త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మ‌న్ రాజీనామా.. భారీగా ప‌త‌న‌మైన షేర్లు..

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాత్కాలిక చైర్మ‌న్‌, స్వ‌తంత్ర డైరెక్ట‌ర్ అటాను చ‌క్ర‌వ‌ర్తి త‌న ప‌ద‌వికి ఆక‌స్మికంగా రాజీనామా చేయ‌డంతో ఆ బ్యాంక్ షేర్లు గురువారం నాటి మార్కెట్ సెష‌న్‌లో భారీగా ప‌త‌నం అయ్యాయి. గ‌త 2 సంవ‌త్స‌రాలుగా బ్యాంకులో తాను గ‌మనించిన కొన్ని ప‌రిణామాలు, విధానాలు త‌న వ్య‌క్తిగ‌త విలువ‌లు, నైతిక‌త‌ల‌కు అనుగుణంగా లేవ‌ని చెబుతూ ఆయ‌న రాజీనామా చేశారు.

S

Business | Published On Mar 19, 2026, 12.48 pm IST

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చైర్మ‌న్ రాజీనామా.. భారీగా ప‌త‌న‌మైన షేర్లు..
Advertisement

HDFC Bank | హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ తాత్కాలిక చైర్మ‌న్‌, స్వ‌తంత్ర డైరెక్ట‌ర్ అటాను చ‌క్ర‌వ‌ర్తి త‌న ప‌ద‌వికి ఆక‌స్మికంగా రాజీనామా చేయ‌డంతో ఆ బ్యాంక్ షేర్లు గురువారం నాటి మార్కెట్ సెష‌న్‌లో భారీగా ప‌త‌నం అయ్యాయి. గ‌త 2 సంవ‌త్స‌రాలుగా బ్యాంకులో తాను గ‌మనించిన కొన్ని ప‌రిణామాలు, విధానాలు త‌న వ్య‌క్తిగ‌త విలువ‌లు, నైతిక‌త‌ల‌కు అనుగుణంగా లేవ‌ని చెబుతూ ఆయ‌న రాజీనామా చేశారు. ఇవే విష‌యాల‌ను త‌న రాజీనామాకు కార‌ణాల‌ని ఆయ‌న త‌న లేఖ‌లోనూ పేర్కొన్నారు. ఈ మేర‌కు బ్యాంక్ గ‌వ‌ర్నెన్స్‌, నామినేష‌న్‌, రెమ్యున‌రేష‌న్ క‌మిటీ చైర్మ‌న్‌కు త‌న రాజీనామా లేఖ‌ను పంపించారు. అయితే చ‌క్ర‌వ‌ర్తి రాజీనామాతోపాటు ఆయ‌న లేఖ‌లో రాసిన వివ‌రాల కార‌ణంగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు గ‌ణ‌నీయంగా ప‌త‌నం అయ్యాయి. ఆ బ్యాంకు షేర్లు భారీ న‌ష్టాల్లో కొన‌సాగుతున్నాయి.

రూ.45వేల కోట్ల న‌ష్టం..

నిఫ్టీలో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ ధ‌ర బుధ‌వారం నాడు 842 రూపాయ‌ల వ‌ద్ద ముగియ‌గా గురువారం ప్రారంభంలోనే రూ.72 న‌ష్ట‌పోయి రూ.770 వ‌ద్ద ప్రారంభం అయింది. త‌రువాత కాస్త రిక‌వ‌ర్ అయి రూ.800 పైన‌ కొన‌సాగుతోంది. ఈ క్ర‌మంలో క్రితం ముగింపుతో పోలిస్తే షేర్ ధ‌ర దాదాపు 3.50 శాతం మేర ప‌త‌నం అయింది. ఇక హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల‌లో వాటాల‌ను క‌లిగి ఉన్న పెట్టుబ‌డిదారులు దాదాపుగా రూ.45 వేల కోట్ల సంప‌ద‌ను న‌ష్ట‌పోయారు. విదేశీ సంస్థాగ‌త పెట్టుబ‌డిదారులు (ఎఫ్ఐఐ) గ‌రిష్టంగా రూ.45,072 కోట్లు న‌ష్ట‌పోగా, మ్యుచువ‌ల్ ఫండ్ పెట్టుబ‌డిదారులు రూ.25,209 కోట్లు న‌ష్ట‌పోయారు. అలాగే రిటెయిల్ పెట్టుబ‌డిదారులు రూ.8,903 కోట్లు, ఎల్ఐసీ రూ.4,511 కోట్లు, సింగ‌పూర్ ప్ర‌భుత్వం రూ.2,151 కోట్లు, వాన్ గార్డ్ సంస్థ రూ.1176 కోట్లు, ప్ర‌భుత్వ పెన్ష‌న్ ఖాతా పెట్టుబడిదారులు రూ.1151 కోట్లు న‌ష్ట‌పోయారు.

పెట్టుబ‌డిదారుల‌పై అమ్మ‌కాల ఒత్తిడి..

