త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్‌..

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితులకు తోడు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలు పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి.

S

Business | Published On Sep 11, 2026, 10.06 am IST

Stock Markets | మధ్యప్రాచ్య ఉద్రిక్తతల ఎఫెక్ట్‌.. స్టాక్ మార్కెట్ల‌లో బ్ల‌డ్ బాత్‌..
Advertisement

Stock Markets | దేశీయ ఈక్విటీ మార్కెట్లు శుక్రవారం భారీ నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో బలహీన పరిస్థితులకు తోడు, మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా ముడి చమురు ధరలు భారీగా పెరగడం, ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలు పెరగడం మార్కెట్లపై ప్రతికూల ప్రభావం చూపాయి. సెన్సెక్స్‌ దాదాపు 600 పాయింట్లు (0.79 శాతం) నష్టంతో 74,309.16 వద్ద ప్రారంభమైంది. మరోవైపు నిఫ్టీ 207.50 పాయింట్లు (0.88 శాతం) పడిపోయి 23,270.30 వద్ద ట్రేడింగ్‌ను ప్రారంభించింది. సెక్టార్ల పరంగా చూస్తే నిఫ్టీ మెటల్‌ సూచీ మూడు శాతానికి పైగా పతనమై ప్రారంభ ట్రేడింగ్‌లో అత్యధికంగా నష్టపోయిన రంగంగా నిలిచింది. ఆ తర్వాత నిఫ్టీ రియాల్టీ రెండు శాతానికి పైగా క్షీణించింది. కన్స్యూమర్ డ్యూరబుల్స్‌, ఫైనాన్షియల్ సర్వీసెస్‌, బ్యాంకింగ్‌, ఆటో, సిమెంట్‌ రంగాల సూచీలు ఒక శాతం వరకు నష్టపోయాయి. అయితే నిఫ్టీ ఐటీ మాత్రమే స్వల్పంగా లాభాల్లో కొనసాగుతూ 0.10 శాతం పెరిగింది.

108 డాల‌ర్ల‌కు చేరిన చ‌మురు ధ‌ర‌..

మధ్యప్రాచ్య ఘర్షణలు మరింత తీవ్రం కావడంతో మార్కెట్‌పై ప్రతికూల ప్రభావాలు పెరుగుతున్నాయని మార్కెట్‌ నిపుణులు పేర్కొన్నారు. బ్రెంట్‌ క్రూడ్‌ ధర బ్యారెల్‌కు సుమారు 108 డాలర్లకు చేరుకోవడం మార్కెట్లకు ప్రధాన ప్రతికూల అంశంగా మారిందన్నారు. ముడి చమురు ధరలు ఇదే స్థాయిలో కొనసాగినా లేదా మరింత పెరిగినా భారత ఆర్థిక వృద్ధి, కంపెనీల లాభాలపై గణనీయమైన ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. అమెరికా బాండ్‌ ఈల్డ్స్‌ పెరగడం కూడా మార్కెట్లకు మరో కీలక ప్రతికూల అంశంగా మారిందని విశ్లేషకులు పేర్కొన్నారు. అమెరికా పదేళ్ల ట్రెజరీ ఈల్డ్‌ సుమారు 4.96 శాతానికి చేరుకుంది. ఇది ఐదు శాతం స్థాయికి చేరువ కావడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లకు కీలక మలుపుగా మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. భారత ఐపీఓ మార్కెట్‌ ప్రస్తుతం పెట్టుబడిదారులను గణనీయంగా ఆకర్షిస్తోందని విశ్లేషకులు తెలిపారు. కొత్త ఐపీఓలకు భారీగా దరఖాస్తులు రావడం, లిస్టింగ్‌ సమయంలో లాభాలు కనిపించడం వల్ల పెట్టుబడులు ద్వితీయ మార్కెట్‌ నుంచి ఐపీఓల వైపు మళ్లుతున్నాయని పేర్కొన్నారు.

నిఫ్టీ త‌దుప‌రి స్థాయిలు ఎక్క‌డ‌..

సాంకేతికంగా చూస్తే నిఫ్టీకి తదుపరి దిగువ స్థాయిలుగా 23,260 నుంచి 23,000 పాయింట్ల వరకు ఉంటాయ‌ని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. గ‌త సెష‌న్ నాటి నిఫ్టీ చార్టులో కనిపించిన పొడవైన దిగువ విక్ మార్కెట్‌లో ఒక బేస్‌ ఏర్పడే ప్రక్రియ ప్రారంభమై ఉంటుంద‌ని సూచిస్తున్నప్పటికీ, రికవరీ ప్రయత్నాలు బలహీనంగా ఉన్నాయని తెలిపారు. నిఫ్టీకి పైవైపు కీలక స్థాయి 23,520గా ఉంటుందని పేర్కొన్నారు. ప్రస్తుతం అంతర్జాతీయ, దేశీయ పరిస్థితులు సవాళ్లతో కూడుకుని ఉన్న నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని మార్కెట్‌ నిపుణులు సూచించారు.

కాగా, ముడి చమురు ధరలు పెరగడంతో వాల్‌స్ట్రీట్‌లో అమ్మకాల ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో ఆసియా మార్కెట్లు కూడా శుక్రవారం నష్టాల్లో ట్రేడయ్యాయి. అంతకుముందు సెషన్‌లో అమెరికా స్టాక్స్‌ కూడా నష్టాలతో ముగిశాయి. ద్రవ్యోల్బణానికి సంబంధించిన గణాంకాలు అంచనాల కంటే బలంగా రావడం, మరోవైపు చమురు ధరలు పెరగడంతో అమెరికా ఫెడరల్‌ రిజర్వ్‌ మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందన్న ఆందోళనలు పెరిగాయి.

Advertisement
Advertisement