త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Union Budget 2026 | రేపే పార్లమెంట్‌లో నిర్మలమ్మ పద్దు.. బడ్జెట్‌లో ఐదు కీలక ప్రకటనలు చేసే ఛాన్స్‌..!

Union Budget 2026 | బడ్జెట్‌ కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమకు ఏమైనా ఊరట కల్పిస్తారా? అని మధ్య తరగతి ప్రజలతో పాటు ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. రైతులతో పాటు పారిశ్రామికవేత్తలు సైతం తమకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా? అంటూ ఎదురుచూస్తున్నారు.

P

Business | Published On Jan 31, 2026, 1.00 pm IST

Union Budget 2026 | రేపే పార్లమెంట్‌లో నిర్మలమ్మ పద్దు.. బడ్జెట్‌లో ఐదు కీలక ప్రకటనలు చేసే ఛాన్స్‌..!
Advertisement

Union Budget 2026 | కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ రేపు (ఫిబ్రవరి ఒకటి) పార్లమెంట్‌లో బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. మోదీ 3.0 ప్రభుత్వంలో 2026-27 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్‌ను పార్లమెంట్‌కు సమర్పించనున్నారు. ఈ సారి బడ్జెట్‌కు ప్రత్యేకత ఉన్నది. ఆదివారం రోజున బడ్జెట్‌ ఉండబోతున్నది. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఆదివారం బడ్జెట్‌ జరుగనున్నది. ఈ బడ్జెట్‌ కోసం యావత్‌ దేశం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. తమకు ఏమైనా ఊరట కల్పిస్తారా? అని మధ్య తరగతి ప్రజలతో పాటు ఉద్యోగులు నిరీక్షిస్తున్నారు. రైతులతో పాటు పారిశ్రామికవేత్తలు సైతం తమకు ఏమైనా తాయిలాలు ప్రకటిస్తారా? అంటూ ఎదురుచూస్తున్నారు. అయితే, కేంద్రం బడ్జెట్‌లో ఐదు కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

రూ.13లక్షల వరకు ఆదాయపు పన్ను మినహాయింపు..

కొత్త ఆదాయపు పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్‌ను ప్రస్తుతం ఉన్న రూ.75,000 నుంచి రూ.లక్షకు పెంచే అవకాశం ఉంది. దీంతో వేతనాలు పొందే వారి ఆదాయంలో రూ.13లక్షల వరకు పన్ను మినహాయింపు వర్తిస్తుంది. ప్రస్తుతం ఈ పరిమితి రూ.12.75 లక్షలుగా ఉన్నది. వినియోగాన్ని పెంచేందుకు ప్రజల చేతిలో ఎక్కువ నగదు భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లింది. పన్ను మినహాయింపులు పెరిగితే కొనుగోలు శక్తి పెరిగి ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తుందని సూచించింది. దాంతో పాత పన్ను విధానం స్థానంలో మార్పులు చేసే అవకాశం కనిపిస్తుంది. ఈ చర్యల వల్ల మధ్య తరగతి ప్రజల నగదు ప్రవాహం పెరుగుతుంది. నెలకు వేల రూపాయలు ఆదా కావడంతో ఆ మొత్తాన్ని ఖర్చులు, పొదుపు, పెట్టుబడులకు ఉపయోగించే అవకాశం ఉందని అంచనాలున్నాయి.

కిసాన్‌ సమ్మాన్‌ నిధి మొత్తం 50శాతం పెరిగే ఛాన్స్‌..

ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద రైతులకు ఇచ్చే వార్షిక సాయం రూ.6వేల సహాయాన్ని రూ.9వేలకు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత మూడు సంవత్సరాలుగా ఆర్థిక సాయం పెంపుపై చర్చ సాగుతోంది. 2019లో పథకం ప్రారంభమైనప్పటి నుంచి రైతులకు ఇచ్చే మొత్తం ఎలాంటి మార్పులు చేయలేదు. అయితే, 2024లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఈ మొత్తాన్ని ఏటా రూ.12వేలకు పెంచాలని సిఫారసు చేసింది. ద్రవ్యోల్బణంతో ఇబ్బందులు పడుతున్నామని పేర్కొంటున్నారు. 2025 నవంబర్‌లో బీహార్ ప్రభుత్వం అదనంగా రూ.3వేలు ప్రకటించడంతో అక్కడ రైతులకు మొత్తం రూ.9వేలు లభిస్తోంది. ఇదే విధానాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే అవకాశం ఉన్నది. ఈ మేరకు బడ్జెట్‌లో ప్రసంగం చేసే అవకాశం ఉన్నది. ప్రస్తుతం సుమారు 11 కోట్ల మంది రైతులు ఈ పథకంతో లబ్ధి పొందుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.60వేల నుంచి రూ.65వేల కోట్ల వరకు ఖర్చు చేస్తోంది. ఈ మొత్తాన్ని రూ.9వేలకు పెంచితే వార్షిక వ్యయం సుమారు రూ.95వేల కోట్లకు పెరగనున్నది.

