త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో జోష్‌.. లాభాల్లో ట్రేడ‌వుతున్న సూచీలు..

Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌ల‌లో గురువారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ కొనుగోళ్ల‌ ఆసక్తి కనిపించింది. బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 దాదాపు 1 శాతం వరకు పెరిగాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా (0.80 శాతం) పెరిగి ఇంట్రాడేలో 75,946 స్థాయిని తాకగా, నిఫ్టీ 50 కూడా 0.85 శాతం లాభంతో 23,860 స్థాయికి చేరుకుంది.

S

Business | Published On May 21, 2026, 10.06 am IST

Stock Markets | స్టాక్ మార్కెట్ల‌లో జోష్‌.. లాభాల్లో ట్రేడ‌వుతున్న సూచీలు..
Advertisement

Stock Markets | భారత స్టాక్ మార్కెట్‌ల‌లో గురువారం ఉదయం ట్రేడింగ్‌లో భారీ కొనుగోళ్ల‌ ఆసక్తి కనిపించింది. బెంచ్‌మార్క్ సూచీలు బీఎస్ఈ సెన్సెక్స్, ఎన్ఎస్ఈ నిఫ్టీ 50 దాదాపు 1 శాతం వరకు పెరిగాయి. సెన్సెక్స్ 600 పాయింట్లకు పైగా (0.80 శాతం) పెరిగి ఇంట్రాడేలో 75,946 స్థాయిని తాకగా, నిఫ్టీ 50 కూడా 0.85 శాతం లాభంతో 23,860 స్థాయికి చేరుకుంది. బీఎస్ఈలో మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా ఒక్కోటి 1 శాతం చొప్పున పెరగడం మార్కెట్‌లో విస్తృత స్థాయి కొనుగోళ్లను సూచించింది. బీఎస్ఈలో లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.464 లక్షల కోట్లకు చేరుకుంది. గత సెషన్‌లో ఇది రూ.461 లక్షల కోట్లుగా ఉండగా, కేవలం తొలి 10 నిమిషాల్లోనే ఇన్వెస్టర్ల సంపద సుమారు రూ.3 లక్షల కోట్లు పెరిగింది. అమెరికా-ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలపై ఆశలు పెరగడం, భారత రూపాయి కోలుకోవడం, క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గడం, అలాగే అమెరికా బాండ్ ఈల్డ్స్ సడలించడం మార్కెట్‌ల‌కు ఊరటనిచ్చాయి.

కార‌ణాలు ఇవే..

ఆసియా మార్కెట్లు కూడా భారీగా లాభపడ్డాయి. ముఖ్యంగా ద‌క్షిణ కొరియా కోస్పి సూచీ 6 శాతం పెరిగింది. భౌగోళిక ఉద్రిక్తతలు తగ్గుతాయన్న అంచనాలు, ఏఐ ట్రేడ్‌పై పెరుగుతున్న ఆశావాదం దీనికి ప్రధాన కారణాలుగా నిలిచాయి. ప్రపంచవ్యాప్తంగా చిప్, ఏఐ సంబంధిత స్టాక్స్‌లో బలమైన కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. దక్షిణ కొరియా, తైవాన్ వంటి దేశాలు గ్లోబల్ సెమీకండక్టర్ హబ్‌లుగా ఉండటంతో, ఏఐ ఆధారిత కంపెనీల బలమైన ఆదాయ ఫలితాలు విదేశీ ఇన్వెస్టర్లను ఆకర్షిస్తున్నాయి. మధ్యప్రాచ్య యుద్ధ ఉద్రిక్తతలు తగ్గే అవకాశాలు కూడా మార్కెట్ సెంటిమెంట్‌ను బలోపేతం చేస్తున్నాయి. డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌తో చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలిపారు. టెహ్రాన్‌పై దాడులను తాత్కాలికంగా వాయిదా వేసిన తర్వాత, తాజా అమెరికా ప్రతిపాదనపై సమీక్ష చేస్తున్నామని ఇరాన్ కూడా ప్రకటించింది.

త‌గ్గిన చ‌మురు ధ‌ర‌లు, బ‌ల‌ప‌డ్డ రూపాయి..

ఇక క్రూడ్ ఆయిల్ బెంచ్‌మార్క్ అయిన బ్రెంట్ క్రూడ్ ధరలు గ‌త సెష‌న్ ముగింపులో 6 శాతం వరకు పడిపోయి వారం రోజుల కనిష్టానికి చేరుకున్నాయి. అయితే గురువారం కొంత రికవరీ కనిపించినా, బ్యారెల్‌కు 105 డాలర్ల సమీపంలోనే ట్రేడవుతున్నాయి. ఇక‌ భారత రూపాయి కూడా అమెరికా డాలర్‌తో పోలిస్తే 61 పైసలు కోలుకుని 96.25 స్థాయికి చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో బై ఆన్ డిప్స్ వ్యూహం బాగా పనిచేస్తోందని ఈ మేర‌కు విశ్లేష‌కులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌లి కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్లు (ఎఫ్‌పీఐలు) అమ్మకాలు తగ్గించి, కొన్ని సెషన్లలో కొనుగోళ్లు కూడా ప్రారంభించారని చెబుతున్నారు. భారత మార్కెట్ వాల్యుయేషన్లు ప్రస్తుతం న్యాయమైన స్థాయిలో ఉన్నాయని, కొన్ని రంగాల్లో ఆకర్షణీయంగా కూడా కనిపిస్తున్నాయని పేర్కొంటున్నారు. క్రూడ్ ధరలు, రూపాయి స్థిరత్వం ఆధారంగా ఎఫ్‌పీఐలు మరింతగా కొనుగోళ్లు చేసే అవకాశం ఉందని అంటున్నారు.

Advertisement
Advertisement