త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం

Heavy Rains | తెలంగాణ‌లో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల్లో యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు.

P

Telangana | Published On Jun 15, 2026, 5.20 pm IST

Heavy Rains | ఈ నెల 19 నుంచి భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలని మంత్రి పొంగులేటి ఆదేశం
Advertisement

Heavy Rains | తెలంగాణ‌లో రాబోయే రోజుల్లో వర్షాల తీవ్రత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్త చర్యలు కట్టుదిట్టంగా చేపట్టాలని రెవెన్యూ, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అధికారులను ఆదేశించారు. వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని స్థాయిల్లో యంత్రాంగం సిద్ధంగా ఉండాలని ఆయన స్పష్టం చేశారు. విపత్తులు సంభవించిన తర్వాత స్పందించడంకంటే ముందుగానే అంచనా వేసి నివారణ చర్యలు చేపట్టడం అత్యంత అవసరమని మంత్రి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచనల మేరకు రాష్ట్రం నుంచి గ్రామస్థాయి వరకు రెవెన్యూ, విపత్తుల నిర్వహణ వ్యవస్థను పూర్తిగా అప్రమత్తంగా ఉంచాలని ఆయన సూచించారు.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. ఈ నెల 19వ తేదీ నుంచి తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు ఉద్ధృతమయ్యే అవకాశం ఉందని, తదుపరి వారం రోజుల పాటు వర్షపాతం కొనసాగవచ్చని అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని జిల్లాలను అప్రమత్తం చేస్తూ సోమవారం మంత్రి సమీక్ష నిర్వహించారు. నైరుతి రుతుపవనాలు ఇప్పటికే దక్షిణ తెలంగాణలో ప్రవేశించి జోగులాంబ గద్వాల జిల్లాను కవర్ చేసినట్లు అధికారులు వివరించారు. ప్రస్తుతం హైదరాబాద్, భద్రాద్రి కొత్తగూడెం ప్రాంతాల మీదుగా రుతుపవనాల ప్రభావం కొనసాగుతోందని, జూన్ 14 నాటికి దక్షిణ తెలంగాణతో పాటు మధ్య తెలంగాణలోని పలు జిల్లాలకు విస్తరించినట్లు తెలిపారు. జూన్ 1 నుంచి ఇప్పటివరకు రాష్ట్రంలో సగటున 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందని, సాధారణంగా 54.9 మిల్లీమీటర్లు ఉండాల్సి ఉండగా సుమారు 10 శాతం లోటు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.

వాతావరణ శాఖ హెచ్చరికలను నిరంతరం పర్యవేక్షిస్తూ జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ అధికారులు, విపత్తుల నిర్వహణ సిబ్బందితో సమన్వయం కొనసాగించాలని మంత్రి ఆదేశించారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న ప్రాంతాలను ముందుగానే గుర్తించి అవసరమైన రక్షణ చర్యలు చేపట్టాలని సూచించారు. ప్రజల ప్రాణాలు, ఆస్తుల రక్షణ ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యమని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం వర్షాకాలంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటుందని ఆయన పేర్కొన్నారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని శాఖల అధికారులు నిరంతర అప్రమత్తతతో పనిచేయాలని మంత్రి స్పష్టం చేశారు.

Advertisement
Advertisement