త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Gold And Silver ETF | భారీగా ప‌త‌న‌మ‌వుతున్న గోల్డ్‌, సిల్వ‌ర్ ఈటీఎఫ్‌లు.. ధ‌ర‌లు ఇంకా త‌గ్గుతాయా..?

Gold And Silver ETF | గ‌త ప‌ది రోజుల నుంచి ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ క‌నిపిస్తుండ‌డంతో పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డులను బంగారం నుంచి ఈక్విటీల వైపు మళ్లిస్తున్న‌ట్లు స్పష్టమ‌వుతోంది. బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఇటీవ‌ల భారీ ప‌త‌నం చోటు చేసుకుంటోంది.

S

Business | Published On Jun 26, 2026, 1.48 pm IST

Gold And Silver ETF | భారీగా ప‌త‌న‌మ‌వుతున్న గోల్డ్‌, సిల్వ‌ర్ ఈటీఎఫ్‌లు.. ధ‌ర‌లు ఇంకా త‌గ్గుతాయా..?
Advertisement

Gold And Silver ETF | గ‌త ప‌ది రోజుల నుంచి ఈక్విటీ మార్కెట్ల‌లో జోష్ క‌నిపిస్తుండ‌డంతో పెట్టుబ‌డిదారులు త‌మ పెట్టుబ‌డులను బంగారం నుంచి ఈక్విటీల వైపు మళ్లిస్తున్న‌ట్లు స్పష్టమ‌వుతోంది. బులియ‌న్ మార్కెట్ల‌లో బంగారం, వెండి ధ‌ర‌ల్లో ఇటీవ‌ల భారీ ప‌త‌నం చోటు చేసుకుంటోంది. అమెరికా-ఇరాన్‌ల మ‌ధ్య శాంతి ఒప్పందం జ‌ర‌గడం, చ‌మురు స‌ర‌ఫ‌రాకు ఉన్న అడ్డంకులు తొల‌గిపోవడంతో ఇన్వెస్ట‌ర్లు పాజిటివ్ సెంటిమెంట్‌తో ఉన్నారు. దీంతో బంగారం క‌న్నా ఈక్విటీ బెట‌ర్ అని భావించి స్టాక్స్‌లో పెట్టుబ‌డులు పెడుతున్నారు. దీంతో బంగారం ధ‌ర‌లు భారీగా ప‌డిపోతున్నాయి. అయితే ఇదే ప్ర‌భావం ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్‌)పై కూడా ప‌డింది. గ‌త సెష‌న్‌లో ఒక్క రోజే గోల్డ్, సిల్వ‌ర్ ఈటీఎఫ్‌లు భారీగా క్షీణించాయి. గోల్డ్ ఈటీఎఫ్‌లు సుమారుగా 2 శాతం మేర న‌ష్ట‌పోగా, సిల్వ‌ర్ ఈటీఎఫ్‌లు 4 శాతం ప‌త‌న‌మ‌య్యాయి. దీంతో ఇన్వెస్టర్లు ప్ర‌స్తుతం ఈక్విటీల వైపు మొగ్గు చూపుతున్నార‌ని అర్థ‌మ‌వుతోంది.

భారీగా త‌గ్గిన ఈటీఎఫ్‌ల ధ‌ర‌లు..

నిప్పాన్ ఇండియా సిల్వర్ ఈటీఎఫ్ (సిల్వర్‌బీస్) 3.81 శాతం పడిపోయి రూ.205.23కు చేరింది. అలాగే ఎస్‌బీఐ సిల్వర్ ఈటీఎఫ్ 3.76 శాతం తగ్గి రూ.210.25కు చేరుకుంది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ సిల్వర్ ఈటీఎఫ్ 3.78 శాతం క్షీణించి రూ.214.05 వద్ద ఉండగా, టాటా సిల్వర్ ఈటీఎఫ్ 3.74 శాతం పడిపోయి రూ.20.85 వద్ద ఉంది. గోల్డ్ ఈటీఎఫ్‌లలో కూడా అమ్మకాల ఒత్తిడి కనిపించింది. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ గోల్డ్ ఈటీఎఫ్ 1.94 శాతం తగ్గి రూ.119.23కు చేరుకుంది. ఎస్‌బీఐ గోల్డ్ ఈటీఎఫ్ 1.92 శాతం క్షీణించి రూ.118.91 వద్ద ట్రేడైంది. నిప్పాన్ ఇండియా ఈటీఎఫ్ గోల్డ్ బీస్ 1.86 శాతం తగ్గి రూ.115.37కు చేరుకోగా, టాటా గోల్డ్ ఈటీఎఫ్ 1.81 శాతం పడిపోయి రూ.13.57 వద్ద స్థిర‌ప‌డింది. మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజ్ (ఎంసీఎక్స్)లో గోల్డ్‌, సిల్వ‌ర్ ఫ్యూచ‌ర్స్ ధ‌ర‌లు భారీగా త‌గ్గ‌డం వ‌ల్ల ఈటీఎఫ్‌లు కూడా క్షీణించాయి. అయితే అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లో ఈక్విటీల జోరు పెరుగుతూ బంగారం, వెండి వంటి సేఫ్ హావెన్ ఆస్తుల‌కు డిమాండ్ త‌గ్గినందునే ఈ ధ‌ర‌ల ప‌త‌నం చోటు చేసుకుంద‌ని నిపుణులు విశ్లేషిస్తున్నారు. అందువ‌ల్ల బంగారం, వెండితో సంబంధం ఉన్న అన్ని విభాగాల్లోనూ ధ‌ర‌లు క్షీణిస్తున్నాయ‌ని అంటున్నారు.

దీర్ఘ‌కాలం ఇలా ఉండ‌దు..

అంత‌ర్జాతీయ మార్కెట్ల‌లోనూ బంగారం ధ‌ర బ‌ల‌హీనంగానే ఉంది. గ‌త సెష‌న్‌లో 7 నెల‌ల త‌రువాత తొలిసారి స్పాట్ గోల్డ్ ఔన్స్‌కు 4వేల డాల‌ర్ల కీల‌క స్థాయిక‌న్నా దిగువ‌కు ప‌డిపోగా, అమెరికా డాల‌ర్ బ‌ల‌పడింది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించేందుకు అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఈ ఏడాది వడ్డీ రేట్లను పెంచే అవకాశాలపై మార్కెట్ అంచనాలు పెరగడం వల్ల వడ్డీ రాబడి లేని బంగారం వంటి ఆస్తులపై పెట్టుబడిదారుల ఆసక్తి తగ్గింది. అందువ‌ల్లే విలువైన లోహాల ధ‌ర‌లు త‌గ్గుతున్నాయి. అయితే ఇది దీర్ఘ‌కాలం ఉండ‌ద‌ని, ఈక్విటీల్లో కొనుగోళ్లు కాస్త త‌గ్గితే మ‌ళ్లీ బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతాయ‌ని, అప్ప‌టి వ‌ర‌కు క‌రెక్ష‌న్ జ‌రిగే అవ‌కాశం ఉంద‌ని విశ్లేష‌కులు చెబుతున్నారు. పెట్టుబ‌డిదారులు బంగారం, వెండిల‌లో పెట్టుబ‌డులు పెట్టేముందు నిపుణుల స‌ల‌హా తీసుకోవాల‌ని సూచిస్తున్నారు.

Advertisement
Advertisement