రైల్వేకు బూస్ట్‌.. 300పైగా అమృత్‌, వందే భారత్‌ రైళ్లు..

2030 నాటికి రైల్వే రిజర్వేషన్ వెయిటింగ్ లిస్ట్‌ను పూర్తిగా తొలగించాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఉన్నది. ఈ క్రమంలో కొత్త రైళ్లను తీసుకురావాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో 300కు పైగా అమృత్ భారత్, వందే భారత్ రైళ్లను ప్రకటించే అవకాశం ఉంది. గత బడ్జెట్‌లో రైల్వేలకు రూ.2.65 లక్షల కోట్ల కేటాయింపులు జరిగాయి. ఇదే ఇప్పటి వరకు ఇదే రికార్డు స్థాయి కేటాయింపులు. ఈ సారి ఆ మొత్తాన్ని మరింత పెంచే అవకాశం ఉంది. పీక్ సీజన్‌లో డిమాండ్‌కు, అందుబాటులో ఉన్న సీట్లకు మధ్య 20–25 శాతం వ్యత్యాసం ఉంటోంది. దీన్ని తగ్గించేందుకు కొత్త రైళ్లు, ట్రాక్ విస్తరణ అనివార్యం. దీంతో రోజూ రైళ్లలో ప్రయాణించే సుమారు 2 కోట్ల మందికి ప్రయోజనం కలగనుంది.

పీఎం సూర్య ఘర్‌ యోజన కింద రూ.80వేల సబ్సిడీ..

బడ్జెట్‌లో 2 కిలోవాట్ల వరకు సోలార్ సిస్టమ్‌లపై కిలోవాట్‌కు ఇచ్చే సబ్సిడీని రూ.30వేల నుంచి రూ.40వేలకు పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం 2 కిలోవాట్ల సోలార్ వ్యవస్థకు మొత్తం రూ.60వేల సబ్సిడీ లభిస్తోంది. కిలోవాట్‌కు రూ.10వేలు పెరిగితే 2 కిలోవాట్ల వ్యవస్థపై మొత్తం సబ్సిడీ రూ.80వేలకు పెరుగనున్నది. అంటే రూ.20వేలు సబ్సిడీ అందనున్నది. 2 నుంచి 3 కిలోవాట్ల మధ్య సిస్టమ్‌లకు కిలోవాట్‌కు రూ.18వేల సబ్సిడీ ఉండగా.. 3 కిలోవాట్లకు మించి గరిష్టంగా రూ.78,000కే పరిమితం. 2026 మార్చి నాటికి 40 లక్షల ఇళ్లను, 2027 నాటికి కోటి ఇండ్లకు సోలార్ గ్రిడ్‌కు అనుసంధానించాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యం. 2025 డిసెంబర్ నాటికి 19.45 లక్షల సోలార్ ప్యానెల్‌లు ఏర్పాటు అయ్యాయి. సబ్సిడీ పెరగడంతో 2 కిలోవాట్ల సిస్టమ్ పెట్టుకునే కుటుంబాలకు నేరుగా రూ.20వేల ఆదా అవుతుంది. ఉచిత విద్యుత్తుతో పాటు అదనపు విద్యుత్తును గ్రిడ్‌కు అమ్మి ఆదాయం సమకూరే ఛాన్స్‌ ఉంది.

ఆయుష్మాన్ భారత్: 60 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లందరికీ లబ్ధి..

ఆయుష్మాన్ భారత్ (పీఎం-జేఏవై) పథకం పరిధిని ప్రభుత్వం విస్తరించే అవకాశం ఉంది. ప్రస్తుతం 70 ఏళ్లు పైబడిన వారికే అర్హత ఉండగా.. ఈ పరిమితిని 60 ఏళ్లకు తగ్గించే అవకాశం ఉంది. అలాగే ఉచిత చికిత్స వార్షిక పరిమితిని రూ.5 లక్షల వరకు పెంచే యోచనలో ప్రభుత్వం ఉన్నది. అవుట్‌ లుక్‌ నివేదిక ప్రకారం.. భారత్‌లో 60 ఏళ్లు పైబడిన వారిలో 82 శాతం మందికి ఆరోగ్య బీమా లేదు. 60 నుంచి 70 ఏళ్ల మధ్య వయసు వారు తీవ్రమైన వ్యాధులకు తమ పొదుపునంతా ఖర్చు చేస్తున్న పరిస్థితి ఉంది. వయోపరిమితిని తగ్గిస్తే లక్షలాది కొత్త కుటుంబాలు ఈ పథకంలో చేరతాయి. చికిత్స పరిమితి పెరగడంతో పెద్ద శస్త్రచికిత్సలకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. దాంతో వారంతా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో ఉచిత చికిత్స పొందే అవకాశం లభించనున్నది.

Advertisement

తాజావార్తలు

Advertisement