త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bengaluru Auto Scam | బెంగళూరులో ‘ఆటో’ దౌర్జన్యం.. అమాయక యువకులపై దాడి చేసి డబ్బుల వసూలు! చివరగా పట్టించిన యూపీఐ

బెంగళూరుకు తొలిసారి వచ్చిన ఇద్దరు అమాయక యువకులకు ఓ ఆటో డ్రైవర్ చుక్కలు చూపించాడు. దారి మళ్లించి, బెదిరించి రూ.2400 ఎలా లాక్కున్నాడంటే?

J

Viral news | Published On Jun 23, 2026, 11.55 pm IST

Bengaluru Auto Scam | బెంగళూరులో ‘ఆటో’ దౌర్జన్యం.. అమాయక యువకులపై దాడి చేసి డబ్బుల వసూలు! చివరగా పట్టించిన యూపీఐ
Advertisement
  • బెంగళూరులోని SMVT రైల్వే స్టేషన్ నుంచి హోసూరు వెళ్లేందుకు ఆటో ఎక్కిన ఇద్దరు యువకులు
  • మొదట ఒక్కొక్కరికి రూ.50 అని చెప్పి, ఆ తర్వాత నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి రూ.3,000 డిమాండ్ చేసిన డ్రైవర్
  • మరో వ్యక్తితో కలిసి కుర్రాళ్లపై దాడి చేసి, ఫోన్లు లాక్కొని దౌర్జన్యం
  • చివరికి UPI ద్వారా రూ.2,400 తీసుకుని వదిలేసిన నిందితులు.. పోలీసుల దృష్టికి తీసుకెళ్లిన ఓ టెకీ

Bengaluru Auto Scam | త్రినేత్ర.న్యూస్ : సిలికాన్ సిటీ బెంగళూరులో (Bengaluru) కొంతమంది ఆటో డ్రైవర్ల దౌర్జన్యాలు రోజురోజుకూ శృతి మించుతున్నాయి. తాజాగా, తొలిసారి నగరానికి వచ్చిన ఇద్దరు అమాయక యువకులను ఓ ఆటో డ్రైవర్, అతని అనుచరుడు దారి మళ్లించి.. దాడి చేసి డబ్బులు లాక్కున్న ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఈ 'ఆటో హారర్ స్టోరీ'ని సాను (Sanu) అనే టెక్కీ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా పంచుకోవడంతో ఈ భయానక వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

రూ.50 అని చెప్పి.. నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లి..

బతుకుదెరువు కోసం ఊరి నుంచి వచ్చిన 16-18 ఏళ్ల వయసున్న ఇద్దరు యువకులు ఎస్ఎంవీటీ (SMVT) రైల్వే స్టేషన్‌లో దిగారు. అక్కడి నుంచి తమిళనాడులోని హోసూరు (Hosur) వెళ్లేందుకు బస్ స్టాండ్ వద్ద డ్రాప్ చేయమని ఓ ఆటోను ఆశ్రయించారు. బస్ స్టాండ్‌లో దింపడానికి ఒక్కొక్కరికి రూ. 50 చొప్పున డ్రైవర్ బేరం కుదుర్చుకున్నాడు. కానీ, ఆ కుర్రాళ్లకు నగరం కొత్తని గ్రహించిన ఆటో డ్రైవర్ పక్కా స్కెచ్ వేశాడు.

దారి మధ్యలో డ్రైవర్ తన స్నేహితుడిని ఆటోలో ఎక్కించుకున్నాడు. ఆ యువకులను బస్ స్టాండ్‌కు తీసుకెళ్లకుండా, దారి మళ్లించి ఎలక్ట్రానిక్ సిటీ దాటాక అత్తిబెలె (Attibele) సమీపంలోని ఓ నిర్జన ప్రదేశానికి తీసుకెళ్లారు. అక్కడ ఆటో ఆపి ఏకంగా రూ. 3,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు.

ఫోన్లు లాక్కొని.. దాడులు చేసి..

తమ దగ్గర అంత డబ్బు లేదని ఆ యువకులు భయంతో చెప్పడంతో.. ఆ ఇద్దరు వ్యక్తులు వారిపై దాడి చేసి మొబైల్ ఫోన్లను (Mobile phones) లాక్కున్నారు. సరిగ్గా ఫోన్లు లాక్కునే సమయంలో ఆ కుర్రాళ్లు టెకీ సానుతో కాల్‌లో ఉన్నారు.

"కాల్‌లో ఉన్నప్పుడు వెనకాల పెద్దగా అరుపులు వినిపించాయి. ఆ వెంటనే ఫోన్ లాక్కొని కట్ చేశారు. నేను ఎన్నిసార్లు తిరిగి కాల్ చేసినా వారు కట్ చేస్తూనే ఉన్నారు" అని సాను తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.

కొంపముంచిన 'యూపీఐ' (UPI) పేమెంట్

చివరగా ఆ గూండాలు రూ. 2,400 కు సెటిల్ చేసుకుని, వెనక్కి చూడకుండా వెళ్లిపోవాలని బెదిరించి కుర్రాళ్ల ఫోన్లు తిరిగిచ్చారు. ఆటో నంబర్ ప్లేట్ చూడొద్దని వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి పరారయ్యారు. అయితే, ఆ కుర్రాళ్ల దగ్గర క్యాష్ లేకపోవడంతో ఆ మొత్తాన్ని యూపీఐ (UPI) ద్వారా పే చేశారు. ఇదే ఇప్పుడు ఆటో డ్రైవర్‌ కొంపముంచింది! యూపీఐ పేమెంట్ హిస్టరీ ద్వారా నిందితుల వివరాలు సులభంగా దొరికిపోతాయని టెకీ సాను తెలిపాడు.

ఎక్స్ ప్లాట్‌ఫామ్‌లో ఈ పోస్ట్ వైరల్ కావడంతో నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగరంలో ఆటో, క్యాబ్ డ్రైవర్ల ఆగడాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వెంటనే స్పందించిన బెంగళూరు సిటీ పోలీసులు (Bengaluru City Police).. బాధితుల వివరాలు నేరుగా సేకరించి దర్యాప్తు ప్రారంభించారు.

Advertisement

తాజావార్తలు

Advertisement