త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Insurance | గ‌డువు దాటింద‌ని ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రిస్తే కుద‌ర‌దు

Insurance | ఆసుపత్రి ఖర్చుల రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను కేవలం పాలసీలో పేర్కొన్న గడువు ముగిసిందనే కారణంతో బీమా సంస్థలు తిరస్కరించలేవని బాంబే హై కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు భార‌తి డాంగ్రె, మంజుష దేశ్‌పాండెల ధర్మాసనం ఏప్రిల్ 20న ఇచ్చిన ఉత్తర్వుల్లో, బీమా పాలసీ కింద రావాల్సిన మొత్తాన్ని ఎనిమిది వారాల్లో చెల్లించాలని, అలాగే చెల్లించాల్సిన తేదీ నుంచి వార్షిక 6 శాతం వడ్డీతో సహా చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది.

S

Business | Published On Jun 13, 2026, 11.24 am IST

Insurance | గ‌డువు దాటింద‌ని ఇన్సూరెన్స్ క్లెయిమ్‌ల‌ను తిర‌స్క‌రిస్తే కుద‌ర‌దు
Advertisement

Insurance | ఆసుపత్రి ఖర్చుల రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను కేవలం పాలసీలో పేర్కొన్న గడువు ముగిసిందనే కారణంతో బీమా సంస్థలు తిరస్కరించలేవని బాంబే హై కోర్టు స్పష్టం చేసింది. న్యాయమూర్తులు భార‌తి డాంగ్రె, మంజుష దేశ్‌పాండెల ధర్మాసనం ఏప్రిల్ 20న ఇచ్చిన ఉత్తర్వుల్లో, బీమా పాలసీ కింద రావాల్సిన మొత్తాన్ని ఎనిమిది వారాల్లో చెల్లించాలని, అలాగే చెల్లించాల్సిన తేదీ నుంచి వార్షిక 6 శాతం వడ్డీతో సహా చెల్లించాలని బీమా సంస్థను ఆదేశించింది. ఈ కేసులో పిటిషనర్ సీపీ రవీంద్రనాథ్ మీనన్, తన యజమాని సంస్థ ఎక్స్‌పోర్ట్‌-ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ద్వారా పొందిన గ్రూప్ హెల్త్ పాలసీ కింద రీయింబర్స్‌మెంట్ కోరారు. ఈ పాలసీ 2021 ఏప్రిల్ 1 నుంచి 2022 మార్చి 31 అర్ధరాత్రి వరకు అమల్లో ఉంది. పిటిషనర్ 2022 మే 24న, 2021 ఏప్రిల్ 8 నుంచి 2022 ఏప్రిల్ 19 మధ్య జరిగిన వైద్య ఖర్చులకు సంబంధించిన పలు రీయింబర్స్‌మెంట్ క్లెయిమ్‌లను సమర్పించారు. అయితే రూ.1.13 లక్షల క్లెయిమ్‌ను యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ తిరస్కరించింది. పాలసీ ప్రకారం క్లెయిమ్‌ను 90 రోజుల లోపు దాఖలు చేయాల్సి ఉంటుందని, ఆ గడువు దాటిపోయిందని సంస్థ వాదించింది.

కాల ప‌రిమితి నిబంధ‌న స‌రికాదు..

బీమా సంస్థ తరఫు న్యాయవాది, ఇది రెండు పక్షాల మధ్య కుదిరిన ఒప్పందమని, పాలసీలో 90 రోజుల కంటే పాత బిల్లులకు చెల్లింపు లేదా రీయింబర్స్‌మెంట్ ఉండదని స్పష్టంగా పేర్కొంద‌ని, పాలసీదారు ఆ నిబంధనలకు అంగీకరించినందున వాటికి కట్టుబడి ఉండాలని వాదించారు. అందువల్ల గడువు దాటిన తర్వాత క్లెయిమ్ చేసినందుకు తిరస్కరణ సరైనదేనని పేర్కొన్నారు. అయితే ఈ వాదనను కోర్టు తోసిపుచ్చింది. బీమా పొందిన వ్యక్తికి పాలసీ కింద చట్టబద్ధంగా లభించాల్సిన ప్రయోజనాన్ని పొందేందుకు కాలపరిమితి విధించడం సమంజసం కాదని పేర్కొంది. అలాంటి నిబంధనలు చెల్లవని, శూన్యంగా పరిగణించాల్సిందేనని స్పష్టం చేసింది. ఈ తీర్పు దేశవ్యాప్తంగా అనేక మంది పాలసీదారులకు ఊరటనిచ్చే అవకాశముందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

ఇది గేమ్ చేంజ‌ర్ ఉత్తర్వు..

క్వాడ్రా లీగ‌ల్ భాగస్వామి హిమాన్షు విధాని మాట్లాడుతూ భారత ఒప్పంద చట్టంలోని సెక్షన్ 28(బి) ప్రకారం బీమా పాలసీల్లోని కాలపరిమితి నిబంధనలను కోర్టు చెల్లవని ప్రకటించిందన్నారు. దీంతో కేవలం ఆలస్యమైందనే సాంకేతిక కారణంతో నిజమైన క్లెయిమ్‌లను తిరస్కరించే అవకాశాన్ని బీమా సంస్థలు కోల్పోయాయని చెప్పారు. ఈ తీర్పు గ్రూప్, వ్యక్తిగత హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలన్నింటికీ సమానంగా వర్తించే అవకాశముందని, బీమా సంస్థలు తమ తిరస్కరణ విధానాలను పునఃసమీక్షించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.అలాగే స‌ర్వాంక్ అసోసియేట్స్ మేనేజింగ్ పార్ట్నర్ అంకితా సింగ్ మాట్లాడుతూ, ఈ ఉత్తర్వు బీమా రంగానికి గేమ్‌చేంజర్‌లా మారిందన్నారు. చెల్లుబాటు అయ్యే క్లెయిమ్‌లను కేవలం విధానపరమైన గడువుల పేరుతో తిరస్కరించలేమని కోర్టు స్పష్టత ఇచ్చిందని చెప్పారు. పాలసీదారుడి రక్షణ హక్కును పరిపాలనా గడువుల కంటే ప్రాధాన్యంగా పరిగణిస్తూ, సుప్రీంకోర్టు గత తీర్పుల స్ఫూర్తిని ఈ నిర్ణయం అనుసరించిందని తెలిపారు.

Advertisement
Advertisement