త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

CPM Srinivasa Rao | నీట్ లీక్స్‌పై రగులుతున్న యువత.. బాబు, పవన్ ఎందుకు సైలెంట్? బీజేపీకి కౌంట్‌డౌన్ షురూ!

నీట్ పేపర్ లీకేజీపై దేశవ్యాప్తంగా యువత భగ్గుమంటుంటే.. ఏపీ నేతలు ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? ఆగస్టు 1లోపు కేంద్రమంత్రి రాజీనామా చేయాలంటూ సీపీఎం నేతల ఫైర్!

J

Andhra pradesh | Published On Jul 23, 2026, 10.30 pm IST

CPM Srinivasa Rao | నీట్ లీక్స్‌పై రగులుతున్న యువత.. బాబు, పవన్ ఎందుకు సైలెంట్? బీజేపీకి కౌంట్‌డౌన్ షురూ!

సంక్షిప్త సారాంశం

నీట్ (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తక్షణమే రాజీనామా చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విద్యార్థులు రోడ్లెక్కి ఆందోళన చేస్తుంటే ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్, వైఎస్ జగన్ ఎందుకు ప్రశ్నించడం లేదని నిలదీశారు. ఆగస్టు 1లోపు కేంద్రమంత్రి రాజీనామా చేయకపోతే ఏపీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపడతామని కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ప్రైవేట్ ఎయిర్‌పోర్టులకు ప్రభుత్వ నిధులు వాడటం, ఏజెన్సీలో జీవో 3, 1/70 చట్టం అమలుపై ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.

Advertisement

CPM Srinivasa Rao | త్రినేత్ర.న్యూస్ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న 'నీట్' (NEET) పేపర్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరును సీపీఎం (CPM) ఏపీ కార్యదర్శి వి. శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుబట్టారు. గురువారం విజయవాడలోని బాలోత్సవ భవన్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో ఆయన మాట్లాడుతూ.. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేశారు. ఆగస్టు 1 నాటికి ఆయన తన పదవి నుంచి తప్పుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని గట్టి వార్నింగ్ ఇచ్చారు.

రోమ్ తగలబడుతుంటే.. ఫిడేల్ వాయిస్తున్నట్లుంది

కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలపై దేశం కోడై కూస్తోందని శ్రీనివాసరావు విమర్శించారు. "రోమ్ నగరం తగలబడిపోతుంటే నీరో చక్రవర్తి ఫిడేల్ వాయించుకున్నట్లుగా.. విద్యార్థులు రోడ్లెక్కి లాఠీ దెబ్బలు తింటుంటే ప్రధాని మోడీ (PM Modi) చోద్యం చూస్తున్నారు" అని మండిపడ్డారు. దేశంలో జెన్-జెడ్ (Gen-Z) యువత తిరగబడుతోందని, బీజేపీకి (BJP) కౌంట్ డౌన్ మొదలైందని స్పష్టం చేశారు.

పేపర్ లీక్స్‌తో విసుగెత్తిన యువత ఢిల్లీలో నిరసనలు చేస్తుంటే.. వారిపై పోలీసులు అమానుషంగా లాఠీఛార్జ్ (Lathi charge) చేయడం దారుణమన్నారు. పేరుకే ధర్మేంద్ర ప్రధాన్ అని, ఆయన తీరు మాత్రం 'అధర్మేంద్ర ప్రధాన్' లా ఉందని సెటైర్లు వేశారు. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ (CJI) స్పందించకపోవడం న్యాయవ్యవస్థకే కళంకం తెస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రశ్నిస్తానన్న పవన్ ఏమయ్యారు?

ఏపీ రాజకీయాలపై మాట్లాడుతూ.. రాష్ట్ర నేతల సైలెన్స్‌పై శ్రీనివాసరావు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. "విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడుతుంటే సీఎం చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) ఢిల్లీకి వెళ్లి మోదీని పొగడటం చూసి ఏపీ ప్రజలు తలదించుకుంటున్నారు. ఎప్పుడూ 'ప్రశ్నిస్తా' అని చెప్పే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) ఇప్పుడేమయ్యారు? ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ (YS Jagan) ఎందుకు నోరు మెదపడం లేదు?" అని నిలదీశారు. మోదీ పల్లకి మోయడానికి ఈ పార్టీలు పోటీ పడుతున్నాయని, ఇదే తీరు కొనసాగితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారని ఘాటుగా విమర్శించారు.

CPM Demands Dharmendra Pradhan's Resignation Over NEET Row Slams AP Leaders

ప్రైవేట్ ఎయిర్‌పోర్టుకు పబ్లిక్ మనీ ఎందుకు?

రాష్ట్రంలోని ఇతర కీలక సమస్యలను కూడా శ్రీనివాసరావు ఈ ప్రెస్ మీట్‌లో ప్రస్తావించారు. జీఎంఆర్ (GMR) చేతిలో ఉన్న భోగాపురం ప్రైవేట్ ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ప్రభుత్వ నిధులు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఇది పూర్తిగా అధికార దుర్వినియోగమే అని, ఆ నిధులను సంక్షేమ పథకాలకు వాడాలని సూచించారు.

అలాగే, గిరిజన ప్రాంతాల్లో తీవ్ర దుమారం రేపుతున్న జీవో 3 (GO 3), 1/70 చట్టం (1/70 Act) అమలుపై ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తప్పుబట్టారు. ఆదివాసీ యువత తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని, భూస్వాములు, పెత్తందారుల పక్షాన ప్రభుత్వం నిలబడటం మానుకోవాలని సూచించారు. సుప్రీంకోర్టులో సీనియర్ లాయర్‌ను పెట్టి గిరిజనుల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.

ఈ సమావేశంలో పాల్గొన్న సీపీఎం నేత వై. వెంకటేశ్వరరావు మాట్లాడుతూ.. కేంద్రం నిర్వహిస్తున్న పరీక్షల పేపర్లే పదే పదే లీక్ అవుతున్నా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని, కేంద్ర మంత్రి తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ప్రభుత్వాలు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

Advertisement
Advertisement