త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Indian Economy | భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ‌రుస షాకులు.. 7వ స్థానానికి ప‌డిపోయిన స్టాక్ మార్కెట్ ర్యాంకు..

Indian Economy | ప్రపంచ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ మరోసారి వెనక్కి జారిపోయింది. నిరంతర బలహీన ప్రదర్శన కారణంగా భారత్ ఇప్పుడు ఏడో స్థానానికి పడిపోయి, తన స్థానాన్ని దక్షిణ కొరియాకు కోల్పోయింది. గత వారం తైవాన్ కూడా భారత్‌ను అధిగమించి ఐదో అత్యంత విలువైన మార్కెట్‌గా నిలిచింది.

S

Business | Published On Jun 2, 2026, 10.44 am IST

Indian Economy | భార‌త ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు వ‌రుస షాకులు.. 7వ స్థానానికి ప‌డిపోయిన స్టాక్ మార్కెట్ ర్యాంకు..
Advertisement

Indian Economy | ప్రపంచ స్టాక్ మార్కెట్ క్యాపిటలైజేషన్ ర్యాంకింగ్స్‌లో భారతీయ స్టాక్ మార్కెట్ మరోసారి వెనక్కి జారిపోయింది. నిరంతర బలహీన ప్రదర్శన కారణంగా భారత్ ఇప్పుడు ఏడో స్థానానికి పడిపోయి, తన స్థానాన్ని దక్షిణ కొరియాకు కోల్పోయింది. గత వారం తైవాన్ కూడా భారత్‌ను అధిగమించి ఐదో అత్యంత విలువైన మార్కెట్‌గా నిలిచింది. బ్లూమ్‌బర్గ్ డేటా ప్రకారం ద‌క్షిణ‌ కొరియా స్టాక్ ఎక్స్చేంజ్‌లో లిస్టైన కంపెనీల మొత్తం మార్కెట్ క్యాప్ 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకోగా, భారత మార్కెట్ విలువ 4.8 ట్రిలియన్ డాలర్లకు తగ్గింది. ఈ ఏడాది కొనసాగుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) బూమ్ కారణంగా ద‌క్షిణ కొరియా మార్కెట్ విలువ ఏకంగా 85 శాతం పెరిగింది. ద‌క్షిణ కొరియాలోని సెమీకండక్టర్ దిగ్గజాలు శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే హైనిక్స్ ప్రస్తుతం ట్రిలియన్ డాలర్ల విలువ కలిగిన కంపెనీల క్లబ్‌లో చేరాయి. ఈ రెండు సంస్థలే కొస్పీ సూచీలో పెద్ద వాటాను కలిగి ఉండటం వల్ల మార్కెట్ క్యాపిటలైజేషన్ గణనీయంగా పెరిగింది. ఇదే తరహా పరిస్థితి తైవాన్‌లో కూడా కనిపిస్తోంది. అక్కడ టీఎస్‌ఎంసీ ఒక్కటే దేశ మార్కెట్ క్యాప్‌లో 40 నుంచి 50 శాతం వరకు వాటా కలిగి ఉంది.

ఏఐ టెక్నాల‌జీలో భార‌త్ ఎక్క‌డ‌..

మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం ఈ తరహా అధిక కేంద్రీకరణ వల్ల సూచీల ప్రదర్శన ఒకే కంపెనీ పనితీరుపై ఆధారపడుతోంద‌ని తెలిపారు. దీంతో లాభాల అవకాశాలు పెరగడంతోపాటు ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నాయ‌న్నారు. ఇక భారత్ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఏఐ ఆధారిత టెక్నాలజీ షేర్లు భారీగా లాభపడుతున్న సమయంలో భారత మార్కెట్ ఆ ధోరణికి దూరంగా ఉండటం ప్రతికూల ప్రభావం చూపింది. ఈ ఏడాది ఇప్పటివరకు కొరియా కొస్పీ సూచీ 99 శాతం ఎగిసిపడగా, తైవాన్ ప్రధాన సూచీ 55 శాతం పెరిగింది. అమెరికా టెక్నాలజీ ఆధారిత నాస్‌డాక్ సూచీ కూడా 21 శాతం లాభపడింది. అదే సమయంలో భారత స్టాక్ మార్కెట్ 11 శాతం నష్టపోయింది. దీంతో గత పదేళ్లలో మొదటిసారిగా వార్షిక ప్రాతిపదికన నష్టాలను నమోదు చేసే దిశగా మార్కెట్ పయనిస్తోంది.

