త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Dragon Fruit Farming | డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు.. ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్న క్యాన్స‌ర్ పేషెంట్

Dragon Fruit Farming | క్యాన్స‌ర్( Cancer ) అంటేనే ప్రాణాంత‌క‌మైన రోగం అని అంద‌రూ ఆందోళ‌న చెందుతారు. కానీ ఓ వ్య‌క్తి మాత్రం నోటి క్యాన్స‌ర్‌ను జ‌యించి.. రైతు( Farmer )గా అవ‌తార‌మెత్తి.. డ్రాగన్ ఫ్రూట్ సాగు( Dragon Fruit Farming ) చేస్తూ ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్నాడు. స్థానికంగా ప‌ది మందికి ఆద‌ర్శ రైతుగా మారాడు.

S

Agriculture | Published On May 1, 2026, 3.06 pm IST

Dragon Fruit Farming | డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు.. ఏడాదికి రూ. 30 ల‌క్ష‌లు సంపాదిస్తున్న క్యాన్స‌ర్ పేషెంట్

సంక్షిప్త సారాంశం

అత‌ను కాట‌న్ మిల్లులో ఓ చిరుద్యోగి. రెక్కాడితే కానీ డొక్కాడ‌ని ప‌రిస్థితి. అత‌నికి పొగాకు తినే అల‌వాటు ఉంది. దీంతో ఆ చిరుద్యోగికి నోటి క్యాన్స‌ర్ అటాక్ అయింది. అయినా కూడా క్యాన్స‌ర్‌ను జ‌యించి.. ప్ర‌స్తుతం డ్రాగన్ ఫ్రూట్ సాగు చేస్తూ.. ఆద‌ర్శ‌గా రైతుగా మారాడు. మ‌రి అత‌నేవ‌రో తెలుసుకోవాలంటే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ వెళ్ల‌క త‌ప్ప‌దు.

Advertisement

Dragon Fruit Farming | త్రినేత్ర‌.న్యూస్ : ఉత్త‌ర‌ప్ర‌దేశ్( Uttar Pradesh ) బారాబంకి జిల్లా( Barabanki District )కు చెందిన గ‌యా ప్ర‌సాద్ మౌర్య( Gaya Prasad Maurya ) త‌న చ‌దువు పూర్త‌య్యాక‌.. స్థానికంగా ఉన్న కాట‌న్ మిల్లు( Cotton Mill )లో ఉద్యోగంలో చేరాడు. తన కుటుంబ స‌భ్యులు వ‌రి, గోధుమ‌, బంగాళాదుంప వంటి పంట‌ల‌ను నాగులు హెక్టార్ల‌లో సాగు చేసేవారు. ఇక 2011 నాటికి గ‌యా ప్ర‌సాద్‌కు నోటి క్యాన్స‌ర్( Cancer ) వ‌చ్చిన‌ట్లు నిర్ధార‌ణ అయింది. ఎందుకంటే అత‌ను నిత్యం పొగాకు( Tobacco ) న‌మిలేవాడు కాబ‌ట్టి.

దీంతో గ‌యా క్యాన్స‌ర్‌కు చికిత్స తీసుకున్నాడు.. త్వ‌ర‌గానే కోలుకున్నాడు. కానీ కాట‌న్ మిల్లులో ఉద్యోగం కొన‌సాగించ‌కుండా రాజీనామా చేశాడు. పొగాకు తిన‌డం పూర్తిగా మానేశాడు. కుటుంబం గ‌డిచేందుకు ఆదాయం ఎలా సంపాదించాల‌న్న ఆలోచ‌న గ‌యాలో మొద‌లైంది. 2014లో కొత్త‌గా ఏదైనా ప్రారంభించాల‌నుకున్నాడు. ఆ స‌మ‌యంలో త‌న కుటుంబం సంప్ర‌దాయ పంట‌ల‌నే పండిస్తుంది.

మొద‌ట‌ గులాబీ పూల సాగు..

ఈ పంట‌ల‌తో ప‌రిమిత ఆదాయం మాత్ర‌మే వ‌స్తుంది. లాభాలు ఎక్కువ‌గా లేవు. ఈ క్ర‌మంలోనే గులాబీ పూల సాగు చేశాడు రెండు హెక్టార్ల‌లో. దిగుబ‌డి బాగానే వ‌చ్చింది. ఆదాయం కూడా అనుకున్నంత వ‌చ్చింది. కానీ ఈ గులాబీ సాగును ఎక్కువ కాలం కొన‌సాగించ‌లేక‌పోయాడు గ‌యా. ఎందుకంటే 2015లో ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో నిర్వ‌హించిన ఓ రైతు ఎగ్జిబిష‌న్‌కు గ‌యా హాజ‌ర‌య్యాడు. అక్క‌డ ఒక డ్రాగ‌న్ ఫ్రూట్ మొక్క‌ను రూ. 300కు కొనుగోలు చేశాడు. ఆ మొక్క ఏడాది గ‌డిచే లోపు నాలుగు పండ్ల‌ను ఇచ్చింది. ఆ పండు రుచిని గ‌యా కుటుంబ స‌భ్యులు ఇష్ట‌ప‌డ్డారు.

డ్రాగ‌న్ ఫ్రూట్ సాగుపై ఆన్‌లైన్‌లో శోధించి.. 

