త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం

KTR | తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుడు, బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. ఉదయ్ నాగరాజును శాలువాతో సత్కరించి, ప్రత్యేక కరీంనగర్ ఫిలిగ్రీ మెమెంటోను అందజేశారు.

P

Telangana | Published On Jul 28, 2026, 9.15 pm IST

KTR | ఉదయ్ నాగరాజుకు కేటీఆర్ ఘన సన్మానం
Advertisement
  • భారత్–యూకే సంబంధాల బలోపేతంలో ఆయన సేవలు కీలకం
  • కేటీఆర్ రాజకీయ ప్రస్థానం తనకు స్ఫూర్తిదాయకం

KTR | తెలంగాణకు చెందిన ప్రవాస భారతీయుడు, బ్రిటన్ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన తొలి తెలుగు వ్యక్తి ఉదయ్ నాగరాజును బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘనంగా సన్మానించారు. న్యూఢిల్లీలో నిర్వహించిన అభినందన సభలో పాల్గొన్న కేటీఆర్.. ఉదయ్ నాగరాజును శాలువాతో సత్కరించి, ప్రత్యేక కరీంనగర్ ఫిలిగ్రీ మెమెంటోను అందజేశారు. దేశంలోని పలు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు పాల్గొన్న కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ హౌస్ ఆఫ్ లార్డ్స్‌కు ఎన్నికైన ఉదయ్ నాగరాజుకు అభినందనలు తెలిపారు. భారత్–యునైటెడ్ కింగ్‌డమ్ మధ్య రెండు దశాబ్దాలకు పైగా సంబంధాల బలోపేతానికి ఆయన అందించిన సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.

యూకే పౌరుడిగా స్థానిక రాజకీయాల్లో క్షేత్రస్థాయి నుంచి ఎదిగి హౌస్ ఆఫ్ లార్డ్స్ సభ్యుడిగా ఎన్నిక కావడం ఉదయ్ నాగరాజు పట్టుదల, కృషి, ప్రజాసేవకు నిదర్శనమని కేటీఆర్ అన్నారు. ఆయన రాజకీయ ప్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు, ముఖ్యంగా ప్రవాస భారతీయులకు స్ఫూర్తిదాయకమని చెప్పారు. భవిష్యత్తులో భారత్–యూకే సంబంధాల మరింత బలోపేతంతో పాటు తెలంగాణకు సంబంధించిన వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సేవారంగాల అభివృద్ధిలో ఉదయ్ నాగరాజు కీలక పాత్ర పోషించాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ఈ దిశగా కలిసి పనిచేద్దామని సూచించారు. ఈ సందర్భంగా ఉదయ్ నాగరాజు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమం నుంచి కేసీఆర్ నాయకత్వంలో సాగిన రాజకీయ ప్రస్థానం తనకు ఎంతో స్ఫూర్తినిచ్చిందని తెలిపారు. అమెరికాలో ఉన్నత విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం అత్యున్నత ఉద్యోగాన్ని వదిలి ప్రజాసేవ కోసం భారత్‌కు తిరిగి వచ్చి, సాధారణ కార్యకర్తగా రాజకీయాల్లోకి అడుగుపెట్టి రాష్ట్ర మంత్రి, జాతీయ–అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నాయకుడిగా ఎదిగిన కేటీఆర్ ప్రస్థానం తనను ప్రభావితం చేసిందన్నారు.

ఉన్నత విద్యావంతులు రాజకీయాల్లోకి వచ్చి ప్రజల కోసం పనిచేస్తే సమాజంలో సానుకూల మార్పు తీసుకురాగలరనే నమ్మకాన్ని కేటీఆర్ తన రాజకీయ ప్రయాణం ద్వారా కల్పించారని ఉదయ్ నాగరాజు పేర్కొన్నారు. యూకే పర్యటనల సమయంలో కేటీఆర్‌తో సమావేశమై వ్యాపారం, వాణిజ్యం, పెట్టుబడులు, సమకాలీన రాజకీయ అంశాలపై చర్చించే అవకాశం లభించిందని తెలిపారు. ఆయా రంగాలపై కేటీఆర్‌కు ఉన్న దూరదృష్టి తనకు స్ఫూర్తినిచ్చిందన్నారు. తనను సన్మానించి అభినందనలు తెలిపిన కేటీఆర్‌కు ఉదయ్ నాగరాజు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, రాజ్యసభ సభ్యుడు దామోదర్ రావు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి, పార్టీ సీనియర్ నాయకుడు జాన్సన్ నాయక్ పాల్గొన్నారు.

Advertisement
Advertisement