త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Train Tickets | రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. రీఫండ్‌, క్యాన్సిలేష‌న్ రూల్స్ మారాయి..

Train Tickets | రైల్వే టిక్కెట్ల‌కు సంబంధించి రీఫండ్‌, క్యాన్సిలేష‌న్‌కు గాను కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్‌లో ఆయ‌న ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రైలు ప్రారంభం అవ్వ‌డానికి 30 నిమిషాల ముందు ప్ర‌యాణికులు త‌మ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు.

S

Business | Published On Mar 24, 2026, 2.02 pm IST

Train Tickets | రైల్వే ప్ర‌యాణికుల‌కు అల‌ర్ట్‌.. రీఫండ్‌, క్యాన్సిలేష‌న్ రూల్స్ మారాయి..
Advertisement

Train Tickets | రైల్వే టిక్కెట్ల‌కు సంబంధించి రీఫండ్‌, క్యాన్సిలేష‌న్‌కు గాను కొత్త రూల్స్‌ను ప్ర‌వేశ‌పెట్టిన‌ట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణ‌వ్ తెలిపారు. మంగ‌ళ‌వారం పార్ల‌మెంట్‌లో ఆయ‌న ఈ మేర‌కు వివ‌రాల‌ను వెల్ల‌డించారు. రైలు ప్రారంభం అవ్వ‌డానికి 30 నిమిషాల ముందు ప్ర‌యాణికులు త‌మ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకునే అవ‌కాశం క‌ల్పిస్తున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో కేవ‌లం చార్ట్ ప్రిపేర్ అవ‌డానికి ముందు వ‌ర‌కు మాత్ర‌మే ఈ అనుమ‌తి ఉండేది. అలాగే 72 గంట‌ల‌కు ముందు టిక్కెట్ల‌ను క్యాన్సిల్ చేస్తే క‌నీస ఫ్లాట్ క్యాన్సిలేష‌న్ చార్జిల‌ను ఇక‌పై వ‌సూలు చేస్తారు. 24 గంట‌ల నుంచి 72 గంట‌ల లోపు క్యాన్సిల్ చేసే టిక్కెట్ల‌కు 25 శాతం పెనాల్టీ విధిస్తారు. 8 గంట‌ల నుంచి 24 గంట‌ల మ‌ధ్య టిక్కెట్ల‌ను క్యాన్సిల్ చేస్తే 50 శాతం జ‌రిమానా ఉంటుంది. అయితే 8 గంట‌ల క‌న్నా త‌క్కువ టైమ్ ఉంటే ఆ స‌మ‌యంలో టిక్కెట్ల‌ను క్యాన్సిల్ చేస్తే ఎలాంటి రీఫండ్ ఇవ్వ‌బోర‌ని స్ప‌ష్టం చేశారు.

గ‌తంలో కౌంట‌ర్‌లో కొనుగోలు చేసిన టిక్కెట్‌ను ర‌ద్దు చేసుకోవాలంటే రైలు ప్రారంభం అయ్యే స్టేష‌న్‌లో మాత్ర‌మే వెసులుబాటు ఉండేది. కానీ ఇక‌పై ఏ స్టేష‌న్‌లో అయినా స‌రే క్యాన్సిల్ చేసుకోవ‌చ్చు. అలాగే ఇ-టిక్కెట్ క‌లిగిన ప్ర‌యాణికులు టిక్కెట్ డిపాజిట్ రిసీట్ (టీడీఆర్)ను ఫైల్ చేయాలంటే మాన్యువ‌ల్‌గా చేయాల్సి వ‌చ్చేది. కానీ ఇక‌పై ప్ర‌యాణికుడి ప్ర‌మేయం లేకుండా టీడీఆర్ రూల్స్‌ను అనుస‌రించి ఆటోమేటిక్‌గా రీఫండ్ ఇస్తారు. కౌంట‌ర్ టిక్కెట్‌పై ప్ర‌యాణానికి 30 నిమిషాల ముందు కూడా ఇక‌పై ప్ర‌యాణ త‌ర‌గ‌తిని అప్ గ్రేడ్ చేసుకునే వెసులుబాటును క‌ల్పించారు.

ఏప్రిల్ 1 నుంచి 15 మ‌ధ్య అమ‌లు..