దీంతో డ్రాగ‌న్ ఫ్రూట్ సాగుపై గ‌యా దృష్టి సారించాడు. బారాబంకి జిల్లాలో కానీ, స‌మీప ప్రాంతాల్లో కానీ డ్రాగ‌న్ ఫ్రూట్ సాగు చేయ‌డం లేద‌ని తెలుసుకున్నాడు. ఇక ఆల‌స్యం చేయ‌కుండా.. గ‌యా కుమారుడు డ్రాగ‌న్ ఫ్రూట్ సాగుపై ఆన్‌లైన్‌లో శోధించాడు. గుజ‌రాత్‌లోని ఓ న‌ర్స‌రీలో డ్రాగ‌న్ ఫ్రూట్ మొక్క‌ల‌ను విక్ర‌యిస్తున్న‌ట్లు క‌నుగొన్నాడు. దీంతో 1000 మొక్క‌ల‌ను ఆర్డ‌ర్ పెట్టాడు. ఒక్కో మొక్క ధ‌ర రూ. 85. రైలు ద్వారా లక్నోలోని చార్‌బాగ్ స్టేష‌న్‌కు డ్రాగన్ ఫ్రూట్ మొక్క‌లు చేరుకున్నాయి.

అర ఎక‌రాలో 20 క్వింటాళ్ల దిగుబ‌డి..

మొద‌ట అర ఎకర పొలంలో శాస్త్రీయ ప‌ద్ధ‌తిలో మొక్క‌ల‌ను నాటాడు. ఆర్‌సీసీ పిల్ల‌ర్ల‌ను ఉప‌యోగించి ఐదు ఫీట్ల ఎత్తులో వాటిని పాతి.. మొక్క‌ను నాటాడు. ప్ర‌తి పిల్ల‌రు నాలుగు మొక్క‌ల‌కు స‌పోర్ట్ ఇస్తుంది. ప్రతి పిల్ల‌ర్‌కు ఇనుప కడ్డీలతో ఒక పాత టైరును బిగించారు. ఈ టైర్ల వల్ల డ్రాగన్ ఫ్రూట్ తీగలు పైకి పెరిగి, ఆ తర్వాత కిందికి జాలువారుతాయి. దీనివల్ల అధిక దిగుబడిని ఇస్తుంది. మొద‌టి ఏడాది 4 నుంచి 5 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబ‌డి సాధించాడు గ‌యా. ఇది కేవ‌లం అర ఎక‌రా పొలానికి సంబంధించిన దిగుబ‌డి మాత్ర‌మే. మూడో ఏడాదికి వ‌చ్చేస‌రికి ఇదే అర ఎక‌రంలో 20 క్వింటాళ్ల వ‌ర‌కు దిగుబడి వ‌చ్చింది. కేజీ పండ్ల‌ను రూ. 300 చొప్పున విక్ర‌యించాడు గ‌యా. ఇప్పుడు ఎక‌రాకు 60 క్వింటాళ్ల దిగుబ‌డి వ‌స్తుంది.

అర ఎక‌రం నుంచి 2.5 ఎక‌రాల‌కు

గ‌యా త‌న డ్రాగ‌న్ ఫ్రూట్ సాగును అర ఎక‌రం నుంచి 2.5 ఎక‌రాల‌కు విస్త‌రించాడు. ఒక్కో ఎక‌రాలో 500 ఆర్‌సీసీ పిల్ల‌ర్ల‌ను ఏర్పాటు చేసి.. 2 వేల వ‌ర‌కు మొక్క‌ల‌ను నాటాడు. ప్ర‌స్తుతం ఎక‌రాకు 60 క్వింటాళ్ల దిగుబ‌డి వ‌స్తుంది. కేజీ పండ్ల‌ను రూ. 200 చొప్పున విక్ర‌యిస్తూ.. ఏడాదికి రెండున్న‌ర ఎక‌రాల‌కు క‌లిపి రూ. 30 ల‌క్ష‌ల వ‌ర‌కు ఆదాయం ఆర్జిస్తున్నాడు గ‌యా.

ఖ‌ర్చు త‌క్కువ‌.. ఆదాయం ఎక్కువ‌

డ్రాగ‌న్ ఫ్రూట్ సాగుకు ఖ‌ర్చు కూడా త‌క్కువే అని గ‌యా తెలిపాడు. ఒక్క‌సారి ఆర్‌సీసీ పిల్ల‌ర్లు ఏర్పాటు చేస్తే 20 ఏండ్ల వ‌ర‌కు వాటినే కొన‌సాగించ‌వ‌చ్చు. మొక్క‌ల మార్పిడి మాత్ర‌మే ఉంటుంది. ఇక నీటి స‌ర‌ఫ‌రా కోసం డ్రిప్ ఇరిగేష‌న్ ప‌ద్ధ‌తిని ఎంచుకున్నాడు. ఇది లో బ‌డ్జెట్‌లోనే అయిపోతుంది. కూలీల అవ‌స‌రం కూడా త‌క్కువే. కేవ‌లం పండ్ల‌ను కోసే స‌మ‌యంలోనే కూలీల అవ‌స‌రం ప‌డుతుంద‌ని గ‌యా పేర్కొన్నాడు.

Advertisement
Advertisement