త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bharti Airtel | వొడాఫోన్ ఐడియా లాగే మాకు స‌డ‌లింపులు ఇవ్వండి.. డాట్‌కు ఎయిర్‌టెల్ లేఖ‌..!

Bharti Airtel | దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన భార‌తి ఎయిర్‌టెల్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిల విషయంలో సమాన న్యాయం చేయాలని కేంద్ర టెలికాం శాఖను కోరింది. తమ పోటీ కంపెనీ వొడాఫోన్ ఐడియాకు ఇటీవ‌ల ఇచ్చిన స‌డ‌లింపును త‌మ‌కు కూడా ఇవ్వాలంటూ కంపెనీ లేఖ‌ల్లో డాట్‌కు విజ్ఞ‌ప్తి చేసింది.

P

Business | Published On Mar 29, 2026, 3.50 pm IST

Bharti Airtel | వొడాఫోన్ ఐడియా లాగే మాకు స‌డ‌లింపులు ఇవ్వండి.. డాట్‌కు ఎయిర్‌టెల్ లేఖ‌..!
Advertisement

Bharti Airtel | దేశంలో రెండో అతిపెద్ద టెలికాం సంస్థ అయిన భార‌తి ఎయిర్‌టెల్ అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (AGR) బకాయిల విషయంలో సమాన న్యాయం చేయాలని కేంద్ర టెలికాం శాఖను కోరింది. తమ పోటీ కంపెనీ వొడాఫోన్ ఐడియాకు ఇటీవ‌ల ఇచ్చిన స‌డ‌లింపును త‌మ‌కు కూడా ఇవ్వాలంటూ కంపెనీ లేఖ‌ల్లో డాట్‌కు విజ్ఞ‌ప్తి చేసింది. మార్చి 2026లో ఏజీఆర్ బకాయిల చెల్లింపుల గడువు సమీపిస్తున్న నేపథ్యంలో ఎయిర్‌టెల్ ఈ చ‌ర్య‌లు చేప‌ట్టింది. వొడాఫోన్ ఐడియాకు ఇచ్చినట్లే చెల్లింపులపై మారటోరియం (గడువు పొడిగింపు) ఇవ్వాలని ఎయిర్‌టెల్ కోరింది.

ఎయిర్‌టెల్ బ‌కాయిలు ఎంత‌?

ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న వొడాఫోన్ ఐడియాకు ప్రభుత్వం సుమారు రూ.87,695 కోట్ల ఏజీఆర్ బకాయిలపై ప‌దేళ్ల ఏళ్ల మారటోరియం ఇచ్చింది. దీంతో ఆ సంస్థకు చెల్లింపులు చేసేందుకు గ‌డువు ల‌భించింది. ఇక ఎయిర్టెల్‌కు 2024-25 ఆర్థిక సంవత్సరం వరకు సుమారు రూ.51,091 కోట్ల ఏజీఆర్ బకాయిలు ఉన్నాయి. ఒక సంస్థకు మాత్రమే సడలింపులు ఇస్తే.. మార్కెట్ సమతుల్యత దెబ్బతింటుందని ఎయిర్‌టెల్ అభిప్రాయపడుతోంది. మరోవైపు, సుమారు రూ.40వేల కోట్ల ఏజీఆర్ బకాయిలను ప్రభుత్వ ఈక్విటీలోకి మార్చేందుకు సిద్ధమని ఎయిర్‌టెల్ పేర్కొంది. అయితే, ఈ అవకాశం అన్ని టెలికాం సంస్థలకు సమానంగా ఇవ్వాలనే షరతు పెట్టింది.

ఆర్థికంగా బ‌లంగానే ఉన్నాం..

త‌మ డిమాండ్ వెనుక ఆర్థిక స‌మ‌స్య‌లు కాదని సంస్థ స్పష్టం చేసింది. ఎయిర్‌టెల్ ఆర్థిక ప‌రిస్థితి బ‌లంగానే ఉంద‌ని, బకాయిలను చెల్లించే సామర్థ్యం ఉన్నదని తెలిపింది. అయితే, రుణ చెల్లింపులకంటే 5జీ నెట్‌వర్క్ విస్తరణ, ఫైబర్ ఆప్టిక్ మౌలిక వసతులపై పెట్టుబడులు పెట్టాలని కంపెనీ భావిస్తోంది. భవిష్యత్ సాంకేతిక పోటీలో వెనుకబడకుండా ఉండటానికి ఇది వ్యూహాత్మక నిర్ణయంగా పేర్కొంది. ఇక కంపెనీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.11ల‌క్ష‌ల‌కోట్ల‌కుపైగా ఉంది. 2025-26 ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో కంపెనీ ఆదాయం రూ.53,982 కోట్లకు చేరి.. గత ఏడాదితో పోలిస్తే దాదాపు 19.6 శాతం వృద్ధి న‌మోదైంది. అయితే, లాభం 47 శాతం తగ్గి రూ.8,503 కోట్లకు పడిపోయింది.

Advertisement

తాజావార్తలు

Advertisement