త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver Prices | బంగారం, వెండి ధ‌ర‌లు అంత‌గా పెరిగిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఏమిటి..?

S

Business | Published On Dec 17, 2025, 5.07 pm IST

Gold And Silver Prices | బంగారం, వెండి ధ‌ర‌లు అంత‌గా పెరిగిపోవ‌డానికి అస‌లు కార‌ణం ఏమిటి..?
Advertisement

Gold And Silver Prices | గ‌త కొంత కాలంగా మ‌న దేశంలోనే కాదు, ప్ర‌పంచ వ్యాప్తంగా బంగారం, వెండి ధ‌ర‌లు విప‌రీతంగా పెరిగిపోతున్న విష‌యం తెలిసిందే. ఒక‌ప్పుడు కేవ‌లం బంగారం ధ‌ర మాత్రమే రోజురోజుకీ ఆకాశాన్ని అంటేది. కానీ ఇప్పుడు వెండి కూడా అదే బాట‌లో ప్ర‌యాణం చేస్తోంది. దీంతో అటు ప్ర‌జ‌లు, ఇటు పెట్టుబ‌డిదారులు విస్మ‌యానికి గుర‌వుతున్నారు. బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికీ దానికి తోడు వెండి ధ‌ర‌లు కూడా పెరుగుతుండ‌డం అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది. అయితే బంగారం, వెండి ధ‌ర‌లు కేవ‌లం ఒకే దేశ మార్కెట్‌పై ఆధార‌ప‌డి ఉండ‌వు. అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు అనుగుణంగా వీటి ధ‌ర‌లు రోజూ మారుతుంటాయి. స‌ప్లై, డిమాండ్ అనే సూత్రానికి అనుగుణంగా వీటి ధ‌ర‌లు మారుతాయి. అయితే బంగారం, వెండి ధ‌ర‌లు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతుండ‌డం వెనుక ప‌లు ప్ర‌ధాన కార‌ణాలే ఉన్నాయ‌ని నిపుణులు, విశ్లేష‌కులు తెలియజేస్తున్నారు.

సేఫ్టీ కోస‌మే కొంటున్నారా..?

ఈ ఏడాది మే 5వ తేదీన అంత‌ర్జాతీయ మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.93,540 ఉండ‌గా, వెండి ధ‌ర రూ.1,170గా ఉంది. ఇక ప్ర‌స్తుతం వీటి ధ‌ర రూ.1,34,510, రూ.2,220గా ఉంది. బంగారం ధ‌ర దాదాపు 30 శాతం పెర‌గ‌గా, వెండి ధ‌ర దాదాపు రెట్టింపు అయింది. దీంతో వీటిని ఇక కొన‌లేమేమోన‌ని సాధార‌ణ ప్ర‌జ‌లు ఆందోళ‌న చెందుతున్నారు. దాదాపు 6 నెల‌ల వ్య‌వ‌ధిలోనే ఈ రెండింటి ధ‌ర‌లు ఇంత‌లా పెర‌గ‌డం ప్ర‌జ‌ల‌ను షాక్‌కు గురి చేస్తోంది. ఇక వీటి ధ‌ర‌లు ఇంత‌లా పెరిగేందుకు ప్ర‌ధాన కార‌ణాల్లో ఒకటి.. అంత‌ర్జాతీయంగా అనేక దేశాల్లో ఉద్రిక్త ప‌రిస్థితులు నెల‌కొన‌డ‌మే అని విశ్లేష‌కులు అంటున్నారు. చాలా దేశాల ప్ర‌భుత్వాలు, ప్ర‌జ‌ల్లో ఒక ర‌క‌మైన ఆందోళ‌న ఉంద‌ని, అందుక‌నే ఇన్వెస్ట‌ర్లు ఎక్కువ‌గా బంగారం, వెండిని సేఫ్టీ కోసం కొనుగోలు చేస్తున్నార‌ని చెబుతున్నారు.

సెంట్ర‌ల్ బ్యాంకులు కూడా..

ఇక చైనా వంటి అనేక దేశాల‌కు చెందిన సెంట్ర‌ల్ బ్యాంకులు విదేశీ మార‌క నిల్వ‌ల‌కు బ‌దులుగా బంగారాన్ని నిల్వ చేసుకునేందుకు ప్రాధాన్య‌త‌ను ఇస్తున్నాయ‌ని, అందువ‌ల్ల కూడా వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని విశ్లేషిస్తున్నారు. అలాగే ప్ర‌పంచ వ్యాప్తంగా అనేక దేశాల‌కు చెందిన సెంట్ర‌ల్ బ్యాంకులు వ‌డ్డీ రేట్ల‌ను త‌గ్గించ‌నున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో బంగారం, వెండిని ప్ర‌త్యామ్నాయ పొదుపు మార్గాలుగా ఇన్వెస్ట‌ర్లు భావిస్తున్నార‌ని, వారు అందుక‌నే వాటిని అధికంగా కొనుగోలు చేస్తున్నార‌ని, కాబ‌ట్టే వాటి ధ‌ర‌లు పెరుగుతున్నాయ‌ని అంటున్నారు.

ఈటీఎఫ్‌ల‌పై మోజు..

భార‌త ఇన్వెస్ట‌ర్లు చాలా మంది గ‌తంలో కేవ‌లం బంగారంపైనే పెట్టుబ‌డి పెట్టేవారు. కానీ అంత‌ర్జాతీయంగా నెల‌కొన్న ప‌రిస్థితులు, వెండి ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో ఇప్పుడు భార‌తీయులు కూడా చాలా మంది వెండిని కొనుగోలు చేస్తున్నార‌ని గ‌ణాంకాలు చెబుతున్నాయి. ఈ క్ర‌మంలోనే చాలా మంది బంగారం, వెండికి చెందిన ఈటీఎఫ్‌ల‌ను కొంటున్నార‌ని, దేశీయ స్టాక్ మార్కెట్‌ల‌లో నెల‌కొన్న అనిశ్చితి కార‌ణంగా వారు త‌మ పెట్టుబ‌డులను వీటి వైపు మ‌ళ్లిస్తున్నార‌ని చెబుతున్నారు. చాలా మంది ప్ర‌పంచ వ్యాప్తంగా ఇదే విధంగా ఈ రెండింటిలోనూ పెట్టుబ‌డులు పెడుతున్నార‌ని, క‌నుక‌నే వీటి ధ‌ర‌లు రోజు రోజుకీ ఆకాశాన్నంటుతున్నాయ‌ని నిపుణులు తెలియ‌జేస్తున్నారు. అయితే రానున్న రోజుల్లో బంగారం, వెండి ధ‌రలు ఎలా మారుతాయో చూడాలి.

Advertisement

తాజావార్తలు

Advertisement