త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఇండిగో సంస్థ‌కు మ‌రో భారీ షాక్‌.. భారీగా ప‌త‌న‌మైన సంస్థ షేర్లు..

S

Business | Published On Dec 8, 2025, 11.51 am IST

ఇండిగో సంస్థ‌కు మ‌రో భారీ షాక్‌.. భారీగా ప‌త‌న‌మైన సంస్థ షేర్లు..
Advertisement

విమానాల ర‌ద్దు, ఆల‌స్యం, ప్ర‌యాణికుల‌కు ల‌గేజీని టైముకు అందిండంలో విఫల‌మ‌వుతూ ఇప్ప‌టికే విమాన‌యాన సంస్థ ఇండిగో తీవ్ర అప్ర‌తిష్ట‌ను మూట‌గ‌ట్టుకుంది. డీజీసీఏ విధించిన కొత్త నియమాల‌ను అమ‌లు చేసేందుకు స‌రైన స‌మ‌యం ఇచ్చినా ఆ సంస్థ ఆ నియ‌మాల‌ను అమ‌లు చేయ‌డంలో విఫలం అయినందున ఈ ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఈ క్ర‌మంలోనే దేశ‌వ్యాప్తంగా అన్ని ఎయిర్ పోర్టుల‌లోనూ విమాన ప్ర‌యాణికులు భారీ ఎత్తున తీవ్ర అవ‌స్థ‌ల‌ను ఎదుర్కొంటున్నారు. ఇప్ప‌టికి దాదాపు వారం రోజులు కావ‌స్తున్నా ఇండిగో సంస్థ‌కు వ‌చ్చిన సంక్షోభం ఇంకా త‌గ్గ‌లేదు. ఈ క్ర‌మంలో సోమ‌వారం ఆ సంస్థ‌కు మ‌రో భారీ షాక్ త‌గిలింది. ఇండిగో మాతృ సంస్థ ఇంట‌ర్ గ్లోబ్ ఏవియేష‌న్ కు చెందిన షేర్లు భారీగా ప‌త‌నం అయ్యాయి. గ‌త వారం రోజుల నుంచి ఈ షేర్ ధ‌ర‌ పడిపోతూనే ఉన్నా ఒక్క సోమవారం మార్కెట్ సెష‌న్‌లోనే ఏకంగా 7 శాతం వ‌ర‌కు ప‌త‌నం అవ‌డం గ‌మ‌నార్హం.

వాస్త‌వానికి ఈ ఏడాది ఇండిగో సంస్థ మంచి లాభాల్లో ఉంది. ఆ సంస్థ షేర్ ధ‌ర 12.25 శాతం పెరిగింది. సంక్షోభం రాక ముందు ఆ సంస్థ షేర్ ధ‌ర రూ.5800గా ఉంది. ఈ క్ర‌మంలోనే ఈ ప‌రిస్థితి వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి దాదాపుగా వారం రోజులుగా ఇండిగో షేర్ ధ‌ర ప‌త‌నం అవుతూనే వ‌స్తోంది. ఇక సోమ‌వారం మార్కెట్‌లో భారీగా ప‌త‌నం అయింది. సోమ‌వారం సెష‌న్‌లో షేర్ ధ‌ర రూ.5వేల‌కు దిగువ‌కు చేరుకుంది. అయితే డిసెంబ‌ర్ 10వ తేదీ నుంచి త‌మ స‌ర్వీసులు య‌థావిధిగా ప‌నిచేస్తాయ‌ని, అందుకు త‌మ శాయ‌శ‌క్తులా కృషి చేస్తున్నామ‌ని ఇండిగో తెలియజేసింది. ఈ క్ర‌మంలోనే ఆదివారం మొత్తం 2300 విమాన స‌ర్వీసులు న‌డవాల్సి ఉండ‌గా, అందులో 650 స‌ర్వీసులు మాత్ర‌మే ర‌ద్ద‌య్యాయ‌ని 1650 స‌ర్వీసుల‌ను న‌డిపించామ‌ని, ప‌రిస్థితిలో చాలా వ‌ర‌కు మార్పు వ‌చ్చింద‌ని ఇండిగో తెలియ‌జేసింది. మ‌రో 3 రోజుల్లో ఈ సంక్షోభం నుంచి పూర్తిగా బ‌య‌ట‌ప‌డ‌తామ‌ని ఆ సంస్థ ప్ర‌తినిధి ఒక‌రు తెలిపారు.

ఇక ఇండిగో సంస్థ ఇప్ప‌టి వ‌రకు ప్ర‌యాణికుల‌కు మొత్తం రూ.610 కోట్ల‌ను రీఫండ్ కింద చెల్లించిన‌ట్లు తెలిపింది. ఆలస్యం అయిన 3వేల పీస్‌ల ల‌గేజీని ప్ర‌యాణికుల‌కు అప్ప‌గించామ‌ని తెలిపారు. డిసెంబ‌ర్ 5 నుంచి 15వ తేదీ మ‌ధ్య‌న‌ ఇండిగోలో ప్ర‌యాణం కోసం టిక్కెట్ల‌ను బుక్ చేసుకున్న వారు త‌మ టిక్కెట్ల‌ను ర‌ద్దు చేసుకుంటే ఎలాంటి క్యాన్సిలేష‌న్ ఫీజును వ‌సూలు చేయ‌డం లేద‌ని, ఆ ఫీజును ర‌ద్దు చేశామ‌ని ఇండిగో తెలియ‌జేసింది. కాగా ఈ సంక్షోభంపై ఇప్ప‌టికే డీజీసీఏ ఇండిగో సీఈవో పీట‌ర్ ఎల్బ‌ర్స్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇందుకు ఆయ‌న‌కు సోమ‌వారం సాయంత్రం 6 గంట‌ల వ‌ర‌కు గ‌డువు ఇచ్చింది. అయితే అప్ప‌టి వ‌ర‌కు ఆయ‌న ఎలా స్పందిస్తారు, ఒక వేళ స్పందించ‌క‌పోయినా స‌రే ఇండిగో సంస్థ‌పై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకుంటారు అన్న విష‌యం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది.

Advertisement

తాజావార్తలు

Advertisement