త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Health Insurance | వేగ‌వంతం కానున్న హెల్త్ ఇన్సూరెన్స్ ల క్లెయిమ్ ప్రాసెసింగ్‌.. ఐఆర్‌డీఏఐ కొత్త స‌బ్‌-క‌మిటీ ఏర్పాటు..

Health Insurance | పెరుగుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, క్లెయిమ్ ప్రాసెసింగ్‌లో ఆలస్యం, హాస్పిట‌ల్స్‌ ఛార్జీలపై అనుమానాలు పాలసీదారులకు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఒక కొత్త సబ్-కమిటీని ఏర్పాటు చేసింది.

S

Business | Published On Apr 11, 2026, 10.15 am IST

Health Insurance | వేగ‌వంతం కానున్న హెల్త్ ఇన్సూరెన్స్ ల క్లెయిమ్ ప్రాసెసింగ్‌.. ఐఆర్‌డీఏఐ కొత్త స‌బ్‌-క‌మిటీ ఏర్పాటు..
Advertisement

Health Insurance | పెరుగుతున్న హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, క్లెయిమ్ ప్రాసెసింగ్‌లో ఆలస్యం, హాస్పిట‌ల్స్‌ ఛార్జీలపై అనుమానాలు పాలసీదారులకు ప్రధాన సమస్యలుగా మారుతున్నాయి. ఈ సమస్యలను దృష్టిలో ఉంచుకుని ఇన్సూరెన్స్ రెగ్యులేట‌రీ అండ్ డెవ‌ల‌ప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (IRDAI) ఒక కొత్త సబ్-కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ వ్యవస్థను మరింత సరళంగా, పారదర్శకంగా, వినియోగదారులకు సులభంగా మార్చే దిశగా చర్యలు తీసుకోనుంది. ఈ సబ్-కమిటీ నియంత్రణ, విధానాలు, కార్యాచరణ పరమైన సిఫార్సులను అందించనుంది. దీని ద్వారా కొత్త ఆవిష్కరణలకు ప్రోత్సాహం, విస్తృత కవరేజ్, మెరుగైన రిస్క్ పూలింగ్, ఆర్థిక రక్షణను పెంచడమే లక్ష్యంగా నిర్ణ‌యం తీసుకుంది. ముఖ్యంగా హాస్పిట‌ల్‌లో చేరినప్పుడు లేదా క్లెయిమ్ సమయంలో ఇన్సూరెన్స్ సాఫీగా పనిచేయాలని, వినియోగదారుల విశ్వాసాన్ని పెంపొందించడంపై దృష్టి సారిస్తోంది.

క్లెయిమ్ ప్రాసెసింగ్ లో ఆల‌స్యాన్ని త‌గ్గించ‌డ‌మే ల‌క్ష్యం..

IRDAI పరిష్కరించాలనుకుంటున్న ముఖ్య సమస్యలలో క్లెయిమ్ ప్రాసెసింగ్‌లో ఆలస్యం, పారదర్శకత లోపం, ఫిర్యాదుల పరిష్కారంలో గ్యాప్‌లు వంటివి ఉన్నాయి. హాస్పిట‌ల్స్‌ ఛార్జీలు, బిల్లింగ్ విధానాలపై ఉన్న అనుమానాలు కూడా ప్రధానంగా ఉన్నాయి. నేషనల్ హెల్త్ క్లెయిమ్స్ ఎక్స్చేంజ్ (NHCX) వంటి డిజిటల్ ప్లాట్‌ఫామ్‌ల ద్వారా ప్రక్రియలను సులభతరం చేయడం అవసరమని భావిస్తోంది. అదేవిధంగా మోసాలను తగ్గించడం, పరిపాలనా లోపాలను సరిచేయడం, ప్రైవేట్ ఇన్సూరెన్స్, ప్రభుత్వ పథకాల మధ్య సమన్వయం మెరుగుపరచడం కూడా లక్ష్యంగా పెట్టుకుంది. వినియోగదారులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలు.. పాలసీ వివరాలు అర్థం కాకపోవడం, క్లెయిమ్ ఆలస్యం, ఎక్స్‌క్లూజన్స్, హాస్పిట‌ల్‌ ఛార్జీలు, ఫిర్యాదుల పరిష్కారం వంటి అంశాలపై ఉన్నాయి. ఈ సమస్యలు మొత్తం వ్యవస్థపై విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నాయి.

అనేక అంశాల్లో పాల‌సీదారుల‌ ఇబ్బందులు..

డిజిటల్ వ్యవస్థలు, మోసాల నివారణ పద్ధతులు, పాలసీ పోర్టబిలిటీ, ప్రైవేట్, ప్రభుత్వ పథకాల మధ్య సమన్వయం వంటి అంశాలను కూడా కమిటీ పరిశీలించనుంది. హాస్పిట‌ళ్ల‌ నెట్‌వర్క్‌లు, టారిఫ్ నిర్మాణం, పరిపాలనా లోపాలను సమీక్షించి పాలసీదారులకు మెరుగైన విలువ అందించేందుకు ప్రయత్నిస్తోంది. కన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ (CII) ఏర్పాటు చేసిన వర్కింగ్ గ్రూపుల సిఫార్సులను కూడా ఈ కమిటీ పరిగణన‌లోకి తీసుకోనుంది. ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిట‌ల్స్‌ మధ్య సంయుక్త ప్రవర్తనా నియమావళి, స్టాండర్డైజ్డ్ ఎంగేజ్‌మెంట్ ఫ్రేమ్‌వర్క్‌లు, NHCX విస్తరణ, వైద్య ద్ర‌వ్యోల్బ‌ణం, క్లెయిమ్ ట్రెండ్స్‌పై విశ్లేషణలు ఇందులో భాగంగా ఉంటాయి. నిపుణుల అభిప్రాయం ప్రకారం పాలసీదారులు చాలా కాలంగా స్పష్టత లేని లాభాలు, ఎక్స్‌క్లూజన్స్, హాస్పిట‌ల్‌ ఛార్జీలు, క్లెయిమ్ ప్రక్రియలలో అసమానతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఇవి వ్యవస్థపై నమ్మకాన్ని నేరుగా ప్రభావితం చేశాయి.

ఛార్జీలు, ప్రీమియం త‌గ్గుతాయి..

ప్రోబస్ మేనేజింగ్ డైరెక్టర్ రాకేష్ గోయల్ మాట్లాడుతూ ప్రస్తుతం ప్రధాన సమస్య హాస్పిట‌ల్‌ టారిఫ్‌లని, ఇన్సూరెన్స్ ఉన్నందుకు ఎక్కువగా ఛార్జ్ చేస్తున్నారనే భావన ఉంద‌న్నారు. ఈ కమిటీ ప్రత్యేకంగా ఈ సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పడింద‌ని, దీని వల్ల ధరలు సమానంగా మారే అవకాశం ఉంద‌ని తెలిపారు. ఇన్సూరెన్స్ కంపెనీలు, హాస్పిట‌ల్స్‌ మధ్య సంయుక్త ప్రవర్తనా నియమావళి అమలైతే బిల్లింగ్ సమయంలో తలెత్తే వివాదాలు త్వరగా పరిష్కారం అవుతాయని, డిశ్చార్జ్ ప్రక్రియ సులభతరం అవుతుందని ఆయన చెప్పారు. స్టేవెల్ హెల్త్ సహ వ్యవస్థాపకుడు అరుణ్ రామమూర్తి మాట్లాడుతూ ఈ కొత్త వర్కింగ్ గ్రూప్ ద్వారా హెల్త్ ఇన్సూరెన్స్ అందుబాటును పెంచడం, వినియోగదారులకు మరింత సులభంగా మార్చడంపై దృష్టి పెరుగుతుంద‌ని అన్నారు. పాలసీదారుల దృష్టిలో చూస్తే హాస్పిట‌ల్‌ బిల్లులు, క్లెయిమ్ సెటిల్‌మెంట్ ప్రక్రియలో ఉన్న భారీ తేడాలు ఒక పెద్ద సమస్యగా ఉన్నాయి. ఒకే నగరంలో లేదా వేర్వేరు నగరాల్లో కూడా ఒకే చికిత్సకు భిన్నమైన ఛార్జీలు ఉండటం వల్ల గందరగోళం ఏర్పడుతోంది.

బిల్లింగ్‌, క్లెయిమ్ సెటిల్‌మెంట్ లో స్ప‌ష్ట‌త‌..

వినియోగదారులు ప్రధానంగా ఆశిస్తున్నది పారదర్శకత, స్థిరత్వం. ముఖ్యంగా హాస్పిట‌ల్‌ బిల్లింగ్, క్లెయిమ్ సెటిల్‌మెంట్‌లో స్పష్టత అవసరం ఉంది. హెల్త్ ఇన్సూరెన్స్ నిజంగా సామాన్య ప్రజలకు ఉపయోగపడేలా చేయడం ప్రధాన లక్ష్యం. సులభమైన బేసిక్ ప్రోడక్ట్ ఫ్రేమ్‌వర్క్ ద్వారా క్లిష్టమైన పాలసీలను తగ్గించవచ్చు. ప్రైవేట్ ఇన్సూరెన్స్‌ను ప్రభుత్వ పథకాలతో అనుసంధానం చేసి, NHCX ను విస్తరించడం ద్వారా క్లెయిమ్‌లు వేగంగా పూర్తవుతాయ‌ని గోయల్ పేర్కొన్నారు. ఇక చివరికి ప్రీమియంలను స్థిరంగా ఉంచడం కూడా ప్రధాన లక్ష్యంగా ఉంది. వైద్య ద్ర‌వ్యోల్బ‌ణం, క్లెయిమ్ ట్రెండ్స్‌ను విశ్లేషించి దీర్ఘకాలంలో కవరేజ్ అందుబాటులో ఉండేలా చూడనుంది. అధిక ప్రమాదం ఉన్న వర్గాలపై ఎక్కువ ధరల‌కు ప్రీమియంలు ఉండవచ్చు, కానీ మొత్తం పాలసీదారులకు న్యాయం జరిగేలా మార్పులు తీసుకురానున్నారు. క్లెయిమ్‌లు, పాలసీ స్పష్టతలో స్పష్టమైన మార్పులు రావడానికి 1-2 సంవత్సరాలు పట్టే అవకాశం ఉన్నప్పటికీ, చివరికి వినియోగదారులు కేవలం నిబంధనలపై కాకుండా వ్యవస్థ ద్వారా నిజంగా రక్షణ పొందే పరిస్థితిని సృష్టించడం ఈ చర్యల ప్రధాన లక్ష్యంగా ఉంది. దీని వ‌ల్ల పాల‌సీదారుల‌కు ఎంతో మేలు జ‌రుగుతుంద‌ని నిపుణులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

Advertisement
Advertisement