త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..

Stock Markets | దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం లభించే అవకాశాలు తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదే సమయంలో భారత్‌ జీడీపీ వృద్ధి గణాంకాల విడుదలకు ముందు మార్కెట్ వర్గాలు వేచి చూశాయి.

S

Business | Published On Aug 31, 2026, 4.16 pm IST

Stock Markets | అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతల ఎఫెక్ట్.. నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు..
Advertisement

Stock Markets | దేశీయ బెంచ్‌మార్క్ ఈక్విటీ సూచీలు సోమవారం నష్టాల్లో ముగిశాయి. అమెరికా, ఇరాన్ మధ్య దౌత్యపరమైన పరిష్కారం లభించే అవకాశాలు తగ్గిపోవడంతో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ఇదే సమయంలో భారత్‌ జీడీపీ వృద్ధి గణాంకాల విడుదలకు ముందు మార్కెట్ వర్గాలు వేచి చూశాయి. నిఫ్టీ 50 సూచీ 95.25 పాయింట్లు (0.39 శాతం) నష్టపోయి 24,080.40 వద్ద ముగిసింది. బీఎస్‌ఈ సెన్సెక్స్ 307.24 పాయింట్లు (0.40) శాతం క్షీణించి 76,957.27 వద్ద స్థిరపడింది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరగడంతో ముడి చమురు ధరలు పెరిగాయి. దీంతో ద్రవ్యోల్బణం, వడ్డీ రేట్లపై ఆందోళనలు పెరిగి ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌పై ప్రభావం చూపాయి. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరగడం, దౌత్యపరమైన పరిష్కారం లభించే అవకాశాలు తగ్గిపోవడం వల్ల ముడి చమురు ధరలు, ప్రపంచ బాండ్ ఈల్డ్‌లు పెరిగాయని జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ లిమిటెడ్ రీసెర్చ్ హెడ్ వినోద్ నాయర్ తెలిపారు.

పెరిగిన చ‌మురు ధ‌ర‌లు..

అధిక ముడి చమురు ధరలు, బాండ్ ఈల్డ్‌లు పెరగడం వల్ల ఇంధన ఆధారిత ద్రవ్యోల్బణంపై ఆందోళనలు మళ్లీ పెరిగాయని నాయర్ పేర్కొన్నారు. అధిక వడ్డీ రేట్ల పరిస్థితి కొనసాగితే కంపెనీల ఆదాయాలపై కూడా ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని చెప్పారు. బ్రెంట్ ముడి చమురు ధర 3.34 శాతం పెరిగి బ్యారెల్‌కు 91 డాలర్లకు చేరింది. వాషింగ్టన్, టెహ్రాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు పెరగడంతో ఇంధన సరఫరాలు, హోర్ముజ్ జలసంధి మీదుగా జరిగే నౌకా రవాణాపై ఆందోళనలు వ్యక్తమయ్యాయి. అమెరికా సైన్యం ఇరాన్‌లోని లారక్ ద్వీపంపై దాడులు చేపట్టి రెండు ఇరానియన్ క్షిపణి ప్రయోగ కేంద్రాలను లక్ష్యంగా చేసుకుంది. కీలకమైన ప్రపంచ నౌకా రవాణా మార్గమైన హోర్ముజ్ జలసంధికి ఉత్తర అంచు సమీపంలో లారక్ ద్వీపం ఉంది. కాగా ఇటీవల అమెరికా జరిపిన దాడులకు ప్రతిస్పందనగా సోమవారం యూఏఈలోని అల్ మిన్‌హాద్ ఎయిర్‌బేస్‌లో హెలికాప్టర్లు, సైనికుల స్థావరాలను లక్ష్యంగా చేసుకుని డ్రోన్ దాడులు నిర్వహించినట్లు ఇరాన్ ఆర్మీ తెలిపింది.

ప‌రిమిత‌మైన ప‌త‌నం..

విస్తృత మార్కెట్‌ల‌లో కొన్ని షేర్లలో కొనుగోళ్లు జరగడం, 2026-27 ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో భారత్ జీడీపీ వృద్ధి ఆరోగ్యకరంగా ఉండే అవ‌కాశాలు ఉన్నాయ‌న్న అంచనాలు, పండుగల సమయంలో డిమాండ్ పెరగడం, మెరుగైన జీఎస్‌టీ వసూళ్లపై ఆశలు దేశీయ సూచీల పతనాన్ని పరిమితం చేశాయి. నిఫ్టీ 50లో ఐసీఐసీఐ బ్యాంక్, గ్రాసిమ్, బజాజ్ ఆటో, మహీంద్రా అండ్ మహీంద్రా, రిలయన్స్ ఇండస్ట్రీస్, మారుతి షేర్లు ప్రధానంగా లాభపడిన వాటిలో ఉన్నాయి. మరోవైపు అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, ఎటర్నల్, టాటా స్టీల్, హిందాల్కో షేర్లు నష్టాలను చవిచూశాయి.

Advertisement
Advertisement