త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana DGP CV Anand | ఒకప్పుడు నక్సలిజం.. ఇప్పుడు సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ : పోలీసులకు వరంగల్ సవాల్

ఒకప్పుడు నక్సలిజంతో వణికిన వరంగల్‌లో ఇప్పుడు సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ పోలీసులకు సవాలుగా మారాయి. క్రైమ్ రేట్, పనితీరుపై డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

J

Warangal | Published On Aug 9, 2026, 9.20 pm IST

Telangana DGP CV Anand | ఒకప్పుడు నక్సలిజం.. ఇప్పుడు సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ : పోలీసులకు వరంగల్ సవాల్

సంక్షిప్త సారాంశం

వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరుపై రాష్ట్ర డీజీపీ సి.వి. ఆనంద్ శనివారం సమీక్ష నిర్వహించారు. నక్సలిజం స్థానంలో ఇప్పుడు సైబర్ నేరాలు, డ్రగ్స్ ప్రధాన సవాళ్లుగా మారాయని ఆయన వెల్లడించారు. 2025తో పోలిస్తే వరంగల్‌లో 2026లో నేరాల రేటు స్వల్పంగా తగ్గినా, కేసుల దర్యాప్తును వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. పోలీసు అమరుల కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేకంగా 'టీజీ-వీర్' (TG-Veer) యాప్‌ను ప్రారంభించారు.

Advertisement
  • నక్సల్స్ నుంచి సైబర్ నేరాల దాకా
  • వరంగల్ పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ దిశానిర్దేశం

Telangana DGP CV Anand | త్రినేత్ర.న్యూస్ : వరంగల్ పోలీసింగ్ రూపురేఖలు పూర్తిగా మారిపోతున్నాయి. ఒకప్పుడు నక్సలిజం అదుపు ప్రధాన ఎజెండాగా ఉండగా, ఇప్పుడు సైబర్ క్రైమ్స్ (Cyber crimes), డ్రగ్స్ (Drugs) అక్రమ రవాణా పోలీసులకు అతిపెద్ద సవాళ్లుగా మారాయి. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పనితీరుపై శనివారం విస్తృత స్థాయి సమీక్ష నిర్వహించిన రాష్ట్ర డీజీపీ (DGP) సి.వి. ఆనంద్.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా బేసిక్ పోలీసింగ్‌ను బలోపేతం చేయాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.

తగ్గిన నేరాలు.. కానీ రికవరీ ఏదీ?

సమీక్షలో భాగంగా వరంగల్ పోలీస్ కమిషనర్ శ్వేత పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా నేరాల వివరాలను వెల్లడించారు. 2025లో 10,722గా ఉన్న కేసులు 2026 నాటికి 10,526కు తగ్గాయని నివేదికలో పేర్కొన్నారు. మహిళలపై వేధింపులు, అత్యాచార కేసులు, రోడ్డు ప్రమాదాలు తగ్గడం సానుకూల పరిణామమే అయినా, ఆస్తి సంబంధిత నేరాల్లో గుర్తింపు/రికవరీ శాతం 74.75% నుంచి 56.05%కి పడిపోవడంపై డీజీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. దర్యాప్తు నాణ్యతను పెంచి, పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు.

ఎడ్యుకేషన్ హబ్‌లో డ్రగ్స్ కలకలం

వరంగల్ ఒక ప్రధాన ఎడ్యుకేషన్ హబ్ (Education hub) కావడంతో పాటు ఇక్కడ అతిపెద్ద రైల్వే అనుసంధానం ఉన్నందున చిన్న పరిమాణాల్లో డ్రగ్స్ సరఫరాకు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని డీజీపీ అధికారులను హెచ్చరించారు. ఈ ఏడాది డ్రగ్స్ వినియోగం/సరఫరాకు సంబంధించిన చిన్న కేసులు 121 నుంచి 144కు పెరిగాయని గుర్తుచేశారు. డ్రగ్స్‌ను పసిగట్టే స్నిఫర్ డాగ్స్‌ను (Sniffer dogs) తనిఖీల్లో విస్తృతంగా వినియోగించాలని, రైల్వే స్టేషన్లతో పాటు కాలేజీలపై ప్రత్యేక నిఘా ఉంచి అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని స్పష్టం చేశారు.

DGP CV Anand Reviews Warangal Police Focus on Cyber Crimes and Drugs

స్మార్ట్ పోలీసింగ్, సీసీటీవీల పునరుద్ధరణ

జిల్లాలో సైబర్ ఫిర్యాదులు 4,935 నుంచి 2,821కు తగ్గడం ఊరటనిచ్చే అంశం. అయినప్పటికీ సైబర్ నేరాల దర్యాప్తులో టెక్నాలజీని మరింత సమర్థంగా వాడుకోవాలన్నారు. నేరస్థులను పట్టుకోవడానికి NATGRID, AMBIS, CCTNS, e-Sakshya వంటి ఆధునిక డిజిటల్ వేదికలను వాడాలని సూచించారు. ఇక నగరంలో చైన్‌ స్నాచింగ్‌ల నివారణకు పనిచేయని సీసీటీవీ (CCTV) కెమెరాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. అక్షర చిట్ ఫండ్ మోసాలు, పోక్సో (POCSO), ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల దర్యాప్తును వేగవంతం చేయడంతో పాటు రేషన్ బియ్యం స్మగ్లింగ్‌పై అవసరమైతే పీడీ యాక్ట్ (PD Act) ప్రయోగించాలని ఆదేశించారు.

అమరుల కోసం 'టీజీ-వీర్' యాప్

ఈ పర్యటనలో డీజీపీ ఆనంద్ తన పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. వరంగల్‌లో ఏఎస్పీ ట్రైనీగా, ఆ తర్వాత వరంగల్ రూరల్ ఏఎస్పీగా తాను పనిచేసిన రోజులను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అనంతరం విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరుల కుటుంబాల సంక్షేమం కోసం 'టీజీ-వీర్' (TG-Veer) అనే ప్రత్యేక యాప్‌ను లాంచ్ చేశారు. రాబోయే 15-20 ఏళ్ల అవసరాలను దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖను పునర్వ్యవస్థీకరిస్తున్నట్లు వెల్లడించారు.

ఈ కీలక సమీక్షలో మల్టీజోన్-1 ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా, ఈగల్ (EAGLE), సీఎస్‌బీ (CSB), సీఐడీ ఎస్పీలు తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Advertisement
Advertisement