త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

KTR | చేతకానిత‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు.

P

Telangana | Published On Jun 15, 2026, 6.22 pm IST

KTR | చేతకానిత‌నాన్ని క‌ప్పిపుచ్చుకునేందుకు కుప్పిగంతులు
Advertisement
  • మెట్రో ఫేజ్‌-2 సాధించ‌లేక అబ‌ద్ధాలు ప్ర‌చారం
  • ఢిల్లీకి వెళ్లినా ఎవ‌రూ దేక‌డం లేదు
  • ఓటుకు నోటు కేసుతోనే కేంద్రాన్ని ప్ర‌శ్నించ‌లేని అస‌మ‌ర్థ‌త‌
  • ప్ర‌ధానిని ప్ర‌శ్నించ‌లేక ప్ర‌తిప‌క్షంపై నింద‌లు వేసే నీచ ప్ర‌య‌త్నం
  • హైద‌రాబాద్ మెట్రోరైలు పూర్తి చేసిన ఘ‌న‌త కేసీఆర్‌దే
  • బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌
  • సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్య‌ల‌పై మండిపాటు

KTR | త్రినేత్ర‌.న్యూస్ : మెట్రో ఫేజ్-2 ప్రాజెక్టును కేంద్రం నుంచి సాధించలేక, తన చేతకానితనాన్ని కప్పిపుచ్చుకునేందుకే ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కుప్పిగంతులు తొక్కుతున్నారని, అబద్ధాలను ప్రచారం చేస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రేవంత్ రెడ్డి తన అసమర్థతను దాచుకోవడానికి అనేక అబద్ధాలు ఆడుతున్నారని విమర్శించారు. యూపీ, అహ్మదాబాద్, వైజాగ్ వంటి నగరాలకు కేంద్రం మెట్రోలను మంజూరు చేస్తుంటే, హైదరాబాద్‌కు ఎందుకు తీసుకురాలేకపోయారో ముందుగా ప్రజలకు జవాబు చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. రేవంత్ రెడ్డి అసమర్థ పాలనకు నిదర్శనం మెట్రో రెండో దశకి అనుమతి దక్కకపోవడ‌మేన‌న్నారు. 71 సార్లు ఢిల్లీకి చక్కర్లు కొట్టినప్పటికీ, మీ ‘బడేభాయ్’ని మెప్పించి ప్రాజెక్టును ఒప్పించలేకపోవడం మీ చేతకానితనానికి, దద్దమ్మ పాలనకు నిలువెత్తు నిదర్శనమని కేటీఆర్ విమర్శించారు. రాష్ట్రం ప్రతిపాదించిన మెట్రో విస్తరణకు అనుమతి ఇవ్వని కేంద్రం పైన ముఖ్యంగా ప్రధానమంత్రిని విమర్శించే సత్తా, ధైర్యం రేవంత్ రెడ్డికి లేద‌న్నారు.

ఉచ్చు బిగుస్తుంద‌నే బీజేపీతో చీక‌టి ఒప్పందాలు

తనపై నమోదైన ఓటుకు నోటు కేసు ఉచ్చు బిగుస్తుందనే భయంతో బీజేపీతో చీకటి ఒప్పందాలు చేసుకోవడం వల్లనే ఈ పరిస్థితి ఏర్పడిందని కేటీఆర్ విమ‌ర్శించారు. అందుకే కేంద్రంలోని బీజేపీని కాకుండా తెలంగాణలో ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీని విమర్శించి ప్రజలను తప్పుదోవ పట్టించే నీచమైన ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నార‌న్నారు. బీజేపీతో రేవంత్ రెడ్డికి ఉన్న లోపాయికారి ఒప్పందం వల్లనే ఎన్నిసార్లు ఢిల్లీ పర్యటనలు చేసినా పట్టించుకోవడం లేద‌న్నారు. ఈ అంశంలో రేవంత్ రెడ్డి తన చేతగానితనానికి హైదరాబాద్ ప్రజలకు సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. సమర్థవంతమైన నాయకుడు ఉంటే గతంలో కేసీఆర్ పాలనలో అనుమతులు, రుణాలు శరవేగంగా ఎలా వచ్చాయో, మీ దిక్కుమాలిన పాలనలో అవి ఎందుకు ఆగిపోయాయో ప్రజలకు అర్థమవుతోందని పేర్కొన్నారు.

నిజ‌స్వ‌రూపం బ‌య‌ట‌ప‌డింది..

“ఢిల్లీకి పోతే ‘చెప్పులు ఎత్తుకుపోయే దొంగల్ని చూస్తున్నట్టుగా’ చూస్తున్నారని మీరే చెప్పుకున్నప్పుడే మీ నిజ స్వరూపం బయటపడింది” అని కేటీఆర్ వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పైన, కేసీఆర్‌పై పడి ఏడవడం తప్ప మీకు ఏ పని చేతకాదని నాలుగు కోట్ల తెలంగాణ సమాజానికి అర్థమైందన్నారు. కేంద్రం నుంచి నిధులు రాకుండా బీఆర్ఎస్ అడ్డుకుందని చెప్పడం అంటే.. మోదీ కన్నా కేసీఆర్ పవర్ ఫుల్ అని పరోక్షంగా ఒప్పుకున్నట్లే కదా? అని ఎద్దేవా చేశారు. మెట్రో రెండో దశను సాధించడంలో అట్టర్ ఫ్లాప్ అయినందుకు, మొదటి దశను ఆగం చేస్తున్నందుకు సీఎం వెంటనే ముక్కు నేలకు రాసి క్షమాపణలు చెప్పాలని, లేకపోతే ‘మినీ ఇండియా’ లాంటి హైదరాబాద్‌లో మీకు, మీ పార్టీకి పుట్టగతులు ఉండవని కేటీఆర్ హెచ్చరించారు.

ముమ్మాటికి కేసీఆర్ ఘ‌న‌తే

నాడు కాంగ్రెస్ పాలనలో 28 శాతం మెట్రో పనులు కూడా పూర్తి చేయకుండా ప్రాజెక్టును చిక్కుల్లో వదిలేసిన పరిస్థితుల్లో, 2014లో బీఆర్ఎస్ అధికారంలోకి రాగానే కేసీఆర్ గారు చొరవ తీసుకుని 72 శాతం పనులను పూర్తి చేశారని కేటీఆర్ గుర్తు చేశారు. కేంద్రం సహకరించకపోయినా, రుణాలు సాధించి మెట్రోను పరుగులు పెట్టించిన ఘనత కేసీఆర్ గారికే దక్కుతుందని స్పష్టం చేశారు. మూడేళ్లలో మెట్రో నిర్మాణాన్ని పూర్తి చేసి, నిత్యం ఐదు లక్షల మంది ప్రయాణికులను గమ్య స్థానాలకు చేరుస్తున్నామంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వ సమర్థత అని, అటువంటి మెట్రోపై పనికిరాని చెత్త వాగుడు వాగడం సరికాదని హెచ్చరించారు. హైదరాబాద్ నగరంలో మెట్రో విస్తరణ పట్ల అద్భుతమైన విజయంతో అనేక ప్రణాళికలను గత ప్రభుత్వం రూపొందించిందన్నారు. రేవంత్ రెడ్డి మాదిరి స్వార్థ ప్రయోజనాల కోసం అసలు ఉనికిలో లేని ఊహాజనిత నగరానికి మెట్రో తీసుకువెళ్లాలన్న మాదిరి గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఆలోచించలేదన్నారు.

ఆస్తులు కొల్ల‌గొట్టే కుట్ర‌తోనే ఎల్ అండ్ టీ వెన‌క్కి..

కేవలం ప్రజల ప్రయోజనాలు, సౌకర్యం కోసమే దృష్టిలో ఉంచుకొని మెట్రో ఫేజ్-2ను ఆరు కారిడార్లు, 72 స్టేషన్లతో 76.4 కిలోమీటర్ల మేర డిజైన్ చేసింది కేసీఆరేన‌ని తెలిపారు. నలుదిశలా ఆరు రద్దీ రూట్లలో ప్రణాళికలు రచిస్తే వాటిని పనికిరాని రూట్లు అంటూ ప్రజల్ని అవమానిస్తారా అని రేవంత్ రెడ్డిని నిలదీశారు. రెండున్నరేళ్లలో ఫేజ్-2ను అటకెక్కించడం మీ వైఫల్యమని, అధికారంలోకి రాగానే శంషాబాద్ మెట్రోను రద్దు చేసిన ద్రోహం మీదేనని ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మెట్రో ఫేజ్-2కు ఎల్ అండ్ టీ సంస్థ అంగీకరించలేదని ఎందుకు బుకాయిస్తున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. ఏకంగా ఎల్ అండ్ టీ సీఎఫ్ఓనే బెదిరించి, పారిశ్రామికవేత్తల తలకు తుపాకీ పెట్టినట్లుగా భయబ్రాంతులకు గురిచేసి పారిపోయేలా చేసింది మీరే కదా అని ఆయన ఆరోపించారు. రూ.30వేల కోట్ల మెట్రో ఆస్తులను, నడిబొడ్డున ఉన్న మెట్రో భూములను కొల్లగొట్టేందుకే సంస్థను వెళ్లగొట్టే కుట్ర చేశారని కేటీఆర్‌ మండిపడ్డారు. తన స్వార్థ ప్రయోజనాల కోసం, కాసుల కక్కుర్తి కోసం హైదరాబాద్ మెట్రో రైల్ భవిష్యత్తును రేవంత్ రెడ్డి పణంగా పెడుతున్నారంటూ ధ్వ‌జ‌మెత్తారు.

Advertisement
Advertisement