చ‌క్ర‌వ‌ర్తి రాజీనామా నేప‌థ్యంలో గురువారం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్ల‌పై భారీ అమ్మ‌కాల ఒత్తిడి నెల‌కొంది. ఓ ద‌శ‌లో అమెరికాలో ట్రేడ్ అయ్యే బ్యాంక్ ఏడీఆర్‌లు ఏకంగా 7 శాతం క‌న్నా ఎక్కువ‌గా ప‌త‌నం అయ్యాయి. త‌రువాత మ‌ళ్లీ 1 శాతం పెరుగుద‌ల‌ను న‌మోదు చేశాయి. కాగా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ షేర్‌పై జేపీ మోర్గాన్ బ్రోక‌రేజ్ సంస్థ న్యూట్ర‌ల్ రేటింగ్‌ను కొన‌సాగిస్తోంది. టార్గెట్ ధ‌ర‌ను రూ.1090గా నిర్ణ‌యించింది. అయితే రాజీనామా ప్ర‌క‌ట‌న అనంత‌రం షేర్ల‌పై అమ్మ‌కాల ఒత్తిడి పెరిగి భారీగా ప‌త‌నం అయ్యాయి. భౌగోళిక ఉద్రిక్త‌త‌లు కూడా తోడ‌వ‌డంతో షేర్ల‌లో మ‌రింత ప‌త‌నం క‌నిపించింది. ప్ర‌స్తుతం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు త‌మ 52 వారాల క‌నిష్ట స్థాయి రూ.812కు స‌మీపంలో ట్రేడ్ అవుతున్నాయి. గ‌త నెల రోజులుగా ఈ షేర్ ధ‌ర 8 శాతం మేర ప‌త‌నం అయింది. ప్ర‌స్తుతం పెట్టుబ‌డిదారులు సంప‌ద‌ను న‌ష్ట‌పోవ‌డంతో బ్యాంక్ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.11.88 ల‌క్ష‌ల కోట్ల‌కు చేరుకుంది.

బోర్డుకు ధ‌న్య‌వాదాలు చెప్పిన చ‌క్ర‌వ‌ర్తి..

మే 2021లో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు బోర్డులో చ‌క్ర‌వ‌ర్తి చేర‌గా త‌న ప‌ద‌వీకాలంలో ఆయ‌న హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌తో బ్యాంక్ విలీనం వంటి కీల‌క‌ ప‌రిణామాల‌కు కార‌ణం అయ్యారు. దీంతో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ దేశంలోనే రెండో అతిపెద్ద బ్యాంక్‌గా అవ‌త‌రించింది. అయితే విలీనం పూర్త‌యిన‌ప్ప‌టికీ బ్యాంకుకు ఇంకా ప్ర‌యోజ‌నాలు పూర్తిగా ల‌భించ‌లేద‌ని చ‌క్ర‌వ‌ర్తి త‌న రాజీనామా లేఖ‌లో పేర్కొన్నారు. కొంత‌కాలంగా బ్యాంకు నిర్వ‌హ‌ణ‌పై బోర్డులో అంత‌ర్గ‌త అసంతృప్తి ఉన్న‌ట్లు నివేదిక‌లు సూచిస్తున్న‌ప్ప‌టికీ చ‌క్ర‌వ‌ర్తి త‌న లేఖ‌లో బోర్డు స‌భ్యుల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. త‌న ప‌ద‌వీకాలంలో స‌హ‌కారం అందించిన బోర్డు, సీనియ‌ర్ మేనేజ్‌మెంట్‌కు తాను హృద‌య‌పూర్వ‌క కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాన‌ని అన్నారు. కాగా హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్ విలీనానికి ముందు ఉపాధ్య‌క్షుడిగా ప‌నిచేసిన కేకీ మిస్త్రీని తాత్కాలిక చైర్మ‌న్‌గా నియ‌మించేందుకు బ్యాంకుకు ఆర్‌బీఐ అనుమ‌తి ఇచ్చింది. దీంతో మిస్త్రీ 3 నెల‌ల పాటు ఆ ప‌ద‌విలో కొన‌సాగ‌నున్నారు.

ప్ర‌భుత్వ శాఖ‌ల్లో ప‌నిచేసిన నేప‌థ్యం..

ఇక అటాను చ‌క్ర‌వ‌ర్తి గుజ‌రాత్ క్యాడ‌ర్‌కు చెందిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి. ఆయ‌న 2019-20 ఆర్థిక సంవ‌త్స‌రంలో ఆర్థిక వ్య‌వ‌హారాల విభాగం కార్య‌ద‌ర్శిగా సేవ‌లు అందించారు. ఈ హోదాలో ఆయ‌న వివిధ మంత్రిత్వ శాఖ‌ల ఆర్థిక విధానాల స‌మ‌న్వ‌యానికి బాధ్య‌త వ‌హించారు. బ‌డ్జెట్ రూప‌క‌ల్ప‌న‌, పార్ల‌మెంట్‌లో ఆమోదం వ‌ర‌కు జ‌రిగే మొత్తం ప్ర‌క్రియ‌ను ప‌ర్య‌వేక్షించారు. అంత‌కు ముందు ఆయ‌న ఆర్థిక మంత్రిత్వ‌శాఖ వ్య‌య విభాగంలో డైరెక్ట‌ర్‌గా, సంయుక్త కార్య‌ద‌ర్శిగా ప‌నిచేశారు. 2002 నుంచి 2007 మ‌ధ్య కాలంలో మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల‌ను ప‌రిశీలించ‌డం, ప్ర‌భుత్వ స‌బ్సిడీల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం వంటి బాధ్య‌తల‌ను నిర్వ‌ర్తించారు. ప్ర‌భుత్వ ఆర్థిక‌, కొనుగోలు విధానాల‌ను ఆధునీక‌రించ‌డంలోనూ కీల‌క‌పాత్ర పోషించారు. గుజ‌రాత్ రాష్ట్ర ప్ర‌భుత్వంలోనూ ఆయ‌న ప‌లు కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. ఆ రాష్ట్ర ఆర్థిక శాఖ కార్య‌ద‌ర్శిగా ప‌నిచేసి, ప్రైవేటు రంగ పెట్టుబ‌డ‌ల చ‌ట్టాల‌ను ప‌ర్య‌వేక్షించారు. ప‌రిపాల‌న‌, అభివృద్ధి రంగాల్లో సేవ‌లు అందించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement