త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల కంపెనీలు డిక్సన్‌ టెక్నాలజీస్‌, కేన్స్‌ టెక్నాలజీ, సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ షేర్లు సోమవారం ప్రత్యేకంగా వార్తల్లో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం రూ.62,500 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకాన్ని ప్రకటించడమే ఇందుకు కారణం. ఈ పథకం కింద తయారీదారులకు 2.5 నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించనున్నారు.

S

Business | Published On Aug 24, 2026, 12.55 pm IST

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్‌ తయారీ కంపెనీలకు భారీ బూస్ట్.. రూ.62,500 కోట్ల పథకం
Advertisement

Dixon Technologies | ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల కంపెనీలు డిక్సన్‌ టెక్నాలజీస్‌, కేన్స్‌ టెక్నాలజీ, సిర్మా ఎస్‌జీఎస్‌ టెక్నాలజీస్‌ షేర్లు సోమవారం ప్రత్యేకంగా వార్తల్లో నిలిచాయి. కేంద్ర ప్రభుత్వం రూ.62,500 కోట్ల విలువైన మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకాన్ని ప్రకటించడమే ఇందుకు కారణం. ఈ పథకం కింద తయారీదారులకు 2.5 నుంచి 5 శాతం వరకు ప్రోత్సాహకాలు అందించనున్నారు. రూ.62,500 కోట్ల మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం మార్గదర్శకాల ప్రకారం.. భారతీయ యాజమాన్యం 51 శాతం ఉన్న ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల కంపెనీలు కూడా ఈ పథకంలో పాల్గొనేందుకు అర్హత పొందుతాయి. అయితే ఆయా కంపెనీలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.1వేయి కోట్ల టర్నోవర్‌ సాధించి ఉండాలి. భారత్‌లో మొబైల్‌ ఫోన్ల తయారీని ప్రోత్సహించేందుకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాల రూపంలో ఈ పథకం ద్వారా ప్రభుత్వం మద్దతు అందించనుంది.

ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి వ‌ర్తింపు..

మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం అధికారికంగా సోమ‌వారం నుంచి ప్రారంభమైంది. ఇది ఈ ఏడాది ఏప్రిల్‌ 1 నుంచి వ‌ర్తిస్తుంద‌ని కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ తెలిపారు. శుక్రవారం నుంచి ఈ పథకం కింద దరఖాస్తులు స్వీకరించడం ప్రారంభించారు. అయితే ఇది ఏప్రిల్‌ 1 నుంచి అంత‌కు ముందు తేదీతో అమల్లోకి రావడంతో, అర్హత పొందిన కంపెనీలు 2026-27 ఆర్థిక సంవత్సరం ప్రారంభం నుంచే అర్హత కలిగిన ఉత్పత్తి, అమ్మకాలపై ప్రోత్సాహకాలను క్లెయిమ్‌ చేసుకునే అవకాశం ఉంటుంది. ఐదేళ్ల కాలానికి అమలు చేయనున్న ఈ పథకం 2026-27 నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగుతుంది. భారత్‌లో తయారయ్యే మొబైల్‌ ఫోన్లకు ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకాలు అందించడం దీని ప్రధాన లక్ష్యం. ఈ పథకంలో రెండు కీలక విభాగాలు ఉన్నాయి. మొబైల్‌ ఫోన్‌ తయారీని ప్రోత్సహించడం ఒకటి కాగా, భారతీయ మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్లను ప్రోత్సహించడం మరొకటి.

రూ.10వేల కోట్ల ట‌ర్నోవ‌ర్ ఉండాలి..

