త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Supreme Court | విద్యార్థుల‌పై చ‌ర్య‌లు వ‌ద్దు.. వారిని వెంట‌నే వ‌దిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీల‌క ఆదేశాలు

Supreme Court | నీట్ పేప‌ర్ లీక్‌, ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌పై దేశ‌వ్యాప్తంగా జరిగిన నిర‌స‌న‌ల స‌మ‌యంలో విద్యార్థుల‌పై పోలీసుల దౌర్జ‌న్యాల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. హింసాత్మక ఘటనలకు పాల్పడి, చట్టాన్ని త‌మ‌ చేతుల్లోకి తీసుకున్న వారెవరైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. నిర‌స‌న‌ల స‌మ‌యంలో పోలీసులపై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది.

D

National | Published On Jul 28, 2026, 1.38 pm IST

Supreme Court | విద్యార్థుల‌పై చ‌ర్య‌లు వ‌ద్దు.. వారిని వెంట‌నే వ‌దిలిపెట్టండి.. పోలీసుల లాఠీఛార్జ్‌పై సుప్రీం కీల‌క ఆదేశాలు
Advertisement

Supreme Court | నీట్ పేప‌ర్ లీక్‌, ప‌రీక్ష‌ల్లో అక్ర‌మాల‌పై దేశ‌వ్యాప్తంగా జరిగిన నిర‌స‌న‌ల స‌మ‌యంలో విద్యార్థుల‌పై పోలీసుల దౌర్జ‌న్యాల‌పై దేశ అత్యున్న‌త న్యాయ‌స్థానం సుప్రీంకోర్టు (Supreme Court) తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును రాజ్యాంగం ప్ర‌తి ఒక్క‌రికీ కల్పించిందని పున‌రుద్ఘాటించింది. పోలీసుల చ‌ర్య‌ల‌పై స్వ‌తంత్ర ద‌ర్యాప్తు అవ‌స‌ర‌మ‌ని అభిప్రాయ‌ప‌డింది.

పేప‌ర్ లీక్‌, విద్యా వ్య‌వ‌స్థ‌లో అక్ర‌మాల‌కు నిర‌స‌న‌గా కాక్రోచ్ పార్టీ ఆధ్వ‌ర్యంలో దేశ రాజ‌ధాని ఢిల్లీ జంత‌ర్ మంత‌ర్ స‌హా, దేశ వ్యాప్తంగా జ‌రిగిన నిర‌స‌న‌ల్లో విద్యార్థుల‌పై పోలీసులు లాఠీఛార్జ్ చేయటంతోపాటు బాష్పవాయు గోళాలు, పెల్లెట్ల‌తో విరుచుకుప‌డిన విష‌యం తెలిసిందే. ఆయా ఘ‌ట‌న‌ల‌పై దేశ‌వ్యాప్తంగా తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మైంది. పోలీసుల చ‌ర్య‌ల‌ను నిర‌సిస్తూ ప‌లువురు సుప్రీంకోర్టులో పిటిష‌న్‌లు దాఖ‌లు చేశారు. ఆయా పిటిష‌న్ల‌పై భారత ప్రధాన న్యాయమూర్తి జ‌స్టిస్‌ సూర్యకాంత్, జస్టిస్‌ జయమాల్య బాగ్చీ, జ‌స్టిస్ వి. మోహనలతో కూడిన త్రిస‌భ్య ధర్మాసనం ఇవాళ విచార‌ణ జ‌రిపింది. ఈ సంద‌ర్భంగా కీల‌క వ్యాఖ్యలు చేసింది.

అలాంటి వారిని వ‌దిలిపెట్టేది లేదు..

హింసాత్మక ఘటనలకు పాల్పడి, చట్టాన్ని త‌మ‌ చేతుల్లోకి తీసుకున్న వారెవరైనా సరే వదిలిపెట్టేది లేదని స్పష్టం చేసింది. నిర‌స‌న‌ల స‌మ‌యంలో పోలీసులపై అనేక ఆరోప‌ణ‌లు వ‌చ్చాయ‌ని ధ‌ర్మాస‌నం తెలిపింది. పోలీసుల దాడుల్లో విద్యార్థులు, మహిళలు, లాయర్లు, విలేకర్ల‌కు గాయాలైన‌ట్లు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. ఈ అణచివేత చర్యలు, దాడి ఆరోపణలపై నిష్పాక్షిక, స్వతంత్ర ద‌ర్యాప్తు ఎందుకు జ‌ర‌గ‌కూడ‌దు..? అని ప్ర‌శ్నించింది. నిర్దేశిత నిబంధనలు లేదా ప్రొటోకాల్స్ ఉల్లంఘన జరిగితే చట్టం తనపని తాను చేసుకుపోతుందని పేర్కొంది. చ‌ట్ట‌ప్ర‌కారం కఠినచర్యలు త‌ప్ప‌వ‌ని హెచ్చరించింది.

పోలీసుల‌పై దాడులు చేసింది ఎవ‌రు..?

అదే స‌మ‌యంలో పోలీసుల‌పై జ‌రిగిన దాడుల‌పై కూడా ధ‌ర్మాస‌నం అస‌హ‌నం వ్య‌క్తం చేసింది. దాదాపు 250 మంది పోలీసుల‌పై దాడులు జ‌రిగిన‌ట్లు నివేదిక‌లు ఉన్నాయ‌ని పేర్కొంది. దీనిపై స‌మ‌గ్ర ద‌ర్యాప్తు జ‌ర‌గాల‌ని అభిప్రాయ‌ప‌డింది. దాడి చేసింది విద్యార్థులా..? లేక నేర‌గాళ్లా..? అన్న‌ది తేల్చాల‌ని స్ప‌ష్టం చేసింది. బాధ్యులను తేల్చనప్పుడు విచారణకు అర్థమే లేద‌ని విచార‌ణ సంద‌ర్భంగా సీజేఐ జ‌స్టిస్ సూర్య‌కాంత్ వ్యాఖ్యానించారు.

ఆ విద్యార్థుల‌ను వెంట‌నే విడుద‌ల చేయండి

విద్యార్థుల అరెస్టుల విష‌యంలోనూ సీజేఐ నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం కీల‌క ఆదేశాలు జారీ చేసింది. ఆయా కేసుల్లో అరెస్టైన వారిలో ఎలాంటి నేర చ‌రిత్ర లేని వారిని, 18 ఏళ్ల లోపు మైన‌ర్ల‌ను వెంట‌నే విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. సీజేపీ నేతృత్వంలో జ‌రిగిన నిర‌స‌న‌ల్లో పాల్గొన్న విద్యార్థుల‌పై న‌మోదైన ఎఫ్ఐఆర్‌ల‌పై ఎలాంటి బ‌ల‌వంత‌పు చ‌ర్య‌లూ తీసుకోకూడ‌ద‌ని సుప్రీం ధ‌ర్మాస‌నం స్ప‌ష్టం చేసింది.

మాజీ న్యాయ‌మూర్తితో సిట్ ఏర్పాటు

హింసాత్మ‌క‌ ఘటనలపై పారదర్శక విచారణ జరిగేలా చూడటానికి సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటుపై స్పంద‌న కోరుతూ.. కేంద్ర ప్రభుత్వంతోపాటూ ఢిల్లీ, బీహార్‌, మ‌హారాష్ట్ర‌, అస్సాం, ప‌శ్చిమ బెంగాల్‌, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వాల‌కు నోటీసులు జారీ చేసింది. అదేవిధంగా విద్యార్థుల నిర‌స‌న‌ల‌కు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్‌లు, ఇత‌ర వివ‌రాల‌ను భ‌ద్ర‌ప‌ర‌చాల‌ని ఆదేశించింది. అనంత‌రం త‌దుప‌రి విచార‌ణ‌ను ఆగ‌స్టు 3కు వాయిదా వేసింది.

Also Read..

ధ‌ర్మేంద్ర‌ ప్ర‌ధాన్ రాజీనామాకు బ‌దులు శాఖ మార్పు ప్ర‌తిపాద‌న చేసిన మోదీ స‌ర్కార్‌.. కానీ..

నీట్ మంట‌లు.. ఉభ‌య‌స‌భ‌లు మ‌ళ్లీ వాయిదా.. మ‌ధ్యాహ్నం లోక్‌స‌భ‌లో పేప‌ర్ లీక్ బిల్లుపై చ‌ర్చ‌

ప్ర‌ధాని మోదీ సెల్ఫీ వీడియో తొల‌గింపు.. క్ష‌మాప‌ణ‌లు చెప్పిన మెటా

Advertisement
Advertisement