త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Samsung India | శాంసంగ్‌ ఇండియాలో ఉద్యోగాల కోత.. 100 మందికి ఉద్వాసన..

Samsung India | ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఇండియా పెరుగుతున్న వ్యయాలు, బలహీనమైన డిమాండ్‌, తగ్గుతున్న మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. శాంసంగ్‌ టెలివిజన్‌, గృహోపకరణాల విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని కోరినట్లు సమాచారం.

S

Business | Published On Sep 8, 2026, 5.15 pm IST

Samsung India | శాంసంగ్‌ ఇండియాలో ఉద్యోగాల కోత.. 100 మందికి ఉద్వాసన..
Advertisement

Samsung India | ఎలక్ట్రానిక్స్‌ దిగ్గజం శాంసంగ్‌ ఇండియా పెరుగుతున్న వ్యయాలు, బలహీనమైన డిమాండ్‌, తగ్గుతున్న మార్జిన్ల ఒత్తిడిని ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో సంస్థ ఉద్యోగాల కోతకు శ్రీకారం చుట్టినట్లు తెలుస్తోంది. మీడియా నివేదికల ప్రకారం.. శాంసంగ్‌ టెలివిజన్‌, గృహోపకరణాల విభాగాల్లో పనిచేస్తున్న సుమారు 80 నుంచి 100 మంది ఎగ్జిక్యూటివ్‌లను ఉద్యోగాల నుంచి తప్పుకోవాలని కోరినట్లు సమాచారం. ఈ ఉద్యోగాల కోతను విడతల వారీగా చేపడుతున్నట్లు తెలుస్తోంది. ప్రభావిత ఉద్యోగుల్లో డైరెక్టర్‌ స్థాయి అధికారులు, టీమ్‌ లీడర్లు ఉన్నారు. శాంసంగ్‌ ప్రధాన కార్యాలయంలో పనిచేస్తున్న వారితోపాటు బ్రాంచ్‌, ఏరియా మేనేజర్లు కూడా ఈ జాబితాలో ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి.

25 శాతం మందిపై ప్ర‌భావం..

స్మార్ట్‌ఫోన్‌ విక్రయ విభాగాన్ని మినహాయిస్తే.. శాంసంగ్‌ ఎలక్ట్రానిక్స్‌ వ్యాపారంలో సేల్స్‌, మార్కెటింగ్‌ విభాగాల్లో సుమారు 550 నుంచి 600 మంది ఎగ్జిక్యూటివ్‌లు ఉన్నారు. వీరిలో దాదాపు 25 శాతం మందిపై చివరకు ఉద్యోగాల కోత ప్రభావం పడే అవకాశం ఉందని సమాచారం. శాంసంగ్‌ నేరుగా నియమించుకున్న ఉద్యోగులతోపాటు మ్యాన్‌పవర్‌ ఏజెన్సీల ద్వారా పనిచేస్తున్న ఆఫ్‌-రోల్‌ సిబ్బంది కూడా ఇందులో ఉన్నారు. ఉద్యోగాలను వదులుకోవాలని కోరిన వారికి మూడు నెలల జీతంతో పాటు ప్రతి ఏడాది సర్వీస్‌కు అదనంగా ఒక నెల జీతాన్ని చెల్లించే ప్రతిపాదన చేసినట్లు తెలుస్తోంది. శాంసంగ్‌ ఇండియా వ్యాపారం ప్రస్తుతం అనేక ఒత్తిళ్లను ఎదుర్కొంటోంది. మెమరీ చిప్‌ ధరలు రెండింతలకు పైగా పెరగడం, అదే సమయంలో రూపాయి విలువ బలహీనపడటం, స్మార్ట్‌ఫోన్‌ విక్రయాలు మందగించడం సంస్థ మార్జిన్లపై ప్రభావం చూపుతున్నాయని పరిశ్రమ నిపుణులు చెబుతున్నారు. పెరిగిన ఉత్పత్తి వ్యయాలు ఎలక్ట్రానిక్స్‌ సంస్థపై మరింత ఒత్తిడిని పెంచుతున్నాయి.

త‌గ్గిన స్మార్ట్‌ఫోన్ విక్ర‌యాలు..

భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌ కూడా గతంలో ఉన్న వేగాన్ని కోల్పోయింది. పరిశ్రమ అంచనాల ప్రకారం స్మార్ట్‌ఫోన్‌ విక్రయాల పరిమాణం ఏడాది ప్రాతిపదికన సుమారు 11 నుంచి 12 శాతం తగ్గింది. ఇది శాంసంగ్‌కు కీలక పరిణామం. ఎందుకంటే భారత్‌లో సంస్థ మొత్తం ఆదాయంలో దాదాపు మూడు వంతులు స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారం నుంచే వస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్మార్ట్‌ఫోన్‌ మోడళ్ల ధరలను శాంసంగ్‌ ఇప్పటికే సుమారు 5 నుంచి 10 శాతం పెంచింది. అయితే ధరల పెంపు వినియోగదారుల డిమాండ్‌పై మరింత ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. వరుస ధరల పెంపుతో వినియోగదారుల రాక గణనీయంగా తగ్గిందని ఆలిండియా మొబైల్‌ రిటైలర్స్‌ అసోసియేషన్‌ తెలిపింది.

దీపావ‌ళి త‌రువాత మ‌రిన్ని కోత‌లు..?

అయితే ప్రస్తుత ఉద్యోగాల కోతలో శాంసంగ్‌ స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారాన్ని చేర్చలేదు. రాబోయే పండుగల సీజన్‌లో, ముఖ్యంగా దీపావళి సమయంలో విక్రయాలు పుంజుకుంటాయని సంస్థ ఆశిస్తోంది. భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ వ్యాపారం ఇప్పటికీ శాంసంగ్‌కు అత్యంత కీలకమైన విభాగంగా కొనసాగుతోంది. విక్రయాల పరిస్థితిని బట్టి మొబైల్‌ విభాగాన్ని తర్వాత సమీక్షించే అవకాశం ఉంది. దీపావళి తర్వాత మరోసారి ఉద్యోగుల సంఖ్యను తగ్గించే చర్యలు ఉంటాయ‌ని తెలుస్తోంది. ముఖ్యంగా టీవీ, గృహోపకరణాల విభాగాల్లో మరిన్ని మార్పులు జరిగే అవకాశం ఉందని నివేదికలు పేర్కొంటున్నాయి.

Advertisement

తాజావార్తలు

Advertisement