త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Devendra Fadnavis Mancherial Roadshow | మోదీజీ డబ్బులు నేరుగా మంచిర్యాలకే పంపిస్తాం : మహారాష్ట్ర సీఎం భరోసా

మంచిర్యాల ప్రాంతంలోని గనులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని, తాము అధికారంలోకి రాగానే కార్మిక క్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. 

J

Adilabad | Published On Feb 7, 2026, 5.26 pm IST

Devendra Fadnavis Mancherial Roadshow | మోదీజీ డబ్బులు నేరుగా మంచిర్యాలకే పంపిస్తాం : మహారాష్ట్ర సీఎం భరోసా
Advertisement
  • నాదీ గ్యారెంటీ
  • మోదీ స్మార్ట్ సిటీగా మంచిర్యాల
  • ఢిల్లీ నుంచి వచ్చే నిధులను స్వాహా చేస్తున్న రేవంత్ రెడ్డి
  • మంచిర్యాల గడ్డపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ గర్జన

Devendra Fadnavis Mancherial Roadshow | త్రినేత్ర.న్యూస్ : తెలంగాణ రాజకీయాల్లో మార్పు మొదలైందని, వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో త్వరలో జరగనున్న మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరుపున ప్రచారం కోసం మంచిర్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన భారీ రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రోడ్డు పొడవునా పార్టీ కార్యకర్తలు, ప్రజలు ఆయనకు ఘనస్వాగతం పలికారు.

నాకు మంచిర్యాల కొత్తేం కాదు

ఈసందర్భంగా రోడ్‌షోలో ప్రసంగించిన దేవేంద్ర ఫడ్నవీస్.. నాకు మంచిర్యాల కొత్తేం కాదు. చదువుకునే రోజుల్లోనే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ ఫ్రెండ్స్ ఉన్నారు. థియేటర్‌లో సినిమా కూడా చూసేవాళ్లం. కానీ ఈసారి మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీని గెలిపించడం కోసం వచ్చాను. తెలంగాణ వచ్చినప్పుడు రాష్ట్రం బాగుపడుతుందని అంతా అనుకున్నారు. తెలంగాణ వచ్చినప్పుడు సంపన్నంగా ఉన్న హైదరాబాద్‌ని.. బీఆర్ఎస్ వచ్చిన తర్వాత లూటీ చేసింది. ఆ తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మరింత లూటీ చేసింది. వాళ్లు తెలంగాణ ప్రజలను లూటీ చేస్తారు. తెలంగాణలో పరివర్తన రావాల్సిన సమయం ఆసన్నమైంది. అది మున్సిపల్ ఎన్నికలతోనే ప్రారంభం కానుంది. దేశమంతా బీజేపీతోనే పరివర్తనం చెందుతోంది.. అని ఫడ్నవీస్ స్పష్టం చేశారు.

ఢిల్లీ నిధులు మీ దాకా రావడం లేదు

ఢిల్లీ నుంచి రాష్ట్రానికి పంపిస్తున్న నిధులు పట్టణాలు, గ్రామాల దాకా రాకుండా, పట్టణాల అభివృద్ధికి సీఎం రేవంత్ రెడ్డి అడ్డుకట్ట వేస్తున్నారని దేవేంద్ర ఫడ్నవీస్ మండిపడ్డారు. మోదీ వచ్చాకనే గ్రామాలతో పాటు పట్టణాలు అభివృద్ధి చెందాయని.. కేంద్రం నుంచి రాష్ట్రానికి నిధులు వస్తున్నా అవి మున్సిపాలిటీలను చేరడం లేదన్నారు. అందుకే ఈసారి మీరు బీజేపీ అభ్యర్థిని గెలిపిస్తే నేరుగా ఢిల్లీ నుంచి మంచిర్యాలకే నిధులు వస్తాయి. డైరెక్ట్ గా కార్పొరేషన్ కే వస్తాయి. రేవంత్ రెడ్డి కూడా వాటిని ఆపలేరు. నేను గ్యారెంటీ ఇస్తున్నాను. మోదీ పైసా నేరుగా మంచిర్యాలకు వస్తుంది. మోదీ స్మార్ట్ సిటీ మంచిర్యాల అవుతుంది. గోదావరి పక్కనే ఉన్నా మంచిర్యాలకు తాగడానికి మంచినీళ్లు లేవు. ఇదేనా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించే తీరు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణలోని ప్రస్తుత ప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలను ఆయన ఎండగట్టారు. పేదల సంక్షేమాన్ని విస్మరించి, కేవలం కొందరి ప్రయోజనాల కోసమే పాలన సాగుతోందని విమర్శించారు.  మంచిర్యాల ప్రాంతంలోని గనులు, కార్మికుల సమస్యల పరిష్కారానికి బీజేపీ కట్టుబడి ఉందని, తాము అధికారంలోకి రాగానే కార్మిక క్షేమం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.  ప్రపంచవ్యాప్తంగా భారతదేశ గౌరవాన్ని పెంచిన ప్రధాని మోదీ నాయకత్వాన్ని తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆయన అన్నారు.

ఆ తర్వాత సిర్పూర్ కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విజయ సంకల్ప సభలో దేవేంద్ర ఫడ్నవీస్ పాల్గొన్నారు. మహారాష్ట్ర సీఎం వెంట తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు రామ్‌చందర్ రావు, బీజేపీ ముఖ్య నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫడ్నవీస్ రాకతో జిల్లాలో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం నెలకొంది. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ గెలుపును ఎవరూ అడ్డుకోలేరని ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement