త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharat NCAP 2.0 | భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0.. వాహన భద్రతపై గడ్కరీ కీలక ప్రకటన

Bharat NCAP 2.0 | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం భారత్‌లో రహదారి భద్రత పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశంగా భారత్‌ మొదటి స్థానంలో ఉందని తెలిపారు.

S

Business | Published On Sep 3, 2026, 2.46 pm IST

Bharat NCAP 2.0 | భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0.. వాహన భద్రతపై గడ్కరీ కీలక ప్రకటన
Advertisement

Bharat NCAP 2.0 | కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ గురువారం భారత్‌లో రహదారి భద్రత పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉందని అన్నారు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా అత్యధిక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్న దేశంగా భారత్‌ మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ఈ నేపథ్యంలో మరింత కఠినమైన వాహన భద్రతా ప్రమాణాలను అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోందని, భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0ను 2027 అక్టోబర్‌ నుంచి ప్రారంభించే దిశగా చర్యలు చేపడుతోందని వెల్లడించారు. 66వ సియామ్‌ వార్షిక సదస్సు 2025లో మాట్లాడిన గడ్కరీ, భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలో మూడో అతిపెద్ద వాహన తయారీ దేశంగా ఉందని, త్వరలో ప్రపంచంలోనే అతిపెద్ద వాహన తయారీ దేశంగా ఎదిగే దిశగా పయనిస్తోందని చెప్పారు. ఈ విస్తరణకు మద్దతు ఇవ్వడంతోపాటు, వాహన భద్రతకు సంబంధించిన కీలక సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0 పథకాన్ని తీసుకురావడానికి సిద్ధమవుతోందని తెలిపారు.

వ‌చ్చే ఏడాది నుంచి భార‌త్ ఎన్‌క్యాప్ 2.0..

భారత్‌ స్వదేశీ క్రాష్‌ టెస్టింగ్‌ కార్యక్రమం సాధిస్తున్న విజయాన్ని గడ్కరీ ప్రస్తావించారు. భారత్‌ ఎన్‌క్యాప్‌లో పరీక్షల వ్యయం అంతర్జాతీయ ప్రత్యామ్నాయాలతో పోలిస్తే సుమారు 75 శాతం తక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ భారీ వ్యయ ప్రయోజనం కారణంగా పలు విదేశీ వాహన తయారీ సంస్థలు భద్రతా పరీక్షలు, ధ్రువీకరణ కోసం ప్రత్యేకంగా తమ వాహనాలను భారత్‌కు పంపుతున్నాయని చెప్పారు. అయితే దేశంలో ఆటోమొబైల్‌ రంగం వేగంగా అభివృద్ధి చెందుతున్నప్పటికీ, రహదారులపై నెలకొన్న తీవ్రమైన పరిస్థితులను విస్మరించలేమని గడ్కరీ స్పష్టం చేశారు. ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రధానంగా వాహనం ప్రమాదాన్ని తట్టుకునే సామర్థ్యంపై దృష్టి పెడుతుండగా, 2027లో రానున్న భారత్‌ ఎన్‌క్యాప్‌ 2.0 వాహనం ప్రమాదానికి గురైన మొత్తం ప్రక్రియను సమగ్రంగా అంచనా వేయనుంది. కేవలం ప్యాసివ్‌ భద్రతా చర్యలు సరిపోవని గడ్కరీ పేర్కొన్నారు.

పాద‌చారుల ర‌క్ష‌ణ‌కు ప్రాధాన్యం..

కొత్త నిబంధనల్లో పాదచారుల రక్షణకు అధిక ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ప్రమాదాలను ముందుగానే నివారించే యాక్టివ్‌ క్రాష్‌ ప్రివెన్షన్‌ సాంకేతికతలతో పాటు, ప్రమాదం జరిగిన తర్వాత అందించే కీలక వైద్య, సహాయక సేవల వ్యవస్థలను కూడా భద్రతా ప్రమాణాల్లో భాగంగా చేర్చనున్నారు. ఈ అధునాతన ప్రమాణాలను సమగ్రంగా అమలు చేయడం ద్వారా భారత్‌ను కేవలం ప్రపంచ స్థాయి వాహన తయారీ కేంద్రంగా మాత్రమే కాకుండా, అందుబాటు ధరలో ప్రపంచ స్థాయి వాహన భద్రతా ప్రమాణాలను అభివృద్ధి చేసే దేశంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వం భావిస్తోంది.

నిబంధ‌న‌ల‌ను ఉల్లంఘిస్తే డ్రైవింగ్ లైసెన్స్ ర‌ద్దు..?

భారత్‌ ఎన్‌క్యాప్‌ అంటే భారత్‌ న్యూ కార్‌ అసెస్‌మెంట్‌ ప్రోగ్రామ్‌. 2013లో ప్రారంభమైన ఈ కార్యక్రమం భారత్‌లో అధికారిక, స్వతంత్ర వాహన భద్రతా రేటింగ్‌ వ్యవస్థగా కొనసాగుతోంది. ఇందులో ప్రయాణికుల కార్లను క్రాష్‌ టెస్టులకు గురిచేసి, వాటి భద్రతా పనితీరుకు ఒకటి నుంచి ఐదు వరకు స్టార్‌ రేటింగ్‌ ఇస్తారు. ప్రమాదాల సమయంలో వాహనం పెద్దలను, పిల్లలను ఎంతవరకు రక్షిస్తుంద‌న్న అంశాన్ని ప్రధానంగా అంచనా వేస్తారు. రహదారి భద్రతను మరింత మెరుగుపరిచేందుకు భద్రతా నిబంధనలు ఉల్లంఘించే వ్యక్తుల డ్రైవింగ్‌ లైసెన్సులను రద్దు చేసే విధానాన్ని కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని గడ్కరీ తెలిపారు. అదే సమయంలో బాధ్యతాయుతంగా వాహనాలు నడిపే వారికి ప్రోత్సాహకాలు అందించే విధానాన్ని తీసుకురావడానికి కూడా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement