త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

UPI MDR | యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ వద్దు.. కేంద్రానికి ఎఫ్‌ఎంసీజీ వ్యాపారుల విజ్ఞప్తి..

UPI MDR | దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎండీఆర్)ను అమలు చేయవద్దని ఎఫ్‌ఎంసీజీ పంపిణీదారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆలిండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్‌ (ఏఐసీపీడీఎఫ్)లో 4.5 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారని, యూపీఐ లావాదేవీలపై అదనపు ఖర్చులు విధిస్తే లక్షలాది చిన్న రిటైలర్లు, పంపిణీదారులు, తక్కువ లాభ మార్జిన్లతో పనిచేసే వ్యాపారాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది.

S

Business | Published On Sep 19, 2026, 2.04 pm IST

UPI MDR | యూపీఐ చెల్లింపులపై ఎండీఆర్ వద్దు.. కేంద్రానికి ఎఫ్‌ఎంసీజీ వ్యాపారుల విజ్ఞప్తి..
Advertisement

UPI MDR | దేశవ్యాప్తంగా యూపీఐ లావాదేవీలపై ప్రతిపాదిత మర్చంట్ డిస్కౌంట్ రేట్‌ (ఎండీఆర్)ను అమలు చేయవద్దని ఎఫ్‌ఎంసీజీ పంపిణీదారులు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆలిండియా కన్స్యూమర్ ప్రొడక్ట్స్ డిస్ట్రిబ్యూషన్ ఫెడరేషన్‌ (ఏఐసీపీడీఎఫ్)లో 4.5 లక్షలకు పైగా సభ్యులు ఉన్నారని, యూపీఐ లావాదేవీలపై అదనపు ఖర్చులు విధిస్తే లక్షలాది చిన్న రిటైలర్లు, పంపిణీదారులు, తక్కువ లాభ మార్జిన్లతో పనిచేసే వ్యాపారాలపై ప్రభావం పడుతుందని పేర్కొంది. ఈ మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పంపిన లేఖలో ఏఐసీపీడీఎఫ్ తన అభ్యంతరాలను వెల్లడించింది. యూపీఐ చెల్లింపుల ఖర్చు మొత్తం వ్యాపారులపైనే పడకుండా, వినియోగదారులు, తయారీదారుల మధ్య సమానంగా పంపిణీ చేయాలని కోరింది. వ్యాపారులకు యూపీఐని సున్నా ఎండీఆర్ విధానంలోనే కొనసాగించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేసింది.

ఒకే స‌ర‌ఫ‌రా గొలుసులో అద‌న‌పు ఖ‌ర్చులు..

స్థూల చెల్లింపు మొత్తంపై ఎండీఆర్ లెక్కించడం వల్ల ఏర్పడే ప్రభావాలను, దాని కారణంగా పన్నులపై పడే అదనపు భారాన్ని ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవాలని సంఘం కోరింది. ఎఫ్‌ఎంసీజీ రిటైల్, పంపిణీ రంగాలు అత్యంత తక్కువ లాభ మార్జిన్లతో పనిచేస్తాయని, అందువల్ల 0.4 శాతం ఎండీఆర్ కూడా వ్యాపారుల వాస్తవ ఆదాయాల్లో గణనీయమైన కోతకు దారితీస్తుంద‌ని తెలిపింది. పంపిణీదారులు ఇప్పటికే సరుకులను సరఫరా చేయడం, రిటైలర్లకు రుణ సదుపాయం కల్పించడం, నిల్వలను నిర్వహించడం, డెలివరీ చేయడం, చెల్లింపుల సేకరణకు సంబంధించిన రిస్క్‌ను భరించడం వంటి బాధ్యతలు నిర్వహిస్తున్నారని సంఘం వివరించింది. ఒకే సరఫరా గొలుసులో రిటైలర్ నుంచి పంపిణీదారుడికి, పంపిణీదారుడి నుంచి కంపెనీకి జరిగే యూపీఐ చెల్లింపులపై పలుమార్లు ఎండీఆర్ విధిస్తే, ఒకే లావాదేవీ శ్రేణిలో పదేపదే అదనపు ఖర్చులు ఏర్పడే అవకాశం ఉందని పేర్కొంది.

ఎండీఆర్ నుంచి మిన‌హాయించాలి..

అందువల్ల రిటైలర్ నుంచి పంపిణీదారుడికి, పంపిణీదారుడి నుంచి కంపెనీకి జరిగే యూపీఐ చెల్లింపులను పూర్తిగా ఎండీఆర్ పరిధి నుంచి మినహాయించాలని ఏఐసీపీడీఎఫ్ కోరింది. యూపీఐకి దేశవ్యాప్తంగా ఉన్న సార్వత్రిక ఆమోదాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని సంఘం జాతీయ అధ్యక్షుడు ధైర్యశీల్ పాటిల్ పేర్కొన్నారు. చిన్న వ్యాపారులకు సంబంధించి నెలకు రూ.1 లక్ష యూపీఐ రశీదుల పరిమితిపై కూడా స్పష్టత ఇవ్వాలని సంఘం కోరింది. ఒక వ్యాపారి నెలలో రూ.1 లక్షకు పైగా యూపీఐ చెల్లింపులు స్వీకరించిన తర్వాత ఎండీఆర్ కేవలం రూ.1 లక్షకు మించిన మొత్తంపైనే వర్తిస్తుందా, పరిమితి దాటిన తర్వాత జరిగే లావాదేవీలపై మాత్రమే వర్తిస్తుందా, లేక ఆ నెలలో జరిగిన అన్ని లావాదేవీలపై వర్తిస్తుందా అనే అంశాన్ని స్పష్టంగా నిర్వచించాలని తెలిపింది. అలాగే తక్కువ లాభ మార్జిన్లతో పనిచేసే చిన్న రిటైలర్లు, పంపిణీదారులకు ఉపశమనం కల్పించేలా ఎండీఆర్, చెల్లింపు సేవల ఛార్జీలపై వస్తు సేవల పన్ను నుంచి తగిన మినహాయింపులు కల్పించాలని ఏఐసీపీడీఎఫ్ ప్రభుత్వాన్ని కోరింది.

Advertisement
Advertisement