త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్‌-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు

Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్‌-2047’ లక్ష్య సాధనలో కార్పొరేట్‌ సంస్థలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్టిగా ముందుకు సాగితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు.

P

Telangana | Published On Aug 1, 2026, 9.01 pm IST

Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్‌-2047’లో భాగస్వాములు కండి.. మంత్రి శ్రీధర్‌బాబు పిలుపు
Advertisement

Telangana Rising-2047 | ‘తెలంగాణ రైజింగ్‌-2047’ లక్ష్య సాధనలో కార్పొరేట్‌ సంస్థలు భాగస్వాములు కావాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం, పరిశ్రమలు, సమాజం సమష్టిగా ముందుకు సాగితేనే రాష్ట్ర సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. హైదరాబాద్‌లోని కొండాపూర్‌ తెలంగాణ కాంట్రాక్టర్స్‌ కల్చరల్‌ క్లబ్‌లో ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌ ఆఫ్‌ ఇండియా (ఐసీఎస్‌ఐ) హైదరాబాద్‌ చాప్టర్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ‘50వ సదరన్‌ ఇండియా రీజినల్‌ కాన్ఫరెన్స్‌ ఆఫ్‌ కంపెనీ సెక్రటరీస్‌’ను శనివారం మంత్రి ప్రారంభించారు. రెండు రోజుల పాటు జరిగే ఈ సదస్సులో కంపెనీల నిర్వహణ, కార్పొరేట్‌ పాలన, భవిష్యత్‌ సవాళ్లపై చర్చలు జరగనున్నాయి.

ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ.. ‘తెలంగాణ రైజింగ్‌-2047’ కేవలం ప్రభుత్వ కార్యక్రమం మాత్రమే కాదని, సమాజంలోని అన్ని వర్గాల భాగస్వామ్యంతో ముందుకు సాగే అభివృద్ధి దార్శనికత అని వివరించారు. ఆర్థిక ప్రగతితో పాటు సామాజిక అభివృద్ధి కూడా సమాంతరంగా సాగాలనే లక్ష్యంతో ఈ ప్రణాళికను రూపొందించినట్లు తెలిపారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గానికి అభివృద్ధి ఫలాలు చేరేలా, ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు పెరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ ప్రయాణంలో పరిశ్రమలు, విద్యాసంస్థలు, స్వచ్ఛంద సంస్థలు, కార్పొరేట్‌ రంగం భాగస్వామ్యం ఎంతో కీలకమని పేర్కొన్నారు.

సీఎస్‌ఆర్‌తో సామాజిక మార్పు

కార్పొరేట్‌ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్‌) కార్యక్రమాల ద్వారా సమాజంలో గణనీయమైన మార్పు తీసుకురావచ్చని మంత్రి అన్నారు. సీఎస్‌ఆర్‌ కార్యక్రమాల అమలు నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి దశలోనూ రాష్ట్ర ప్రభుత్వం కార్పొరేట్‌ సంస్థలకు భాగస్వామిగా, సహాయకారిగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ (ఏఐ), డేటా గవర్నెన్స్‌, సైబర్‌ భద్రత వంటి అంశాలు కార్పొరేట్‌ రంగంలో కొత్త సవాళ్లుగా మారుతున్నాయని చెప్పారు. ఈ నేపథ్యంలో కంపెనీ సెక్రటరీలు కేవలం నిబంధనల అమలు నిపుణులుగా కాకుండా సంస్థల వ్యూహాత్మక నిర్ణయాల్లో కీలక సలహాదారులుగా ఎదగాల్సిన అవసరం ఉందన్నారు.

కంపెనీలు కేవలం లాభాలకే పరిమితం కాకుండా సుస్థిరమైన, నైతిక వ్యాపార విధానాలను అనుసరించాలని సూచించారు. సమాజం, పర్యావరణం పట్ల బాధ్యతతో కూడిన వ్యాపార వృద్ధి భవిష్యత్‌లో మరింత ప్రాధాన్యం సంతరించుకుంటుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం (సీడీఎక్స్‌)కు నాలెడ్జ్‌ పార్ట్‌నర్‌గా ఉండేందుకు ముందుకొచ్చిన ఐసీఎస్‌ఐ ప్రతినిధులను మంత్రి అభినందించారు. ఇదే స్ఫూర్తితో మరిన్ని కార్పొరేట్‌ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని కోరారు. కార్యక్రమంలో ఐసీఎస్‌ఐ ప్రతినిధులు మహదేవ్‌ తిరునగరి, ఎం దామోదరన్‌, శిల్పా, కార్తీక్‌ పాల్గొన్నారు.

Advertisement
Advertisement