త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

SpaceX IPO | స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులుగా మార‌నున్న వేలాది ఉద్యోగులు..

SpaceX IPO | ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ (SpaceX) పబ్లిక్ మార్కెట్లోకి అడుగుపెడితే వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఒక్కసారిగా మారిపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. కంపెనీ ఐపీఓ షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయించే అవకాశం ఉందని, ఆ స్థాయిలో స్పేస్‌ఎక్స్ మొత్తం విలువ సుమారు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి.

S

Business | Published On Jun 11, 2026, 12.37 pm IST

SpaceX IPO | స్పేస్‌ఎక్స్ ఐపీఓ సంచలనం.. కోటీశ్వరులుగా మార‌నున్న వేలాది ఉద్యోగులు..
Advertisement

SpaceX IPO | ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ (SpaceX) పబ్లిక్ మార్కెట్లోకి అడుగుపెడితే వేలాది మంది ఉద్యోగుల జీవితాలు ఒక్కసారిగా మారిపోవచ్చని అంచనాలు వెలువడుతున్నాయి. కంపెనీ ఐపీఓ షేర్ ధరను 135 డాలర్లుగా నిర్ణయించే అవకాశం ఉందని, ఆ స్థాయిలో స్పేస్‌ఎక్స్ మొత్తం విలువ సుమారు 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఈ విలువ ఆధారంగా చూస్తే, స్పేస్‌ఎక్స్‌లో స్టాక్‌లు కలిగి ఉన్న ప్రస్తుత, మాజీ ఉద్యోగుల్లో 4,400 మందికి పైగా మిలియనీర్లుగా మారే అవకాశం ఉంది. వీరిలో దాదాపు 400 మంది ఉద్యోగుల షేర్ల విలువ 100 మిలియన్ డాలర్లకంటే ఎక్కువగా ఉండొచ్చని అంచనా వేస్తున్నారు. హిల్.కామ్ సీఈఓ ఆండ్రూ బెన్సన్ తెలిపిన ప్రకారం, సాధారణంగా ఐపీఓలలో అత్యధిక ఆర్థిక లాభాలు కంపెనీ వ్యవస్థాపకులు, కొద్దిమంది ఉన్నతాధికారులకే పరిమితమవుతాయి. కంపెనీ స్టాక్ మార్కెట్లో లిస్ట్ అయిన తర్వాత బిలియనీర్లుగా మారేది కూడా ప్రధానంగా వారేనని ఆయన తెలిపారు. అయితే స్పేస్‌ఎక్స్ విషయంలో పరిస్థితి పూర్తిగా భిన్నంగా కనిపిస్తోందన్నారు.

30 శాతం రిటెయిల్ ఇన్వెస్ట‌ర్ల‌కే..

సాధారణంగా ఐపీఓ షేర్లలో కేవలం 5 శాతం నుంచి 10 శాతం వరకు మాత్రమే రిటైల్ ఇన్వెస్టర్లకు కేటాయిస్తారు. మిగతా వాటా మ్యూచువల్ ఫండ్లు, పెన్షన్ ఫండ్లు, ఇన్వెస్ట్‌మెంట్ సంస్థలకు వెళ్తుంది. అయితే స్పేస్‌ఎక్స్ ఐపీఓలో దాదాపు 30 శాతం షేర్లు రిటైల్ ఇన్వెస్టర్ల కోసం కేటాయించే అవకాశం ఉందని సమాచారం. 2011లో స్పేస్‌ఎక్స్‌లో చేరిన ట్రెవర్ హైస్ కంపెనీ చిన్న స్థాయిలో ఉన్న రోజుల్లో ఉద్యోగిగా చేరారు. ఆయనకు వేతనంలో భాగంగా 1 లక్షకు పైగా షేర్లు లభించాయి. ఐపీఓ ధర 135 డాలర్లుగా నిర్ణయిస్తే, ఆయన షేర్ల విలువ కనీసం 13.5 మిలియన్ డాలర్లకు చేరనుంది. రియల్టర్.కామ్‌కు చెందిన సీనియర్ ఎకనమిస్ట్ హన్నా జోన్స్ మాట్లాడుతూ, స్పేస్‌ఎక్స్ ఉద్యోగులకు నగదు కంటే ఈక్విటీ రూపంలో ఎక్కువ పారితోషికం చెల్లించిందని చెప్పారు. లిస్టింగ్ అనంతరం ఉద్యోగుల చేతుల్లోకి భారీగా నిధులు రావడంతో రియల్ ఎస్టేట్ మార్కెట్లో కూడా పెద్ద ఎత్తున పెట్టుబడులు ప్రవహించే అవకాశం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.

2వేల డాల‌ర్లు ఉన్నా కూడా..

ఇక మరో ఆసక్తికర అంశం ఫిడెలిటీ అర్హత నిబంధనలు. సాధారణంగా ప్రముఖ ఐపీఓలలో పాల్గొనాలంటే ఇన్వెస్టర్ల ఖాతాల్లో 1 లక్ష నుంచి 5 లక్షల డాలర్ల వరకు ఉండాల్సి వస్తుంది. కానీ స్పేస్‌ఎక్స్ ఐపీఓలో ఫిడెలిటీ ఖాతాలో కేవలం 2వేల డాలర్లు ఉన్న ఇన్వెస్టర్లు కూడా అర్హత పొందే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాన్ మస్క్ స్పేస్‌ఎక్స్‌లో సుమారు 42 శాతం వాటాను కలిగి ఉన్నారు. కంపెనీ విలువ 1.77 ట్రిలియన్ డాలర్లకు చేరితే, మస్క్ వాటా మాత్ర‌మే దాదాపు 740 బిలియన్ డాలర్ల విలువకు చేరుతుంది. గతేడాది స్పేస్‌ఎక్స్ విలువ సుమారు 800 బిలియన్ డాలర్లు ఉండగా, ఈ ఏడాది ఫిబ్రవరిలో మస్క్‌కు చెందిన ఎక్స్ ఏఐతో విలీనమైన తర్వాత అది 1.25 ట్రిలియన్ డాలర్లకు పెరిగింది. ఇప్పుడు ఐపీఓ ద్వారా కంపెనీ 75 బిలియన్ డాలర్ల వరకు సమీకరించే అవకాశం ఉందని చెబుతున్నారు. అది నిజమైతే, ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ డెబ్యూ అవుతుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. కాగా గురువారం ఈ స్టాక్ ఐపీవోకు వ‌స్తుంద‌ని స‌మాచారం. శుక్ర‌వారం నుంచి నాస్డాక్‌లో ట్రేడ్ అవుతుంద‌ని తెలుస్తోంది.

Advertisement
Advertisement