త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Etala Rajender | మూసీ కంటే అధ్వాన్నంగా జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్ యార్డ్.. రేవంత్ స‌ర్కార్‌పై ఎంపీ ఈట‌ల ఆగ్ర‌హం

Etala Rajender | మూసీ న‌ది కంటే అధ్వాన్నంగా జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డ్ త‌యారైంద‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు.

S

Telangana | Published On Jul 15, 2026, 3.31 pm IST

Etala Rajender | మూసీ కంటే అధ్వాన్నంగా జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్ యార్డ్.. రేవంత్ స‌ర్కార్‌పై ఎంపీ ఈట‌ల ఆగ్ర‌హం
Advertisement

Etala Rajender | త్రినేత్ర‌.న్యూస్ : మూసీ న‌ది కంటే అధ్వాన్నంగా జ‌వ‌హ‌ర్ న‌గ‌ర్ డంప్ యార్డ్ త‌యారైంద‌ని సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్‌పై బీజేపీ ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ నిప్పులు చెరిగారు. జ‌వ‌హ‌ర్‌న‌గ‌ర్ డంప్ యార్డ్‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఆందోళ‌న‌కు ఈట‌ల రాజేంద‌ర్‌ను నాయ‌క‌త్వం వ‌హించాల‌ని అఖిల‌ప‌క్ష నేత‌లు, జేఏసీ నాయ‌కులు, స్థానిక ప్ర‌జ‌లు కోరారు.

20 ఏళ్ల నుండి చెత్తలో బ్రతుకుతున్నాం.. పార్టీలకు అతీతంగా మీ నాయకత్వం కోరుకుంటున్నామ‌ని అఖిల‌ప‌క్ష నేత‌లు పేర్కొన్నారు. మమ్ముల్ని పోలీస్ స్టేషన్లో పెట్టినప్పుడు వచ్చి మాకు సంఘీభావం తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు. మా ప్రజలను కాపాడాల్సింది మీరే. ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మల్కాజిగిరి ఎంపీగా ఉన్నప్పుడు డంప్ యార్డ్ తీసేస్తామని హామీ ఇచ్చారు కానీ చేయలేదని వారు గుర్తు చేశారు.

అనంత‌రం ఈట‌ల రాజేంద‌ర్ మాట్లాడుతూ.. పార్టీలు జెండాలు పక్కన పెట్టి మీరంతా ముందుకు వచ్చారు. మీకు నా సంపూర్ణ మద్దతు ఉంటుంది. డంప్ యార్డుకు వ్యతిరేకంగా నిరంతరం నేను కొట్లాడుతున్నా. డంప్ యార్డ్ చుట్టూ ఉన్నవాళ్ళు నిరుపేదలు. తెలంగాణ పల్లెలు వదిలిపెట్టి వచ్చినవారున్నారు. సీఎంను కలసినప్పుడు పరిష్కారం చేద్దాం అన్నారు. కరెంటు ఉత్పత్తి చేస్తాం అన్నారు. గతవారం మున్సిపల్ కమీషనర్‌తో మాటాడిన.. రాసుకున్న అగ్రిమెంట్ ప్రకారం అన్నీ అమలయ్యేలా చూడమని చెప్పా. అవి అమలు కాలేదు కాబట్టే డంప్ యార్డ్ చుట్టూ విషవలయంగా మారింది. మూసీ కంటే అధ్వాన్నంగా మారింది అని ఈట‌ల ధ్వ‌జ‌మెత్తారు.

నేను కోట్లాడడం మొదలు పెడితే వెనక్కు పోయేవాన్ని కాదు. మీలో ఒకనిగా నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉన్న. ధర్మం, న్యాయం కోసం ఆకాశమే హద్దుగా కోట్లాడే తత్వం నాది. పదవులు ఉంటాయి పోతాయి, మనం చేసే పని నిలిచిపోతుంది. పాలకులకు ప్రజల బాధల వినే సమయం లేదు. జేఏసీ వాళ్ళు పిలుపు ఇవ్వగానే అందరినీ అరెస్ట్ చేశారు. సమస్యకు అరెస్టులు పరిష్కారం కాదు. నా ఒక్కడి మీద 200 కేసులు ఉన్నాయి. ఉద్యమాలు కొత్త కాదు.. కేసులు, జైళ్లు కొత్త కాదు. ఎక్కడ తగులబెట్టాల్సిన అవసరం లేదు. ప్రజాశక్తి ముందు ఎవరు పెద్ద వారు కాదు. జవహర్ నగర్ డంప్ యార్డ్‌కి వ్యతిరేకంగా ఉద్యమానికి రూపకల్పన చేద్దాం. అక్కడి నుండి తొలగించే వరకు ఆగేది లేదు. భయపడే వాళ్లను భయపెడతారు. మనం భయపడాల్సిన అవసరం లేదు అని ఈట‌ల స్ప‌ష్టం చేశారు.

రేవంత్ మీరు దీనికి వ్యతిరేకంగా సుప్రీం కోర్టులో కేసు వేశావు.. ప్రశ్నించే గొంతుక అన్నావు.. నువ్వే పరిష్కారం చేసే స్థానంలో ఉన్నావు. పరిష్కారం చెయ్యి తాత్సారం చేయకండి. నేను పార్లమెంటు కూడా ఈ అంశంపై మాట్లాడుతా. ఈ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు నేను మీ వెంటే ఉంటాను అని ఈటల రాజేందర్ వచ్చిన వారికి భరోసా ఇచ్చారు.

Advertisement
Advertisement