త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..

Stock Markets | వరుస సెష‌న్లలో ర్యాలీల‌ తర్వాత ఐటీ షేర్లలో భారీ లాభాల స్వీకరణ కనిపించడంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో మార్కెట్ పాజిటివ్ జోన్‌లో ఉంది.

S

Business | Published On Jul 31, 2026, 10.22 am IST

Stock Markets | ఐటీ షేర్లలో భారీ అమ్మకాలు.. స్వల్ప లాభాల్లో స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | వరుస సెష‌న్లలో ర్యాలీల‌ తర్వాత ఐటీ షేర్లలో భారీ లాభాల స్వీకరణ కనిపించడంతో శుక్రవారం భారత స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ప్రారంభమై ఫ్లాట్ గా ట్రేడ్ అవుతున్నాయి. ఫైనాన్షియల్ షేర్లలో కొనుగోళ్లు కొనసాగడంతో మార్కెట్ పాజిటివ్ జోన్‌లో ఉంది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 19.50 పాయింట్లు (0.03 శాతం) పెరిగి 77,947.65 వద్ద ట్రేడవుతుండగా, ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ50 సూచీ 26.70 పాయింట్లు ( 0.11 శాతం) లాభపడి 24,343.85 వద్ద కొనసాగింది. మార్కెట్లో స్టాక్‌ల వారీగా కొనుగోళ్లు కనిపించాయి. ముఖ్యంగా ఫైనాన్షియల్ రంగం మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచింది. త్రైమాసిక ఫలితాల అనంతరం బజాజ్ ఫైనాన్స్ షేరు 3.84 శాతం ఎగబాకి సెన్సెక్స్‌లో అత్యధిక లాభం నమోదు చేసింది. బజాజ్ ఫిన్‌సర్వ్ 3.10 శాతం పెరిగింది. మహీంద్రా అండ్ మహీంద్రా, బీఈఎల్, యాక్సిస్ బ్యాంక్, మారుతి సుజుకి, ఎస్‌బీఐ షేర్లు కూడా లాభాల్లో ట్రేడయ్యాయి.

భారీగా ప‌త‌న‌మైన ఐటీ షేర్లు..

మరోవైపు, గత వారం రోజులుగా బలమైన ర్యాలీ చేసిన ఐటీ షేర్లలో లాభాల స్వీకరణ కనిపించింది. దీంతో నిఫ్టీ ఐటీ సూచీ 3.26 శాతం పడిపోయి అత్యంత బలహీన రంగంగా నిలిచింది. ఇన్ఫోసిస్ 3.64 శాతం, టీసీఎస్ 3.54 శాతం, హెచ్‌సీఎల్‌టెక్ 3.27 శాతం, టెక్ మహీంద్రా 2.41 శాతం చొప్పున క్షీణించాయి. ఐటీ రంగంలో బలహీనత ఉన్నప్పటికీ ఇతర రంగాలు ఎక్కువగా సానుకూల ధోరణి ప్రదర్శించాయి. ఆటో సూచీ 0.80 శాతం, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఎక్స్-బ్యాంక్ 1.37, ఫైనాన్షియల్ సర్వీసెస్ 0.66 , పీఎస్‌యూ బ్యాంక్ 0.60 , కెమికల్స్ 0.59 శాతం లాభపడ్డాయి. అయితే రియాల్టీ సూచీ 0.84 శాతం తగ్గగా, ఎఫ్‌ఎంసీజీ, మీడియా సూచీలు కూడా నష్టాల్లో ట్రేడయ్యాయి. విస్తృత మార్కెట్ సూచీల్లో మిశ్రమ ధోరణి కనిపించింది. నిఫ్టీ 100, నిఫ్టీ 200, నిఫ్టీ 500 సూచీలు స్వల్ప లాభాల్లో కొనసాగగా, నిఫ్టీ మిడ్‌క్యాప్ 50, మిడ్‌క్యాప్ 100, స్మాల్‌క్యాప్ 100 సూచీలు ప్రారంభ ట్రేడింగ్‌లో స్వల్పంగా క్షీణించాయి. ఇండియా వీఐఎక్స్ దాదాపు 2 శాతం తగ్గి 11.92 వద్దకు చేరుకోవడంతో మార్కెట్లో అస్థిరత తగ్గుతున్న సంకేతాలు కనిపించాయి.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు..

అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు కూడా ఇటీవల పెరుగుదల తర్వాత కొంత తగ్గాయి. బ్రెంట్ క్రూడ్ ధర 0.98 శాతం తగ్గి బ్యారెల్‌కు 88.16 డాలర్లకు చేరగా, డబ్ల్యూటీఐ క్రూడ్ 1.62 శాతం తగ్గి 82.24 డాలర్ల వద్ద ట్రేడైంది. ఇది ద్రవ్యోల్బణ ఒత్తిడిపై కొంత ఉపశమనం కలిగించే అంశంగా మారింది. దేశీయ కరెన్సీ రూపాయి కూడా బలపడింది. విదేశీ పెట్టుబడుల ప్రవాహం కొనసాగడం, ముడి చమురు ధరలు తగ్గడం వంటి కారణాలతో రూపాయి డాలర్‌తో పోలిస్తే 0.3 శాతం బలపడి 95.3850 వద్ద ప్రారంభమైంది. జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ స్ట్రాటజిస్ట్ డాక్టర్ వి.కె. విజయకుమార్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ షేర్లలో తీవ్ర అస్థిరత నెలకొనడం వల్ల సంస్థాగత పెట్టుబడిదారులు భారత్ వంటి స్థిరమైన మార్కెట్లపై దృష్టి సారిస్తున్నారని తెలిపారు.

ఐటీ షేర్ల‌లో తీవ్ర అస్థిర‌త‌..

అమెరికా, దక్షిణ కొరియా వంటి దేశాల స్టాక్ మార్కెట్లలో ఇటీవలి కాలంలో టెక్నాలజీ షేర్లలో అసాధారణ స్థాయిలో ధరల హెచ్చుతగ్గులు కనిపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. త్రైమాసిక ఫలితాలు, అంచనాలు, ఊహాజనిత ట్రేడింగ్ కారణంగా టెక్ షేర్లలో భారీ అస్థిరత నెలకొంటోందని చెప్పారు. దక్షిణ కొరియాలో కోస్పీ మార్కెట్ విలువలో సగానికి పైగా వాటా కలిగిన శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్, ఎస్‌కే హైనిక్స్ షేర్లు కూడా తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతున్నాయని, దీంతో అక్కడి మార్కెట్ మరింత అస్థిరంగా మారుతోందని ఆయన వివరించారు. ఇలాంటి అధిక అస్థిరతను సంస్థాగత పెట్టుబడిదారులు ఇష్టపడరని, వారి పనితీరుపై అది ప్రభావం చూపే అవకాశం ఉంటుందని విజయకుమార్ అన్నారు. ఇటీవల విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు (ఎఫ్‌ఐఐలు) భారత్‌లో కొనుగోళ్లకు మొగ్గు చూపడానికి ఇదొక కారణమై ఉంటుంద‌ని పేర్కొన్నారు.

Advertisement
Advertisement