా చేర్చారు: సీజేఐ

ఈ వ్యవహారంలో దాఖలైన పిటిషన్లను, ప్రధానంగా మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారించింది. విచారణలో భాగంగా సంఘ సభ్యత్వంలో అకస్మాత్తుగా చోటుచేసుకున్న‌ పెరుగుదలపై ప్రధాన న్యాయమూర్తి ప్రశ్నించారు. 1986 నుంచి 2023 వరకు 164 మంది సభ్యులే ఉండగా, 2023 తర్వాత ఒక్కసారిగా భారీ సంఖ్యలో సభ్యులను చేర్చారా? అంటూ రికార్డులను చూపిస్తూ సీజేఐ ప్ర‌శ్నించారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. పదవీ విరమణ చేసిన న్యాయమూర్తి నేతృత్వంలోని కమిటీ సభ్యత్వ ప్రక్రియను పర్యవేక్షించిందని, 48 దరఖాస్తులను తిరస్కరించిందని తెలిపారు. అలాగే క్యాబినెట్‌ను సంప్రదించకుండా చారిటీ కమిషనర్ అడ్మినిస్ట్రేటర్‌ను నియమించారంటూ ఆరోపించారు.

క్రీడాకారుల‌కు గౌరవం ఇవ్వాలి: సీజేఐ

అయితే, సీజేఐ స్పందిస్తూ సభ్యత్వాన్ని 300కి పెంచాలనుకుంటే, ఆ స్థానాలను పేరొందిన, పదవీ విరమణ చేసిన అంతర్జాతీయ క్రికెటర్లకు కేటాయించాల్సిందిగా స్పష్టం చేశారు. ఈ దేశంలో అద్భుతమైన క్రికెటర్లు ఉన్నారు. ఆటను ఆడినవారే ముందువరుసలో ఉండాలి. మీరు ఎవరిని తీసుకొస్తున్నారు? ఆట తెలియనివారిని, బ్యాట్ పట్టడం కూడా తెలియనివారిని.. అంటూ ధర్మాసనం తీవ్ర వ్యాఖ్యలు చేసింది. క్రీడా సంఘాలు నిర్వాహకుల వల్ల కాదు, క్రీడాకారుల వల్లే గుర్తింపు పొందుతాయని సీజేఐ స్పష్టం చేశారు. క్రికెట్ అధికారుల వల్ల కాదు, క్రికెటర్ల వల్లే ఉంది. హాకీ అసోసియేషన్ కూడా ఆటగాళ్ల వల్లే గుర్తింపు పొందింది. కనీసం అంత గౌరవం వారికి ఇవ్వాలి.. అని అన్నారు.

మాజీ క్రికెట‌ర్ కేదార్ జాద‌వ్ న్యాయ పోరాటం..

కాగా ఈ న్యాయపోరాటం మొదలవ్వడానికి కారణం మాజీ భారత క్రికెటర్, బీజేపీ నేత కేదార్ జాద‌వ్ బాంబే హైకోర్టును ఆశ్రయించడమే అని చెప్ప‌వ‌చ్చు. ఓటర్ల జాబితాలో సుమారు 401 మందిని అకస్మాత్తుగా చేర్చడం ద్వారా జాబితా రిగ్గింగ్ జరిగిందని ఆయన ఆరోపించారు. కొత్తగా చేర్చినవారిలో చాలామంది ఎన్సీపీ-ఎస్పీ ఎమ్మెల్యే రోహిత్ పవార్ కు సన్నిహిత బంధువులు లేదా వ్యాపార భాగస్వాములని పిటిషన్‌లో పేర్కొన్నారు. కాగా పిటిషనర్లకు తమ పిటిషన్లను ఉపసంహరించుకునే అవకాశం ఇచ్చిన ధర్మాసనం, అన్ని వాదనలను బాంబే హైకోర్టులోనే ఉంచాలని ఆదేశించింది. బుధవారం హైకోర్టు ఈ అంశాన్ని విచారించనుందని, వేగంగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు సూచించింది.

Advertisement

తాజావార్తలు

Advertisement