రైల్వే శాఖ నూత‌నంగా ప్ర‌వేశ‌పెట్టిన ఈ నిబంధ‌న‌ల‌ను ఏప్రిల్ 1 నుంచి 15 మ‌ధ్య ద‌శ‌ల‌వారిగా అమ‌లు చేయ‌నున్నారు. బోర్డింగ్ పాయింట్ నిబంధ‌న‌ను 30 నిమిషాల‌కు మార్చ‌డం వ‌ల్ల ప్ర‌యాణికుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని రైల్వే శాఖ భావిస్తోంది. ముఖ్యంగా న‌గ‌రాల్లో ఎక్కువ స్టేష‌న్లు ఉన్న‌ప్పుడు ఈ వెసులుబాటు ప్ర‌యాణికుల‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. దీని వ‌ల్ల ప్ర‌యాణికులు ఇక‌పై చార్ట్ ప్రిపేర్ అవ‌డానికి ముందు బ‌దులుగా రైలు ప్రారంభం అవ‌డానికి 30 నిమిషాల ముందు వ‌ర‌కు కూడా త‌మ బోర్డింగ్ పాయింట్‌ను మార్చుకుని సుల‌భంగా ప్ర‌యాణం చేసేందుకు అవ‌కాశం ఉంటుంది.

ఇక ప్ర‌స్తుతం క్యాన్సిలేష‌న్ చార్జిలు ఇలా ఉన్నాయి. ప్ర‌స్తుతం రైలు బ‌య‌ల్దేర‌డానికి 48 గంట‌ల ముందు టిక్కెట్ ర‌ద్దు చేసుకుంటే ఏసీ ఎగ్జిక్యూటివ్‌, ఫ‌స్ట్ ఏసీ ప్ర‌యాణికుల నుంచి రూ.240+జీఎస్‌టీ, ఏసీ చైర్ కార్‌కు రూ.180+జీఎస్‌టీ చొప్పున క్యాన్సిలేష‌న్ చార్జిల‌ను విధిస్తున్నారు. స్లీప‌ర్ క్లాస్‌కు రూ.120, సెకండ్ క్లాస్‌కు రూ.60 చొప్పున వ‌సూలు చేస్తున్నారు. అదే ప్ర‌యాణానికి 48 గంట‌ల నుంచి 12 గంట‌ల ముందైతే 25 శాతం, 12 గంట‌ల నుంచి 4 గంట‌ల మ‌ధ్య 50 శాతం టిక్కెట్ ధ‌ర‌ను మిన‌హాయించుకుని మిగిలిన మొత్తాన్ని రీఫండ్‌గా చెల్లిస్తున్నారు. ప్ర‌యాణానికి 4 గంట‌ల క‌న్నా త‌క్కువ స‌మ‌యం ఉంటే మాత్రం ఎలాంటి రీఫండ్‌ను ఇవ్వ‌డం లేదు.

అన్ని సేవ‌ల‌ను ఒకే ప్లాట్‌ఫామ్‌పై..

ఇక రైల్వే శాఖ ఇప్ప‌టికే తాను అందిస్తున్న సేవ‌లన్నీ ఒకే ప్లాట్‌ఫామ్‌పై ప్ర‌యాణికుల‌కు ల‌భ్యం అయ్యేలా రైల్ వ‌న్ యాప్‌ను ప్ర‌వేశ‌పెట్టి విజ‌య‌వంతంగా నిర్వ‌హిస్తున్న విష‌యం తెలిసిందే. రైలు ప్ర‌యాణికులు టిక్కెట్ల బుకింగ్‌తోపాటు అన్ రిజ‌ర్వ్‌డ్ టిక్కెట్ల‌ను కూడా ఇందులో తీసుకోవ‌చ్చు. అలాగే మీల్స్ బుకింగ్‌, హోట‌ల్స్ కోసం, ఇత‌ర వివ‌రాలు లేదా ఫిర్యాదుల కోసం ఈ యాప్‌ను ఉప‌యోగించ‌వ‌చ్చు. గ‌తంలో ఈ సేవ‌ల‌కు భిన్న ర‌కాల ఫోన్ నంబ‌ర్లు, వెబ్‌సైట్లు, యాప్‌ల‌ను వాడాల్సి వ‌చ్చేది. కానీ ఈ సేవ‌ల‌ను ఇప్పుడు ఒకే ప్లాట్‌ఫామ్‌పై పొంద‌వ‌చ్చు. ఇక ఇప్ప‌టికే మార్చి 1 నుంచి అన్ రిజ‌ర్వ్‌డ్ టిక్కెట్ల‌ను కూడా కేవలం రైల్ వ‌న్ యాప్‌లోనే అందుబాటులో ఉంచుతామ‌ని రైల్వే శాఖ ప్ర‌క‌టించి అమ‌లు చేస్తోంది. కొత్త‌గా అమ‌లు చేయ‌నున్న నిబంధ‌న‌లు ప్ర‌యాణికుల‌కు ఎంతో ఊర‌ట‌ను ఇస్తాయ‌ని రైల్వే శాఖ అధికారులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement