త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష‌ స్పందన.. 31 శాతం లాభం అంచనా..

Kanohar Electricals IPO | ట్రాన్స్‌ఫార్మర్ తయారీ సంస్థ కనోహర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) మంగళవారం సబ్‌స్క్రిప్షన్‌కు ఓపెన్ అయింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ.601 నుంచి రూ.632గా నిర్ణయించింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పబ్లిక్ ఆఫరింగ్ సెప్టెంబర్ 10న ముగియనుంది.

S

Business | Published On Sep 8, 2026, 12.53 pm IST

Kanohar Electricals IPO | కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవోకు విశేష‌ స్పందన.. 31 శాతం లాభం అంచనా..
Advertisement

Kanohar Electricals IPO | ట్రాన్స్‌ఫార్మర్ తయారీ సంస్థ కనోహర్ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్ (ఐపీవో) మంగళవారం సబ్‌స్క్రిప్షన్‌కు ఓపెన్ అయింది. ఒక్కో ఈక్విటీ షేర్ ధరను రూ.601 నుంచి రూ.632గా నిర్ణయించింది. మూడు రోజుల పాటు కొనసాగనున్న ఈ పబ్లిక్ ఆఫరింగ్ సెప్టెంబర్ 10న ముగియనుంది. రూ.1,056 కోట్ల విలువైన ఈ ఐపీవోలో రూ.300 కోట్ల వరకు తాజా షేర్ల జారీ ఉండగా, ప్రమోటర్ కే సన్స్ ఫ్యామిలీ ట్రస్ట్ 1.2 కోట్ల వరకు షేర్లను ఆఫర్ ఫర్ సేల్ ద్వారా విక్రయించనుంది. ఎగువ ధరల శ్రేణి ప్రకారం ఈ ఆఫర్ ఫర్ సేల్ విలువ రూ.756 కోట్లుగా ఉంది. కంపెనీ ఆర్థిక పనితీరు కూడా గణనీయంగా మెరుగుపడింది. కార్యకలాపాల ద్వారా వచ్చిన ఆదాయం 2024 ఆర్థిక సంవత్సరంలోని రూ.276.6 కోట్ల నుంచి 2026 ఆర్థిక సంవత్సరంలో రూ.653.83 కోట్లకు పెరిగింది. ఇదే సమయంలో నికర లాభం రూ.17.7 కోట్ల నుంచి రూ.129.7 కోట్లకు చేరింది. ఈ ఐపీవోకు నువామా వెల్త్ మేనేజ్‌మెంట్, ఐఐఎఫ్‌ఎల్ క్యాపిటల్ సర్వీసెస్ బుక్ రన్నింగ్ లీడ్ మేనేజర్లుగా వ్యవహరిస్తున్నాయి. ఎంయూఎఫ్‌జీ ఇంటైమ్ ఇండియా రిజిస్ట్రార్‌గా ఉంది.

ఇప్ప‌టి వ‌ర‌కు 25 శాతం సబ్‌స్క్రైబ్..

మంగ‌ళ‌వారం ఉదయం 10:24 గంటల సమయానికి కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవో మొత్తం 25 శాతం సబ్‌స్క్రైబ్ అయింది. క్వాలిఫైడ్ ఇన్‌స్టిట్యూషనల్ బయ్యర్స్ విభాగంలో ఇంకా సబ్‌స్క్రిప్షన్ నమోదు కాలేదు. నాన్-ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ల విభాగం 0.36 రెట్లు, రిటైల్ ఇన్వెస్టర్ల విభాగం 0.34 రెట్లు సబ్‌స్క్రైబ్ అయ్యాయి. ఉద్యోగుల కోసం రిజర్వ్ చేసిన వాటాలో కూడా ఇంకా సబ్‌స్క్రిప్షన్ నమోదు కాలేదు. కనోహర్ ఎలక్ట్రికల్స్ ఐపీవో అంచనా లిస్టింగ్ ధర రూ.828గా ఉంటుంద‌ని గ్రే మార్కెట్ సూచిస్తోంది. అంటే ఒక్కో షేర్‌పై సుమారు 31.01 శాతం లాభం వచ్చే అవకాశం ఉందన్న అంచనాలు ఉన్నాయి. అయితే జీఎంపీ అంటే అనధికారిక సూచిక మాత్రమే కావడంతో వాస్తవ లిస్టింగ్ లాభం భిన్నంగా ఉంటుంది,

పెరిగిన ఆదాయం..

తాజా షేర్ల జారీ ద్వారా సమీకరించే నిధుల్లో రూ.64.1 కోట్లను మూలధన వ్యయాల కోసం కంపెనీ ఉపయోగించనుంది. ఇందులో గంగోల్ తయారీ కేంద్రంలో యంత్రాలు, పరికరాల కొనుగోలు, బ్యాక్‌వర్డ్ ఇంటిగ్రేషన్ సదుపాయాల విస్తరణ, ఆటోమేషన్, కార్యాలయ భవనం నిర్మాణం, ఇంటీరియర్ అభివృద్ధి, సస్టైనబిలిటీ కార్యక్రమాలు ఉన్నాయి. మరో రూ.155 కోట్లను అదనపు వర్కింగ్ క్యాపిటల్ అవసరాల కోసం వినియోగించనుంది. మిగిలిన నిధులను సాధారణ కార్పొరేట్ అవసరాలకు కేటాయించనుంది. కేర్ నివేదికను ఉటంకిస్తూ కంపెనీ తెలిపిన వివరాల ప్రకారం.. 2026 ఆర్థిక సంవత్సరంలో ఆదాయం పరంగా దేశంలోని ప్రముఖ ట్రాన్స్‌ఫార్మర్ తయారీ సంస్థల్లో కనోహర్ ఎలక్ట్రికల్స్ ఒకటిగా నిలిచింది. పవర్ ట్రాన్స్‌మిషన్, రైల్వేలు, పునరుత్పాదక ఇంధనం, పవర్ డిస్ట్రిబ్యూషన్ వంటి రంగాలకు సంస్థ సేవలు అందిస్తోంది.

రెండు విభాగాల్లో కార్య‌క‌లాపాలు..

కంపెనీ ప్రధానంగా రెండు విభాగాల్లో కార్యకలాపాలు నిర్వహిస్తోంది. అవి ట్రాన్స్‌ఫార్మర్ తయారీ, ఇంజినీరింగ్, ప్రొక్యూర్‌మెంట్ అండ్ కన్‌స్ట్రక్షన్ (ఈపీసీ). ఈపీసీ విభాగంలో సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌మిషన్ లైన్లకు సంబంధించిన టర్న్‌కీ ప్రాజెక్టులు, ఎయిర్ ఇన్సులేటెడ్, గ్యాస్ ఇన్సులేటెడ్ సబ్‌స్టేషన్ల ఏర్పాటు, బే ఆగ్మెంటేషన్, ట్రాన్స్‌మిషన్ లైన్ల పనులు ఉన్నాయి. 500 ఎంవీఏ, 400 కేవీ ట్రాన్స్‌ఫార్మర్లకు షార్ట్ సర్క్యూట్ టెస్ట్ సర్టిఫికేషన్ కలిగిన దేశంలోని ఐదు సంస్థల్లో కనోహర్ ఎలక్ట్రికల్స్ కూడా ఒకటి. పవర్ ట్రాన్స్‌మిషన్ రంగంలో అధిక విలువ కలిగిన భారీ కాంట్రాక్టుల కోసం పోటీ పడేందుకు ఈ సామర్థ్యం కంపెనీకి కీలకంగా మారింది.

Advertisement
Advertisement