ప్రోత్సాహకాలకు అర్హత పొందేందుకు దరఖాస్తు చేసుకునే కంపెనీలు భారత్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి. అలాగే 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.10వేల కోట్ల టర్నోవర్‌ సాధించి ఉండాలి. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పలు విధానపరమైన చర్యల నేపథ్యంలో దేశ ఎలక్ట్రానిక్స్‌, మొబైల్‌ ఫోన్‌ తయారీ రంగంలో ఏర్పడిన వేగాన్ని కొనసాగించడమే ఈ పథకం ఉద్దేశం. ప్రభుత్వం విడుదల చేసిన వివరాల ప్రకారం.. 2015 ఆర్థిక సంవత్సరం నుంచి దేశంలో ఎలక్ట్రానిక్స్‌ తయారీ ఏడు రెట్లు పెరిగింది. ఇదే సమయంలో ఎలక్ట్రానిక్స్‌ ఎగుమతులు 11 రెట్లు పెరిగాయి. 2025లో స్మార్ట్‌ఫోన్లు భారత్‌ నుంచి అత్యధికంగా ఎగుమతి అయిన ఉత్పత్తిగా నిలిచాయి. డీజిల్‌ ఇంధనం, కట్‌ డైమండ్స్‌ను అధిగమించి స్మార్ట్‌ఫోన్లు ఈ స్థానాన్ని దక్కించుకున్నాయి. మొదటి విభాగం కింద భారత్‌లో రిజిస్టర్‌ అయిన మొబైల్‌ ఫోన్‌ తయారీదారులు, ఎలక్ట్రానిక్స్‌ తయారీ సేవల కంపెనీలు 2025-26 ఆర్థిక సంవత్సరంలో కనీసం రూ.10వేల కోట్ల టర్నోవర్‌ సాధించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న బ్రాండ్లకు 2025-26 ఆర్థిక సంవత్సరం అమ్మకాల ఆధారంగా అదనపు అమ్మకాల లక్ష్యాలను ప్రభుత్వం నిర్దేశించింది.

రూ.5వేల కోట్ల అమ్మ‌కాలు ల‌క్ష్యంగా..

ఈ కంపెనీలు 2026-27లో అదనంగా రూ.5వేల కోట్ల అమ్మకాలను సాధించాలి. ఆ తర్వాత ప్రతి సంవత్సరం మరో రూ.5వేల కోట్ల చొప్పున ఈ లక్ష్యం పెరుగుతుంది. 2030-31 నాటికి అదనపు అమ్మకాల లక్ష్యం రూ.25వేల కోట్లకు చేరుతుంది. కొత్త మొబైల్‌ బ్రాండ్‌ భారత్‌లో ఏడాదికి రూ.10వేల కోట్ల అమ్మకాలను సాధించిన తర్వాతే ప్రోత్సాహకాలకు అర్హత పొందుతుంది. అనంతరం ప్రతి ఏడాది రూ.5వేల కోట్ల చొప్పున అదనపు అమ్మకాల లక్ష్యాన్ని చేరుకోవాల్సి ఉంటుంది. అర్హత కలిగిన అమ్మకాలను లెక్కించేందుకు ఈ పథకంలో మారుతున్న ప్రాథమిక అమ్మకాల ప్రమాణాన్ని ప్రవేశపెట్టారు. ఒక ఆర్థిక సంవత్సరానికి ప్రాథమిక అమ్మకాలు అంటే అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో సంబంధిత బ్రాండ్‌ దేశీయంగా సాధించిన అమ్మకాలకు అదనంగా 15 శాతం కలిపిన మొత్తం. ఆ మొత్తాన్ని ఆ ఏడాది సంబంధిత లక్ష్య విభాగంలో బ్రాండ్‌ సాధించిన మొత్తం అమ్మకాల నుంచి మినహాయించిన తర్వాత వచ్చే అమ్మకాలనే అర్హత కలిగిన అమ్మకాలుగా పరిగణిస్తారు.

18 నెల‌ల్లోగా తుది ఉత్ప‌త్తి..

కేంద్ర ఎలక్ట్రానిక్స్‌, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌ మాట్లాడుతూ పరిశ్రమతో ప్రభుత్వం అత్యంత సన్నిహితంగా సమన్వయం చేసుకుంటోందని తెలిపారు. ఈ మొబైల్‌ ఫోన్‌ తయారీ పథకం అమలు కాలంలో ఒక భారతీయ మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్‌ను విజయవంతంగా ఆవిష్కరించే అవ‌కాశం ఉంద‌ని ఆశిస్తున్నట్లు చెప్పారు. భారతీయ మొబైల్‌ ఫోన్‌ బ్రాండ్‌ను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే మూడు భారతీయ కంపెనీలతో చర్చలు జరుపుతోందని వైష్ణవ్‌ వెల్లడించారు. వచ్చే 18 నెలల్లో తుది ఉత్పత్తి మార్కెట్లోకి వస్తుందని ప్రభుత్వం ఆశిస్తున్నట్లు తెలిపారు.

Advertisement
Advertisement