ముడి చ‌మురు ధ‌ర‌ల షాక్‌..

భారత్‌కు మరో ప్రధాన సవాల్ పెరుగుతున్న చమురు ధరలు. ఇంధన ధరల షాక్ కారణంగా దేశ జీడీపీ వృద్ధి అంచనాల‌ను తగ్గించగా, ద్రవ్యోల్బణ అంచనాలు పెరిగాయి. అధిక ముడి చమురు ధరలు కరెంట్ అకౌంట్ డెఫిసిట్, చెల్లింపుల సమతుల్యం, ఆర్థిక లోటు, ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణంపై ప్రతికూల ప్రభావం చూపుతాయని కోటక్ ఇన్‌స్టిట్యూషనల్ ఈక్విటీస్ పేర్కొంది. వారి అంచనా ప్రకారం పశ్చిమ ఆసియా యుద్ధం రాబోయే రోజులు లేదా వారాల్లో ముగిసి, అనంతరం హోర్ముజ్ జలసంధి క్రమంగా తిరిగి తెరుచుకుంటే పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉంది. కాగా భారత వాతావరణ శాఖ తాజా అంచనా కూడా ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది రుతుపవన వర్షపాతం దీర్ఘకాల సగటుతో పోలిస్తే కేవలం 90 శాతమే ఉండొచ్చని ఐఎండీ అంచనా వేసింది. ఇది ఆర్థిక వృద్ధి, ద్రవ్యోల్బణం, అలాగే కార్పొరేట్ కంపెనీల లాభాలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉందని విశ్లేషకులు చెబుతున్నారు.

తొలి స్థానంలో అమెరికా..

క్యూ4 ఎఫ్‌వై26 ఫలితాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ, క్యూ1 ఎఫ్‌వై27 ఫలితాలు ఒడిదుడుకులకు గురయ్యే అవకాశముందని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ పశ్చిమ ఆసియా ఉద్రిక్తతలు తగ్గి ముడి చమురు ధరలు పడిపోతే అది భారత మార్కెట్‌కు పెద్ద ఊరటగా మారుతుందని అన్నారు. అయితే ఆ దిశగా త్వరితగతిన పరిష్కారం వస్తుందనే అంచనాలు ఇప్పటివరకు నెరవేరలేదని, ఈ సమస్య ఇంకా కొనసాగుతోందని పేర్కొన్నారు. కాగా బ్లూమ్‌బ‌ర్గ్ డేటా ప్ర‌కారం ప్ర‌స్తుతం ప్ర‌పంచంలో అత్య‌ధిక స్టాక్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ క‌లిగిన దేశాల్లో అమెరికా 77 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో తొలి స్థానంలో ఉండ‌గా ఆ త‌రువాత 15.6 ట్రిలియ‌న్ డాల‌ర్ల‌తో చైనా రెండో స్థానంలో నిలిచింది. త‌రువాతి స్థానాల్లో వ‌రుస‌గా జ‌పాన్ (8.7 ట్రిలియ‌న్ డాల‌ర్లు), హాంగ్ కాంగ్ (7.2 ట్రిలియ‌న్ డాల‌ర్లు), తైవాన్ (5.1 ట్రిలియ‌న్ డాల‌ర్లు), ద‌క్షిణ కొరియా (5.0 ట్రిలియ‌న్ డాల‌ర్లు), భార‌త్ (4.9 ట్రిలియ‌న్ డాల‌ర్లు) నిలిచాయి.

Advertisement
Advertisement