త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Monsoon | బ‌ల‌హీనంగానే నైరుతి రుతుప‌వ‌నాలు.. ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై పెరుగుతున్న ఆందోళ‌న‌

Monsoon | గ‌త వారంతో పోలిస్తే దేశ‌వ్యాప్తంగా నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం కాస్త మెరుగైనా ఆశించిన స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం లేద‌ని తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా వ్య‌వ‌సాయానికి కీల‌క‌మైన రాష్ట్రాల్లో వ‌ర్షాభావ ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. దాంతో ఖ‌రీఫ్‌లో పంట‌ల సాగుపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

P

National | Published On Jul 6, 2026, 1.47 pm IST

Monsoon | బ‌ల‌హీనంగానే నైరుతి రుతుప‌వ‌నాలు.. ధ‌ర‌ల పెరుగుద‌ల‌పై పెరుగుతున్న ఆందోళ‌న‌
Advertisement
  • నెమ్మ‌దిగా సాగుతున్న ఖ‌రీఫ్ ప‌నులు
  • నిత్యావ‌స‌ర ధ‌ర‌లు పెరిగే అవ‌కాశం ఉంద‌న్న ఎంకే గ్లోబ‌ల్ ఫైనాన్షియ‌ల్ స‌ర్వీసెస్ నివేదిక‌
  • ప్రాజెక్టుల్లోనూ త‌గ్గిన నీటి నిల్వ‌లు
  • జులైలోనూ సాధార‌ణ కంటే త‌క్కువ‌గానే వ‌ర్షాపాతం

Monsoon | గ‌త వారంతో పోలిస్తే దేశ‌వ్యాప్తంగా నైరుతి రుతుప‌వ‌నాల ప్ర‌భావం కాస్త మెరుగైనా ఆశించిన స్థాయిలో వ‌ర్షాలు కుర‌వ‌డం లేద‌ని తాజా నివేదిక తెలిపింది. ముఖ్యంగా వ్య‌వ‌సాయానికి కీల‌క‌మైన రాష్ట్రాల్లో వ‌ర్షాభావ ప‌రిస్థితులు కొన‌సాగుతున్నాయి. దాంతో ఖ‌రీఫ్‌లో పంట‌ల సాగుపై ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఇదే ప‌రిస్థితి కొన‌సాగితే రానున్న రోజుల్లో ఆహార ధాన్యాల ఉత్ప‌త్తి త‌గ్గ‌డంతో పాటు నిత్యావ‌స‌రాల వ‌స్తువుల ధ‌ర‌ల‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ (Emkay Global Financial Services) తన నివేదికలో పేర్కొంది.

అదుపులోనే ద్ర‌వ్యోల్బ‌ణం..

ప్రస్తుతం ఆహార ద్రవ్యోల్బణం అదుపులోనే ఉన్నప్పటికీ కొన్ని నిత్యావసర వస్తువుల ధరల్లో స్వల్ప పెరుగుదల క‌నిపిస్తోంద‌ని నివేదిక తెలిపింది. గత వారం‌తో పోలిస్తే కూరగాయల ధరలు 1.5 శాతం, గుడ్ల ధరలు 1 శాతం, ధాన్యాల ధరలు 0.5 శాతం, వంట నూనెలు, ఇతర కొవ్వు పదార్థాల ధరలు 0.2 శాతం పెరిగాయి. గత ఏడాదితో పోల్చితే వంట నూనెలు, కొవ్వు పదార్థాల ధరలు 11 శాతం పెరగగా, గుడ్ల ధరలు 6 శాతం పెరిగాయి. కూరగాయలు, పాలు, సుగంధ ద్రవ్యాల ధరలు ఒక్కోటి 3 శాతం చొప్పున పెరిగాయి. ధాన్యాల ధరలు 2 శాతం, పప్పుధాన్యాల ధరలు ఒక శాతం మేర పెరిగినట్లు నివేదిక వెల్లడించింది.

వ్యవసాయ రాష్ట్రాల్లో వర్షాభావం

దేశంలో అధికంగా ఆహార పంటలు పండించే మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ వర్షాలు సాధారణం కంటే తక్కువగా కురుస్తున్నాయి. ఈ పరిస్థితి మరికొన్ని వారాలు కొనసాగితే పంటల దిగుబడిపై ప్రతికూల ప్రభావం పడే అవకాశం ఉందని నివేదిక హెచ్చరించింది. దీంతో మార్కెట్‌లో ఆహార ధాన్యాల సరఫరా తగ్గి, ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. జూలై 3 నాటికి దేశవ్యాప్తంగా నమోదైన వర్షపాతం దీర్ఘకాల సగటుతో పోలిస్తే 31 శాతం తక్కువగా ఉందని నివేదిక వెల్లడించింది. ముఖ్యంగా జూన్ నెలలో సాధారణం కంటే 40 శాతం తక్కువ వర్షపాతం నమోదైంది. గత పదేళ్లలో ఇదే అత్యంత పొడి నెల‌గా జూన్ నిలిచింద‌ని తెలిపింది.

ఆల‌స్యంగా ఖ‌రీఫ్ సాగు..

వర్షాలు ఆశించిన స్థాయిలో లేకపోవడంతో రైతులు ఖరీఫ్ పంటల విత్తనాలను వేయడంలో వెనుకంజ వేస్తున్నారని నివేదిక తెలిపింది. దీంతో ఈ సీజన్‌లో సాగు విస్తీర్ణం తగ్గే అవకాశం ఉందని పేర్కొంది. దేశంలోని ప్రధాన జలాశయాల్లో నీటి నిల్వలు కూడా ఆందోళనకరంగా తగ్గిపోయాయని వెల్లడించింది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా జలాశయాలు తమ మొత్తం నిల్వ సామర్థ్యంలో కేవలం 26 శాతం నిల్వ‌లు ఉన్నాయ‌ని, ఇది గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే 39 శాతం తక్కువని చెప్పింది. ప్రాంతాలవారీగా చూస్తే మధ్య భార‌త్‌లోని జలాశయాల్లో 32 శాతం, ఉత్తర భారతదేశంలో 29 శాతం, పశ్చిమ భార‌తంలో 28 శాతం నీటి నిల్వలు ఉన్నాయి. ద‌క్షిణ భార‌తంలో కేవ‌లం 20 శాతం, తూర్పు భారతదేశంలో 19 శాతానికి నీటి నిల్వ‌లు ప‌డిపోవ‌డంతో ఆందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. మ‌రో వైపు, భార‌త వాతావ‌ర‌ణ‌శాఖ అంచ‌నాల ప్ర‌కారం.. జులైలోనూ సాధార‌ణం కంటే త‌క్కువ‌గా వ‌ర్షాపాతం న‌మోద‌య్యే అవ‌కాశం ఉంది. దీంతో ఖరీఫ్ పంటల సాగు, ఆహార ధాన్యాల ఉత్పత్తి, నిత్యావసర వస్తువుల ధరలపై అనిశ్చితి కొనసాగుతుందని నివేదిక పేర్కొంది. రుతుప‌వ‌నాలు పుంజుకొని వ‌ర్షాలు కుర‌వ‌క‌పోతే వ్య‌వ‌సాయ‌రంగంపై తీవ్ర ఒత్తిడి ప‌డే అవ‌కాశం ఉంద‌ని నిపుణులు అభిప్రాయం వ్య‌క్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement