త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

RBI | బ‌ల‌హీమైన రుతుప‌వ‌నాలతో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగే అవ‌కాశం.. ఆర్‌బీఐ హెచ్చ‌రిక‌లు..

RBI | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య జ‌రిగిన యుద్ధం కార‌ణంగా ఇప్ప‌టికే ఇంధన ధ‌ర‌లు, త‌ద్వారా ర‌వాణా, ఆహార ధ‌ర‌లు భారీగా పెరిగి దేశ ప్ర‌జ‌లు అల్లాడిపోతున్న నేప‌థ్యంలో ఆర్‌బీఐ మ‌రో పిడుగు లాంటి వార్త చెప్పింది. జూన్ బులెటిన్ స్టేట్ ఆఫ్ ది ఎకాన‌మీ వ్యాసంలో ఆర్‌బీఐ ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది.

S

Business | Published On Jun 23, 2026, 5.23 pm IST

RBI | బ‌ల‌హీమైన రుతుప‌వ‌నాలతో ద్ర‌వ్యోల్బ‌ణం పెరిగే అవ‌కాశం.. ఆర్‌బీఐ హెచ్చ‌రిక‌లు..
Advertisement

RBI | అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య జ‌రిగిన యుద్ధం కార‌ణంగా ఇప్ప‌టికే ఇంధన ధ‌ర‌లు, త‌ద్వారా ర‌వాణా, ఆహార ధ‌ర‌లు భారీగా పెరిగి దేశ ప్ర‌జ‌లు అల్లాడిపోతున్న నేప‌థ్యంలో ఆర్‌బీఐ మ‌రో పిడుగు లాంటి వార్త చెప్పింది. జూన్ బులెటిన్ స్టేట్ ఆఫ్ ది ఎకాన‌మీ వ్యాసంలో ఆర్‌బీఐ ప‌లు హెచ్చ‌రిక‌లు జారీ చేసింది. ప్ర‌స్తుతం యుద్ధం ముగిసి ఆయా దేశాలు శాంతి చ‌ర్చ‌ల దిశ‌గా కొన‌సాగుతున్న‌ప్పటికీ దేశంలో బ‌ల‌హీన‌మైన రుతుప‌వ‌నాల కార‌ణంగా వ్య‌వ‌సాయ రంగంపై తీవ్ర ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని, దీంతో రానున్న రోజుల్లో ప‌లు ఉత్ప‌త్తులు, నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భారీగా పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపింది. దీని వ‌ల్ల దేశ ఆర్థిక వృద్ధికి కొత్త స‌వాళ్లు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంద‌ని, దేశ ప్ర‌జ‌ల్లో ఆందోళ‌న‌లు నెల‌కొనే అవ‌కాశాలు ఉన్నాయ‌ని ఆర్బీఐ తెలియ‌జేసింది. బ‌ల‌హీన‌మైన నైరుతి రుతుప‌వ‌నాలు దేశ ఆర్థిక వ్య‌వ‌స్థ‌కు ఆందోళ‌న‌క‌రంగా మారే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించింది.

అధిక‌మ‌వ‌నున్న ద్రవ్యోల్బణం..

భార‌త్ వ్య‌వ‌సాయ రంగంపై ఇప్ప‌టికీ అధిక శాతం ఆధార‌ప‌డి ఉంది. గ్రామీణ మార్కెట్ డిమాండ్ కూడా చాలా వ‌ర‌కు వ‌ర్ష‌పాతంపైనే ఆధార‌ప‌డి ఉంటుంది. అందువ‌ల్ల త‌క్కువ వ‌ర్ష‌పాతం న‌మోదైతే అది నేరుగా ఆహార ఉత్ప‌త్తిని దెబ్బ తీస్తుంది. దీంతో నిత్యావ‌స‌రాల ధ‌ర‌లు భారీగా పెరుగుతాయి. ఇది అధిక ద్ర‌వ్యోల్బ‌ణానికి దారి తీస్తుంది. దీని వ‌ల్ల సామాన్యుల కొనుగోలు శ‌క్తి గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంది. అదే గ‌న‌క జ‌రిగితే తీవ్ర అస్థిర ప‌రిస్థితులు ఏర్ప‌డుతాయ‌ని ఆర్‌బీఐ హెచ్చ‌రించింది. భౌగోళిక రాజ‌కీయ అనిశ్చితులు, అంత‌ర్జాతీయ ఆర్థిక వాతావ‌ర‌ణం ఇంకా పూర్తిగా స్థిర‌ప‌డ‌లేద‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఇంకా ఆయా విష‌యాల్లో ఆందోళ‌న‌లు నెల‌కొన్నాయ‌ని స్ప‌ష్టం చేసింది. ప‌శ్చిమాసియాలో అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య కుదిరిన శాంతి ఒప్పందం అంత‌ర్జాతీయ మార్కెట్ల‌కు కాస్త ఊర‌ట‌నిచ్చే విష‌యం అయిన‌ప్ప‌టికీ, భౌగోళిక రాజ‌కీయ ఉద్రిక్త‌త‌లు, అంత‌ర్జాతీయ వాణిజ్య అనిశ్చితులు ఇంకా పూర్తిగా తొల‌గిపోలేద‌ని తెలిపింది. ఒక‌వేళ ప్ర‌స్తుత అంత‌ర్జాతీయ ఒప్పందాలు బ‌ల‌హీన‌ప‌డ్డా, ఉద్రిక్త‌త‌లు మ‌ళ్లీ పెరిగినా అది అంత‌ర్జాతీయ మార్కెట్లు, వివిధ దేశాల పెట్టుబ‌డుల‌పై తీవ్ర ప్ర‌భావం చూపే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొంది.

సిద్ధంగా ఉండాలి..

ప్ర‌నంచ‌వ్యాప్తంగా ప్ర‌స్తుతం ఉన్న ఉద్రిక్త‌త‌లు కాస్త త‌గ్గిన‌ట్లు క‌నిపిస్తున్నా, భ‌విష్య‌త్తులో మ‌ళ్లీ ఆ ఉద్రిక్త‌త‌లు పెరిగితే అవి సుదీర్ఘ ఆర్థిక ప‌రిణామాల‌కు దారి తీస్తాయ‌ని ఆర్‌బీఐ బులెటిన్ స్ప‌ష్టం చేసింది. దీని వ‌ల్ల అంత‌ర్జాతీయంగా ద్ర‌వ్యోల్బ‌ణం వేగంగా పెరుగుతుంద‌ని, ఇంధ‌న స‌ర‌ఫ‌రా మౌలిక స‌దుపాయాల‌పై ఒత్తిడి పెరుగుతుంద‌ని తెలిపింది. కార్పొరేట్ పెట్టుబ‌డి ప్ర‌ణాళిక‌లు ఆల‌స్యం అవుతాయ‌ని, దీని వ‌ల్ల నేరుగా ఆహార భ‌ద్ర‌త‌, ఆర్థిక స్థిర‌త్వం, దీర్ఘ‌కాలిక ఆర్థిక వృద్ధిపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని అంచ‌నా వేసింది. ఈ నేప‌థ్యంలో ప‌లు రంగాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయ‌ని, ఈ ప‌రిణామాల‌కు ప్ర‌భుత్వాలు ముందస్తుగా సిద్ధంగా ఉండాల‌ని ఆర్‌బీఐ సూచించింది. ప్ర‌స్తుతం భార‌త త‌యారీ, సేవ‌ల రంగాల వృద్ధి గ‌త 3 నెల‌లుగా త‌గ్గిన నేప‌థ్యంలో ఆర్‌బీఐ చేసిన హెచ్చ‌రిక‌ల‌ను విస్మ‌రించ‌లేమ‌ని నిపుణులు చెబుతున్నారు.

Advertisement

తాజావార్తలు

Advertisement