త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Post Office MIS | పోస్టాఫీస్‌ పథకం, ఒక్కసారి పెట్టుబడి.. నెలకు రూ.5వేల‌ ఆదాయం..

Post Office MIS | నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందాలని భావిస్తున్న వారికి పోస్టాఫీస్‌ నిర్వహిస్తున్న మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ మంచి ఎంపికగా నిలుస్తుంది. పోస్టాఫీస్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టిన డబ్బుకు భద్రత ఉండటంతోపాటు ప్రభుత్వం ఆకర్షణీయమైన వడ్డీ రేటును కూడా అందిస్తోంది.

S

Business | Published On Aug 26, 2026, 12.53 pm IST

Post Office MIS | పోస్టాఫీస్‌ పథకం, ఒక్కసారి పెట్టుబడి.. నెలకు రూ.5వేల‌ ఆదాయం..
Advertisement

Post Office MIS | నెలనెలా క్రమం తప్పకుండా ఆదాయం పొందాలని భావిస్తున్న వారికి పోస్టాఫీస్‌ నిర్వహిస్తున్న మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ మంచి ఎంపికగా నిలుస్తుంది. పోస్టాఫీస్‌ పథకాల్లో పెట్టుబడి పెట్టిన డబ్బుకు భద్రత ఉండటంతోపాటు ప్రభుత్వం ఆకర్షణీయమైన వడ్డీ రేటును కూడా అందిస్తోంది. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ద్వారా ఒకేసారి పెట్టుబడి పెట్టి, మెచ్యూరిటీ వరకు ప్రతి నెలా నిర్ణీత ఆదాయాన్ని పొందవచ్చు. పోస్టాఫీస్‌ నిర్వహించే ప్రభుత్వ పొదుపు పథకాలలో ప్రధాన ఆకర్షణ పెట్టుబడికి భద్రత ఉండటమే. ప్రభుత్వం పెట్టుబడులకు హామీ ఇవ్వడం వల్ల డబ్బు కోల్పోయే అవకాశం ఉండదు. చిన్న మొత్తాలతో పొదుపు ప్రారంభించి భవిష్యత్తులో పెద్ద మొత్తాన్ని సమకూర్చుకోవడంతో పాటు, మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ వంటి పథకాల ద్వారా నెలవారీ ఆదాయాన్ని కూడా పొందవచ్చు. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌ ప్రస్తుతం 7.40 శాతం వార్షిక వడ్డీని అందిస్తోంది. 18 ఏళ్లు నిండిన ఎవరైనా ఈ పథకంలో ఖాతా తెరవవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టిన మొత్తానికి ఐదేళ్ల మెచ్యూరిటీ కాలం ఉంటుంది.

నెల‌కు రూ.5వేల ఆదాయం ఇలా..

ఈ పథకంలో కేవలం రూ.1వేయితోనే పెట్టుబడి ప్రారంభించవచ్చు. సింగిల్‌ అకౌంట్‌తోపాటు జాయింట్‌ అకౌంట్‌ సదుపాయం కూడా ఉంది. గరిష్ఠంగా ముగ్గురు పెద్దలు కలిసి జాయింట్‌ అకౌంట్‌ తెరవవచ్చు. పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టిన సమయంలో అమల్లో ఉన్న వడ్డీ రేటు ప్రకారమే నెలవారీ ఆదాయాన్ని నిర్ణయిస్తారు. ఆ తర్వాత ప్రభుత్వం త్రైమాసిక సమీక్షల్లో వడ్డీ రేటును మార్చినా, ఇప్పటికే తెరిచిన ఖాతాకు వర్తించే రేటు మెచ్యూరిటీ వరకు మారదు. నిబంధనల ప్రకారం సింగిల్‌ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.9 లక్షలు, జాయింట్‌ అకౌంట్‌లో గరిష్ఠంగా రూ.15 లక్షలు పెట్టుబడి పెట్టవచ్చు. పోస్టాఫీస్‌ పథకం ద్వారా నెలకు రూ.5వేలకు పైగా ఆదాయం పొందాలంటే సింగిల్‌ అకౌంట్‌లో సుమారు రూ.8.11 ల‌క్ష‌ల‌ను పెట్టుబడి పెట్టాలి. 7.40 శాతం వార్షిక వడ్డీ ప్రకారం ఈ మొత్తంపై నెలకు సుమారు రూ.5,001 వడ్డీ ఆదాయం లభిస్తుంది. అంటే ఈ నెలవారీ ఆదాయం పూర్తిగా పెట్టుబడిపై వచ్చే వడ్డీ నుంచే సమకూరుతుంది.

ముందే మూసివేస్తే..

అయితే పోస్టాఫీస్‌ మంత్లీ ఇన్‌కమ్‌ స్కీమ్‌లో పెట్టుబడి పెట్టే సమయంలో ఖాతాను మెచ్యూరిటీ వరకు కొనసాగించడం ముఖ్యం. ఖాతా తెరిచిన ఒక సంవత్సరం నుంచి మూడు సంవత్సరాల మధ్యలో ముందుగానే మూసివేస్తే అసలు మొత్తంలో 2 శాతం మినహాయింపు ఉంటుంది. మూడు సంవత్సరాల తర్వాత, ఐదేళ్లలోపు ఖాతాను మూసివేస్తే అసలు మొత్తంలో 1 శాతం మినహాయింపు విధిస్తారు.

Advertisement
Advertisement