త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..

Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌కు భారీ ఊరట లభించింది. జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదించిన 3.8 బిలియన్ డాలర్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌కు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉన్న జియో లిస్టింగ్‌కు మార్గం సుగమమైంది.

S

Business | Published On Aug 29, 2026, 10.38 am IST

Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
Advertisement

Jio Platforms IPO | రిలయన్స్ ఇండస్ట్రీస్ అనుబంధ సంస్థ జియో ప్లాట్‌ఫామ్స్‌కు భారీ ఊరట లభించింది. జియో ప్లాట్‌ఫామ్స్ ప్రతిపాదించిన 3.8 బిలియన్ డాలర్ల ప్రారంభ పబ్లిక్ ఆఫరింగ్‌కు భారత మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ ఆమోదం తెలిపింది. దీంతో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా నిలిచే అవకాశం ఉన్న జియో లిస్టింగ్‌కు మార్గం సుగమమైంది. దేశీయ ఐపీఓ మార్కెట్ మళ్లీ జోరందుకుంటున్న సమయంలో జియో ఐపీఓకు ఈ ఆమోదం లభించింది. ఇటీవల వారాల్లో పలు కంపెనీల ఐపీఓలకు రిటైల్ ఇన్వెస్టర్లు, అధిక నికర విలువ కలిగిన వ్యక్తుల నుంచి భారీ స్పందన కనిపించింది. జూలై 1 నుంచి రెండు నెలల్లోపే రెండు డజన్లకు పైగా ఐపీఓల‌ను ప్రకటించడం లేదా ప్రారంభం కావడం గమనార్హం. ఈ ఏడాది తొలి అర్ధభాగంలో నమోదైన 28 ఐపీఓలకు ఇది దాదాపు సమానంగా ఉంది.

అతి పెద్ద ఐపీవోగా నిలిచే అవ‌కాశం..

చందాదారుల సంఖ్య పరంగా చైనా మొబైల్ తర్వాత ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్ ఆపరేటర్‌గా జియో కొనసాగుతోంది. జూన్ చివరి నాటికి కంపెనీకి 53.3 కోట్లకు పైగా మొబైల్ చందాదారులు ఉన్నారు. టెలికాం వ్యాపారంతోపాటు ఇటీవలి కాలంలో కృత్రిమ మేధస్సు, క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ నెట్‌వర్క్ సేవల రంగాల్లోకి కూడా జియో విస్తరించింది. జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీఓ ద్వారా 3.8 బిలియన్ డాలర్లు సమీకరిస్తే, 2024లో హ్యుందాయ్ మోటార్ ఇండియా సమీకరించిన 2.95 బిలియన్ డాలర్లను అధిగమిస్తుంది. తద్వారా దేశ చరిత్రలోనే అతిపెద్ద ఐపీఓగా జియో ప్లాట్‌ఫామ్స్ నిలిచే అవకాశం ఉంది. ఈ ఐపీఓలో మొత్తం 27 కోట్ల షేర్లను జారీ చేయాలని జియో ప్లాట్‌ఫామ్స్ ప్రణాళిక రూపొందించింది. జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు సుమారు 66.4 శాతం వాటా ఉంది. ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా సుమారు 9.9 శాతం, గూగుల్ సుమారు 7.7 శాతం వాటాలను కలిగి ఉన్నాయి.

కంపెనీ విలువ‌ను అంచ‌నా వేసే అవ‌కాశం..

జియో ప్రత్యేకంగా స్టాక్ మార్కెట్‌లో లిస్ట్ కావడం వల్ల రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు దూరంగా కంపెనీ విలువను అంచనా వేసుకునే అవకాశం పెట్టుబడిదారులకు లభిస్తుందని వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్ ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ క్రాంతి భతిని తెలిపారు. ప్రైమరీ మార్కెట్‌లో పెరిగిన కార్యకలాపాలు, రిటైల్ ఇన్వెస్టర్లు, దేశీయ సంస్థాగత పెట్టుబడిదారుల వద్ద ఉన్న బలమైన నగదు లభ్యతను దృష్టిలో ఉంచుకుంటే జియో సంస్థ‌ స్టాక్ మార్కెట్‌లోకి రావడానికి ఇదే సరైన సమయమని ఆయన అభిప్రాయపడ్డారు. జియో ప్లాట్‌ఫామ్స్ పబ్లిక్ ఇష్యూ కోసం డ్రాఫ్ట్ పత్రాలను జూన్‌లోనే భారత సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డు (సెబీ)కి ఆ సంస్థ సమర్పించింది. ఇప్పుడు నియంత్రణ సంస్థ నుంచి ఆమోదం లభించడంతో తదుపరి దశలపై కంపెనీ దృష్టి పెట్టనుంది.

త‌గిన ఉద్యోగుల సంఖ్య‌, పెరిగిన ఆదాయం..

ఆకాశ్ అంబానీ నేతృత్వంలోని జియో ప్లాట్‌ఫామ్స్ సంస్థ ఈ ఐపీఓ ద్వారా వచ్చే నిధుల్లో ప్రధాన భాగాన్ని రుణాల చెల్లింపుల‌కు వినియోగించాలని భావిస్తోంది. ముఖ్యంగా రిలయన్స్ జియో ఇన్ఫోకామ్‌కు చెందిన సుమారు రూ.27,500 కోట్ల రుణాన్ని తీర్చేందుకు ఐపీఓ నిధులను ఉపయోగించనున్నట్లు కంపెనీ వెల్లడించింది. అయితే కంపెనీ ఉద్యోగుల సంఖ్య మాత్రం తగ్గింది. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ ఉద్యోగుల సంఖ్య సుమారు 21 శాతం తగ్గి 27,935కు చేరింది. ఉద్యోగుల సంఖ్య తగ్గినప్పటికీ కంపెనీ ఆదాయం, మొబైల్ చందాదారుల సంఖ్య మాత్రం కొనసాగుతూ పెరిగినట్లు నివేదికలు వెల్లడించాయి.

Advertisement
Advertisement