త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Taiwan Stock Markets | ఢిల్లీ కంటే చిన్న దేశం.. ఇండియాను దాటేసింది..

Taiwan Stock Markets | ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో ఇండియాను తైవాన్ అధిగమించడం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం తైవాన్ స్టాక్ మార్కెట్ మొత్తం విలువ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలిచింది.

S

Business | Published On May 27, 2026, 11.20 am IST

Taiwan Stock Markets | ఢిల్లీ కంటే చిన్న దేశం.. ఇండియాను దాటేసింది..
Advertisement

Taiwan Stock Markets | ప్రపంచ స్టాక్ మార్కెట్ ర్యాంకింగ్స్‌లో ఇండియాను తైవాన్ అధిగమించడం గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురి చేసింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం తైవాన్ స్టాక్ మార్కెట్ మొత్తం విలువ 4.95 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, ఇండియా మార్కెట్ క్యాపిటలైజేషన్ 4.92 ట్రిలియన్ డాలర్ల వద్ద నిలిచింది. దీంతో ప్రపంచంలో ఐదో అతిపెద్ద స్టాక్ మార్కెట్‌గా తైవాన్ నిలిచింది. ప్రస్తుతం అమెరికా, మెయిన్‌ల్యాండ్ చైనా, జపాన్, హాంకాంగ్ తర్వాత తైవాన్ స్థానం సంపాదించింది. ఇది మరింత ఆసక్తికరంగా మారడానికి కారణం జనాభా వ్యత్యాసం. 140 కోట్లకు పైగా జనాభా, వేలాది లిస్టెడ్ కంపెనీలు, వేగంగా పెరుగుతున్న రిటైల్ ఇన్వెస్టర్ బేస్ ఉన్న ఇండియాను కేవలం 2.3 కోట్ల జనాభా ఉన్న తైవాన్ అధిగమించడం మార్కెట్ల దృష్టిని ఆకర్షిస్తోంది.

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్సే కార‌ణం..

తైవాన్ ఎదుగుదలకు ప్రధాన కారణం ఒకే పద.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ముఖ్యంగా ప్రపంచ ప్రఖ్యాత సెమీకండక్టర్ దిగ్గజం టీఎస్‌ఎంసీ భారీ ర్యాలీతో తైవాన్ మార్కెట్ విలువ వేగంగా పెరిగింది. ప్రపంచంలోనే అతిపెద్ద సెమీకండక్టర్ తయారీ సంస్థగా ఉన్న టీఎస్‌ఎంసీ ప్రస్తుతం ఎన్‌వీడియా, యాపిల్, ఏఎండీ, క్వాల్‌కామ్ వంటి కంపెనీలకు అత్యాధునిక చిప్స్ తయారు చేస్తోంది. ఏఐ బూమ్ ప్రపంచ పెట్టుబడిదారుల దృష్టిని పూర్తిగా సెమీకండక్టర్ రంగంపైకి మళ్లించింది. టీఎస్‌ఎంసీ షేర్లు ఈ ఏడాది దాదాపు 49 శాతం పెరగడంతో తైవాన్ స్టాక్ ఇండెక్స్‌లో దాని వాటా 42 శాతానికి చేరింది. అంటే తైవాన్ మార్కెట్ వృద్ధి దాదాపు ఒక్క కంపెనీ చుట్టూనే తిరుగుతోంది. ఇక ఇండియా పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. పెరుగుతున్న ఇంధన ధరలు, మందగిస్తున్న కార్పొరేట్ లాభాలు, విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ, అలాగే గ్లోబల్ ఏఐ బూమ్‌కు నేరుగా లింక్ అయ్యే లిస్టెడ్ కంపెనీల కొరత మార్కెట్‌పై ఒత్తిడి తెస్తున్నాయి.

బ‌ల‌మైన లిస్టెడ్ కంపెనీలు మ‌న ద‌గ్గ‌ర లేవు..

వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి బత్తిని మాట్లాడుతూ ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ ఏఐ, టెక్నాలజీ, సెమీకండక్టర్ థీమ్‌ల వైపు మళ్లిందని చెప్పారు. స్టాక్స్ చివరికి ఎర్నింగ్స్‌పైనే ఆధారపడతాయ‌ని, ఇండియాలో ప్రస్తుతం ఎర్నింగ్స్ కాంట్రాక్షన్ కనిపిస్తోంద‌ని అన్నారు. పెరుగుతున్న ఎనర్జీ ధరలు ఆర్థిక వ్యవస్థపై ఒత్తిడిని పెంచుతున్నాయ‌ని, అదే సమయంలో ఏఐ, టెక్నాలజీ, సెమీకండక్టర్ థీమ్‌లు గ్లోబల్ మార్కెట్లలో భారీగా పనిచేశాయ‌ని, కానీ ఇండియాలో అలాంటి బలమైన లిస్టెడ్ కంపెనీలు ఇంకా లేవ‌ని అన్నారు. ఇండియన్ మార్కెట్ల నుంచి విదేశీ ఇన్వెస్టర్లు భారీగా డబ్బు వెనక్కి తీసుకోవడం కూడా కీలక కారణంగా మారింద‌న్నారు. పెరుగుతున్న క్రూడ్ ఆయిల్ ధరలు, రూపాయి బలహీనత, కార్పొరేట్ లాభాల మందగింపు, కొన్ని రంగాల్లో అధిక విలువలు ఎఫ్‌ఐఐల ఆందోళనలను పెంచాయ‌ని, ఈ ఏడాది విదేశీ పెట్టుబడుల ఉపసంహరణ ఇప్పటికే గతేడాది రికార్డులను దాటిందని తెలిపారు.

క్రూడ్ ధ‌ర‌లు పెర‌గ‌డం కూడా కార‌ణ‌మే..

ఇరాన్ ఉద్రిక్తతలతో గ్లోబల్ ఆయిల్ ధరలు పెరగడం ఇండియాకు మరింత సమస్యగా మారింది. దేశం తన క్రూడ్ ఆయిల్ అవసరాల్లో దాదాపు 90 శాతం దిగుమతులపై ఆధారపడుతోంది. దీంతో ఆయిల్ ధరల పెరుగుదల నేరుగా దిగుమతి బిల్లు, ద్రవ్యోల్బణంపై ప్రభావం చూపుతోంది. ఇటీవల రూపాయి డాలర్‌కు 97 స్థాయికి దగ్గరగా బలహీనపడటం కూడా విదేశీ పెట్టుబడిదారులను ఆందోళనకు గురి చేసింది. రూపాయి నిరంతరం బలహీనపడటం విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లలో అనిశ్చితిని పెంచింద‌ని, హాట్ మనీ ఎప్పుడూ వేగంగా గ్రోత్ కనిపించే మార్కెట్ల వైపే వెళ్తుంద‌ని, అందుకే ఈ మధ్యకాలంలో ఇండియన్ మార్కెట్ అండర్‌పర్‌ఫార్మ్ అయింద‌ని క్రాంతి అన్నారు. ఇండియా, తైవాన్ మధ్య వ్యత్యాసం స్పష్టంగా కనిపిస్తోంది. ఇండియాలో 5వేల‌కుపైగా లిస్టెడ్ కంపెనీలు, విస్తృత వినియోగ మార్కెట్, బ్యాంకింగ్, ఐటీ సర్వీసులు, తయారీ, వినియోగ రంగాల ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఉంది. తైవాన్ మాత్రం ఎగుమతి ఆధారిత టెక్నాలజీ, సెమీకండక్టర్ తయారీ కేంద్రంగా ఎదిగింది.

మ‌ళ్లీ పైకి ఎగ‌బాకుతుందా..?

అయితే విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం ఇది ఇండియాకు దీర్ఘకాలికంగా చెడు సంకేతం కాదని చెబుతున్నారు. దేశీయ ఎస్‌ఐపీ ప్రవాహాలు, రిటైల్ ఇన్వెస్టర్ల భాగస్వామ్యం ఇంకా బలంగానే కొనసాగుతున్నాయ‌ని అన్నారు. విదేశీ పెట్టుబడులు బయటకు వెళ్లిన సందర్భాల్లో కూడా దేశీయ సంస్థాగత పెట్టుబడిదారులు మార్కెట్లను నిలబెట్టార‌ని గుర్తు చేశారు. ప్రస్తుతం గ్లోబల్ క్యాపిటల్ సంప్రదాయ వినియోగ ఆధారిత మార్కెట్ల కంటే ఏఐ, సెమీకండక్టర్లు, టెక్నాలజీ తయారీ రంగాలపై మరింత దూకుడుగా దృష్టి పెడుతోందని ఈ పరిణామం స్పష్టం చేస్తోందని చెబుతున్నారు. అయితే రానున్న రోజుల్లో భార‌త్ మ‌ళ్లీ టాప్ స్థానాల‌కు చేరుతుందా, లేదా అన్న విష‌యం వేచి చూస్తే తెలుస్తుంది.

Advertisement
Advertisement