త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Ramchandar Rao | నితిన్ న‌బీది ఎల‌క్ష‌న్ టూర్ కాదు.. ప్ర‌జా టూర్‌: బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు

Ramchandar Rao | బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీ మూడు రోజుల‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని.. అది ఎల‌క్ష‌న్ టూర్ కాద‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ‌డం కోస‌మే ఈ ప‌ర్య‌ట‌న చేస్తున్నార‌ని వెల్ల‌డించారు.

S

Telangana | Published On Jun 26, 2026, 2.39 pm IST

Ramchandar Rao | నితిన్ న‌బీది ఎల‌క్ష‌న్ టూర్ కాదు.. ప్ర‌జా టూర్‌: బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు
Advertisement

Ramchandar Rao | త్రినేత్ర‌.న్యూస్‌: బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ న‌బీ మూడు రోజుల‌ తెలంగాణ ప‌ర్య‌ట‌న‌కు వ‌స్తున్నార‌ని.. అది ఎల‌క్ష‌న్ టూర్ కాద‌ని ఆ పార్టీ రాష్ట్ర అధ్య‌క్షుడు రాంచంద‌ర్‌రావు తెలిపారు. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర‌వ‌డం కోస‌మే ఈ ప‌ర్య‌ట‌న చేస్తున్నార‌ని వెల్ల‌డించారు. శుక్ర‌వారం నాంప‌ల్లిలోని పార్టీ కార్యాల‌యంలో ఆయ‌న మీడియాతో మాట్లాడారు. తుంగ‌భ‌ద్ర గేట్ల మ‌ర‌మ్మ‌తులు, సిటిజ‌న్‌షిప్‌, ఎస్ఐఆర్ త‌దిత‌ర అంశాల‌పై ఆయ‌న మాట్లాడారు.

నితిన్ న‌బీ ఎల్లుండి తెలంగాణ‌కు వ‌స్తున్నారు. గతంలో మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ ప‌ర్య‌ట‌న‌కు వ‌చ్చారు. ఇక్క‌డికి రావ‌డం ఇది రెండో సారి. మ‌ధ్యాహ్నం స‌మ‌యంలో రంగారెడ్డి జిల్లా కార్యాల‌యం నుంచి ప‌ది కార్యాల‌యాలు వ‌ర్చువ‌ల్‌గా ప్రారంభిస్తారు. ఎగ్జిబిష‌న్ మైదానంలో మూడు కార్పొరేష‌న్ల ప‌రిధిలో బూత్ ప్రెసిడెంట్‌ల మీటింగ్ ఉంట‌ది. త‌ర్వాత రాష్ట్ర కార్యాల‌యంలో ఎంపీ, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేల స‌మావేశం నిర్వ‌హిస్తం. వీబీఐటీ ఇంజినీరింగ్ విద్యార్థులతో కాన్‌క్లేవ్ ఉంటుంది. త‌ర్వాత వ‌రంగ‌ల్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్తారు. లంబాడ‌, కోయ, చెంచుల‌తో స‌మావేశం ఉంటుంది. అనంత‌రం ఉమ్మ‌డి వ‌రంగ‌ల్ కార్య‌క‌ర్త‌లతో స‌మావేశమ‌వుతారు. త‌ర్వాత రోజు రాష్ట్ర క‌మిటీతో ఘ‌ట్‌కేస‌ర్‌లో మీటింగ్ ఉంటుంది. జాతీయ అధ్య‌క్షుడు మూడు రోజుల స‌మ‌యం తెలంగాణ‌కు కేటాయిస్తున్నారు. నితిన్ న‌బీకి స్వాగ‌తం ప‌లుకుతున్నాం. ఇటీవ‌లే మోదీ, రాజ్‌నాథ్ తెలంగాణ‌కు వ‌చ్చారు అని రాంచంద‌ర్‌రావు తెలిపారు.

15.9 టీఎంసీలు తెలంగాణ‌కు రావాలి..

రేవంత్‌రెడ్డి తుంగ‌భ‌ద్ర విష‌యం మాట్లాడారు. గేట్ల రిపేర్‌ల ప‌నులు కావాల్సిందే. 35 టీఎంసీలు న‌వేలి రిజ‌ర్వాయ‌ర్ క‌ర్ణాట‌క‌లో ప్ర‌పోజ‌ల్ ఉంది. ఏపీలోని గుండురేవుల ప్రాజెక్టు నుంచి 20 టీఎంసీలు వాడే అవ‌కాశం ఉంది. ట్రిబ్యున‌ల్ కు సంబంధించి నీటి పంపకాలు లేవు. 15.9 టీఎంసీలు తెలంగాణ‌కు రావాలి. 5 టీఎంసీలు వ‌చ్చే అవ‌కాశ‌మే క‌నిపిస్తుంది. 968 టీఎంసీ గోదావ‌రి ప్రాజెక్టు కింద ఉన్న నీళ్లు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మోసం చేశాయి. బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యున‌ల్‌లో కేసీఆర్ త‌క్కువ వాటాకు ఒప్పుకున్నారు. ఆర్డీఎస్‌కు సంబంధించి రాష్ట్రాల మ‌ధ్య వివాదాల‌ను ప‌రిష్క‌రించాం. కేంద్రం మ‌ధ్య‌వ‌ర్తిత్వ‌మే చేస్తుంది. కానీ రేవంత్ రెడ్డి లోప‌ల సీఆర్ పాటిల్‌తో ఏం మాట్లాడారు.. రాష్ట్ర వాటాలు వ‌స్తున్నాయా? త‌దిత‌ర అన్ని వివ‌రాల‌ను రేవంత్ రెడ్డి తెలంగాణ ప్ర‌జ‌ల‌కు తెలియ‌జేయాలి అని ఆయ‌న సూచించారు.

కాంగ్రెస్‌, మ‌జ్లిస్ త‌ప్పుడు ప్ర‌చారం..

పాస్‌పోర్ట్ అనేది ప్ర‌యాణానికి సంబంధించింది మాత్ర‌మే. అది సిటిజ‌న్‌షిప్ డాక్యుమెంట్ కాదు. మ‌న దేశంలో ద‌లైలామాకు ఎన్నో పాస్‌పోర్టులు ఉన్నాయి. కానీ ఆయ‌న ఇండియ‌న్ సిటిజ‌న్ కాదు. 1967 పాస్‌పోర్ట్‌ యాక్ట్ కింద సెక్ష‌న్ 20 కింద అన్ని వివ‌రాలు ఉన్నాయి. 2013లో బాంబే హైకోర్టు అదే చెప్పింది. కానీ కాంగ్రెస్‌, మ‌జ్లిస్ త‌ప్పుడు ప్ర‌చారం చేస్తున్నాయి. ద‌య‌చేసి ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించ‌కండి.

ఎస్ఐఆర్‌లో అన్ని వివ‌రాలు ఇవ్వండి. పాస్‌పోర్ట్ అనేది ట్రావెల్ డాక్యుమెంట్. బీజేపీ సిటిజ‌న్ షిప్ ర‌ద్దు చేస్తార‌ని అబ‌ద్దాలు ప్ర‌చారం చేస్తున్న‌రు. బీజేపీ ఏది మాట్లాడినా త‌ప్పు ప‌డుతున్న‌రు. ఎస్ఐఆర్ మీ టైంలో జ‌రిగిన‌ప్పుడు ఏం మాట్లాడ‌లే. ఓవైసీ లా చ‌దివిన‌వారు. చ‌ట్టం తెలిసిన‌వాళ్లు. ద‌య‌చేసి త‌ప్పుడు స‌మాచారం ఇవ్వ‌కండి. మీ మిత్రుల‌కు కూడా చెప్పండి అని రాంచంద‌ర్‌రావు కోరారు.

నితిన్ న‌బీ ఏ ఆల‌యం సంద‌ర్శిస్తారు అనేది తెలియ‌దు. కానీ ప్ర‌జా ఆల‌యం మాత్రం సంద‌ర్శిస్తారు. ఎల‌క్ష‌న్‌కు ఈ ప‌ర్య‌ట‌న‌కు సంబంధం లేదు. ఇది ఎల‌క్ష‌న్ టూర్ కాదు. ప్ర‌జ‌ల‌కు ద‌గ్గ‌ర కావ‌డానికి ఈ ప‌ర్య‌ట‌న చేస్తున్నారు అని బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు స్ప‌ష్టం చేశారు.

 

Advertisement
Advertisement