త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Adobe CEO Shantanu Narayen | అడోబ్ సీఈవో ప‌ద‌వికి శాంత‌ను నారాయ‌ణ్ రాజీనామా.. కార‌ణం ఏమిటి..?

Adobe CEO Shantanu Narayen | ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం అడోబ్‌కు చెందిన సీఈవో శాంత‌ను నారాయ‌ణ్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అడోబ్‌లో ఆయ‌న గ‌త 18 సంవ‌త్స‌రాలుగా పనిచేస్తుండ‌గా సీఈవో ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు. బోర్డుతో స‌న్నిహితంగా ప‌నిచేస్తాన‌ని, త‌దుప‌రి సీఈవోకు స‌హ‌క‌రిస్తాన‌ని వెల్ల‌డించారు.

S

Business | Published On Mar 13, 2026, 1.18 pm IST

Adobe CEO Shantanu Narayen | అడోబ్ సీఈవో ప‌ద‌వికి శాంత‌ను నారాయ‌ణ్ రాజీనామా.. కార‌ణం ఏమిటి..?
Advertisement

Adobe CEO Shantanu Narayen | ప్ర‌ముఖ సాఫ్ట్‌వేర్ దిగ్గ‌జం అడోబ్‌కు చెందిన సీఈవో శాంత‌ను నారాయ‌ణ్ త‌న ప‌ద‌వి నుంచి త‌ప్పుకుంటున్న‌ట్లు ప్ర‌క‌టించారు. అడోబ్‌లో ఆయ‌న గ‌త 18 సంవ‌త్స‌రాలుగా పనిచేస్తుండ‌గా సీఈవో ప‌ద‌వికి రాజీనామా చేస్తున్న‌ట్లు తెలిపారు. బోర్డుతో స‌న్నిహితంగా ప‌నిచేస్తాన‌ని, త‌దుప‌రి సీఈవోకు స‌హ‌క‌రిస్తాన‌ని వెల్ల‌డించారు. సంస్థ బోర్డు చైర్మ‌న్‌గా కొన‌సాగుతాన‌ని, అడోబ్ కార్య‌క‌లాపాల్లో త‌న పాత్ర‌ను కొన‌సాగిస్తాన‌ని తెలిపారు. ఏఐ వ‌ల్ల ఏర్ప‌డుతున్న సాంకేతిక మార్పుల నేప‌థ్యంలో అడోబ్ వ్యూహంపై కొత్త ఆందోళ‌న‌లు వ్య‌క్తం అవుతుండ‌గా ఆయ‌న ఈ నిర్ణ‌యం తీసుకోవ‌డం సంచ‌ల‌నంగా మారింది. కంపెనీలో దాదాపు రెండు ద‌శాబ్దాల పాటు సీఈవోగా సేవ‌లు అందించిన ఆయ‌న ఫొటోషాప్‌, ఇల‌స్ట్రేట‌ర్‌, ప్రీమియ‌ర్ ప్రొ, ఇన్ డిజైన్ వంటి ఎన్నో సాఫ్ట్‌వేర్‌ల‌ను ప్ర‌పంచానికి ప‌రిచయం చేశారు.

ఆత్మ ప‌రిశీల‌న‌కు స‌మ‌యం..

త‌న ప‌ద‌వికి రాజీనామా చేయ‌డంపై సంస్థ ఉద్యోగుల‌తో నారాయ‌ణ్ మాట్లాడారు. ఇది ఆత్మ ప‌రిశీల‌న‌కు స‌మ‌య‌మ‌ని, కంపెనీ భ‌విష్య‌త్తుపై తాను ఎంతో ఆశావ‌హ దృక్ప‌థంతో ఉన్నాన‌ని తెలిపారు. అడోబ్‌కు ముందున్న రోజులు మ‌రింత విజ‌య‌వంతంగా ఉంటాయ‌ని అన్నారు. ఇది ఎట్టి ప‌రిస్థితిలోనూ వీడ్కోలు కాద‌ని, బోర్డుతో క‌ల‌సి స‌రైన నాయ‌క‌త్వం బృందాన్ని ఏర్పాటు చేసి, అడోబ్‌ను త‌దుపరి ద‌శాబ్దంలో గొప్ప విజ‌యాల దిశ‌గా తీసుకెళ్లేలా తాను ప‌నిచేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. 2026 ఆర్థిక సంవ‌త్స‌రానికి సంబంధించిన ముఖ్య ల‌క్ష్యాల‌ను సాధించ‌డంలోనూ స‌హ‌క‌రిస్తాన‌ని, కంపెనీ ముందున్న అవ‌కాశాలు అసాధార‌ణ‌మైన‌వ‌ని పేర్కొన్నారు.

ఎన్నో విజ‌యాలు, పుర‌స్కారాలు..

శాంత‌ను నారాయ‌ణ్ 1998లో అడోబ్‌లో ఇంజినీరింగ్ టెక్నాల‌జీ గ్రూప్ వైస్ ప్రెసిడెంట్‌గా, జ‌న‌ర‌ల్ మేనేజ‌ర్‌గా చేరారు. 2005లో కంపెనీ ప్రెసిడెంట్‌, చీఫ్ ఆప‌రేటింగ్ ఆఫీస‌ర్ (సీవోవో)గా నియ‌మితుల‌య్యారు. 2007లో సీఈవోగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. 2017లో బోర్డు చైర్మ‌న్‌గా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. ఆయ‌న నాయ‌క‌త్వంలో అడోబ్ రికార్డు స్థాయి ఆదాయాన్ని ఆర్జించింది. క్రియేటివ్‌, డిజిట‌ల్ మీడియా సాఫ్ట్‌వేర్ రంగంలో తిరుగులేని శ‌క్తిగా అడోబ్ ఎదిగింది. భార‌తీయ మూలాలు ఉన్న 62 ఏళ్ల‌ నారాయ‌ణ్ అనేక‌ పుర‌స్కారాల‌ను అందుకున్నారు. భార‌త ప్ర‌భుత్వం ఆయ‌న‌కు ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అంద‌జేసింది. 2018లో అడోబ్‌లో సాధించిన విజ‌యాల‌కు గుర్తింపుగా ఎక‌నామిక్ టైమ్స్ గ్లోబ‌ల్ ఇండియ‌న్ ఆఫ్ ది ఇయ‌ర్ అవార్డును అంద‌జేసింది. అడోబ్‌లో చేర‌క‌ముందు ఆయ‌న యాపిల్‌, సిలికాన్ గ్రాఫిక్స్ సంస్థ‌ల్లో ప‌నిచేశారు. హైద‌రాబాద్‌లోని ఉస్మానియా యూనివ‌ర్సిటీ నుంచి ఎల‌క్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో బ్యాచిల‌ర్ డిగ్రీ పొందారు. బౌలింగ్ గ్రీన్ స్టేట్ యూనివ‌ర్సిటీ నుంచి కంప్యూట‌ర్ సైన్స్‌లో మాస్ట‌ర్స్ పూర్తి చేశారు. కాలిఫోర్నియా యూనివ‌ర్సిటీ నుంచి ఎంబీఏ ప‌ట్టా సాధించారు.

Advertisement
Advertisement