త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

ఐసీసీ టోర్నీల ప్ర‌సార హ‌క్కుల‌ను జియోస్టార్ వ‌దులుకోవ‌డం లేదు

ఐసీసీ టోర్నీల ప్రసార హక్కులను జియోస్టార్ వదులుకుంటుందనే వార్తలు పుకార్లేనని ఐసీసీ, జియోస్టార్ స్పష్టం చేశాయి. రెండు సంస్థలూ సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ, 2027 వరకు డీల్ కొనసాగుతుందని తెలిపాయి.

S

Business | Published On Dec 13, 2025, 10.31 am IST

ఐసీసీ టోర్నీల ప్ర‌సార హ‌క్కుల‌ను జియోస్టార్ వ‌దులుకోవ‌డం లేదు
Advertisement

ICC–JioStar Media Rights: Rumours Clarified, Deal Intact till 2027

ICC And Jiostar | ఇంట‌ర్నేష‌న‌ల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి సంబంధించిన టోర్నీల ప్ర‌సార హక్కుల‌ను జియో స్టార్ వ‌దులుకోనుంద‌ని, త‌మ‌కు న‌ష్టాలు వ‌స్తున్నందునే ఈ నిర్ణ‌యం తీసుకున్నామ‌ని జియో స్టార్ చెప్పిన‌ట్లుగా ఇటీవ‌ల ఓ వార్త తెగ ప్ర‌చారం అయిన విష‌యం తెలిసిందే. ప్ర‌ముఖ ఆంగ్ల ప‌త్రిక ఎక‌నామిక్ టైమ్స్ ముందుగా ఈ వార్త‌ను ప్రచారం చేసింది. దీంతో అంతా నిజ‌మే అని న‌మ్మారు. అయితే ఈ వార్త‌ల్లో నిజం లేద‌ని, అవ‌న్నీ వ‌ట్టి పుకార్లే అని ఐసీసీ, జియో స్టార్ తేల్చేశాయి. ఈ మేర‌కు వారు ఆ వార్త‌ల‌ను సంయుక్తంగా ఖండిస్తూ ఓ ప్ర‌క‌ట‌న‌ను విడుద‌ల చేశారు. 2027 వ‌ర‌కు జియో స్టార్ త‌మ ప్ర‌సార హ‌క్కుల‌ను కొన‌సాగిస్తుంద‌ని చెప్పారు.

ఐసీసీ టోర్నీల‌ను ప్ర‌సారం చేయ‌డం ద్వారా త‌మ‌కు న‌ష్ట‌మే త‌ప్ప లాభం రాలేద‌ని, ఈ క్ర‌మంలో 2024-25 సంవ‌త్స‌రానికి రూ.25,760 కోట్ల న‌ష్టం వ‌చ్చింద‌ని, అంత‌కు ముందు ఏడాది క‌న్నా ఇది రూ.12,319 కోట్లు అద‌న‌మ‌ని చెబుతూ జియో స్టార్ పేర్కొన్న‌ట్లుగా ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి. ఈ క్ర‌మంలోనే ఐసీసీ టోర్నీల‌కు సంబంధించి ప్ర‌సార హక్కుల‌ను వ‌దులుకుంటున్నామ‌ని, ఇందుకు గాను ఐసీసీతో ఉన్న 3 బిలియన్ డాల‌ర్ల డీల్‌ను ర‌ద్దు చేసుకుంటున్నామ‌ని జియోస్టార్ చెప్పిన‌ట్లుగా కూడా వార్తలు వ‌చ్చాయి. దీంతో త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్న టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్ మ్యాచ్‌ల ప్ర‌సారం కోసం ఐసీసీ ప్ర‌ముఖ మీడియా సంస్థ‌లైన అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ ఫ్లిక్స్‌, సోనీ ల‌ను సంప్ర‌దించిన‌ట్లుగా కూడా వార్త‌లు వ‌చ్చాయి. అయితే తాజాగా ఐసీసీ, జియోస్టార్ సంయుక్త ప్ర‌క‌ట‌న విడుద‌ల చేయ‌డంతో ఆ వార్త‌లు అన్నీ వ‌ట్టి పుకార్లేన‌ని తేలింది.

కాగా 2024 నుంచి 2027 కాల వ్య‌వ‌ధికి గాను అప్ప‌ట్లో ఐసీసీ టోర్నీల మీడియా రైట్స్‌ను జియోస్టార్ సొంతం చేసుకుంది. ఈ డీల్ విలువ 3 బిలియ‌న్ డాల‌ర్లు ఉండ‌గా, ప్ర‌తి ఏడాది క‌చ్చితంగా ఓ ఐసీసీ టోర్నీ ఉంటుంద‌ని ఆ సంస్థ జియో స్టార్‌కు హామీ ఇచ్చింది. అయితే మార్చి 31, 2024 వ‌ర‌కు ఈ ప్ర‌సార హ‌క్కుల వ‌ల్ల స్టార్ ఇండియాకు రూ.12,548 కోట్లు నష్టం వ‌చ్చింద‌ని ఆ సంస్థే తెలియ‌జేసింది. ఆ త‌రువాత జియో, హాట్ స్టార్ రెండూ క‌లిసిపోయి జియోస్టార్‌గా మారాయి. అయితే ఆ న‌ష్టాల్లో రూ.12,319 కోట్ల న‌ష్టం ఐసీసీ మీడియా రైట్స్ వ‌ల్లే జ‌రిగింద‌ని చెప్పారు. ఇక కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌లే ఫాంట‌సీ గేమింగ్ ప్లాట్ ఫామ్‌ల‌ను బ్యాన్ చేసింది. దీంతో జియోస్టార్‌కు మ‌రో రూ.7వేల కోట్ల న‌ష్టం జ‌రిగింద‌ని అంచ‌నా. అయితే ఐసీసీ మీడియా రైట్స్ డీల్ ర‌ద్దు వార్త‌ల నేప‌థ్యంలో ఇరు సంస్థ‌ల నుంచి ఇలాంటి ప్ర‌క‌ట‌న రావ‌డం స‌హ‌జ‌మే అయిన‌ప్ప‌టికీ జియో స్టార్‌కు వ‌స్తున్న న‌ష్టాల నేప‌థ్యంలో ఇంకా ఎంత కాలం వారు ఈ డీల్‌లో కొన‌సాగుతారో వేచి చూస్తే తెలుస్తుంది.

Advertisement

తాజావార్తలు

Advertisement